– ఒకరి చావును కోరడం సమర్థనీయం కాదు
– కేసీఆర్పై వ్యాఖ్యలకు ఎమ్మెల్యే శంకర్ వివరణ
హైదారాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై చెలరేగిన రాజకీయ దుమారంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పందిస్తూ మీడియా వేదికగా వివరణ ఇచ్చారు. వ్యక్తిగతంగా ఏ ఒక్కరి చావును కోరుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదని అంగీకరించారు. అయితే, సభలోనూ బయటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, దళిత వర్గానికి చెందిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను, మహిళా మంత్రులను బీఆర్ఎస్ నేతలు అత్యంత అసభ్యకరంగా, కులాల పేరుతో దూషిస్తూ లక్ష్మణ రేఖ దాటుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతల బూతులు వినలేక టీవీలు చూస్తున్న మహిళలు చెవులు మూసుకుంటున్నారని, బీఆర్ఎస్ నేతలు వారి సొంత కుటుంబ సభ్యులు కూడా తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే అసెంబ్లీకి రాకుండా దూరంగా ఉంటున్న కేసీఆర్ వెంటనే సభకు వచ్చి ప్రజా సమస్యలపై చర్చలో పాల్గొనాలని కోరే క్రమంలో కడుపు మండి మాట్లాడాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలదని, కేసీఆర్ కుటుంబానికి మాత్రమే సొంతం కాదని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైఖరిని కూడా ఎమ్మెల్యే శంకర్ తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీని ఉద్దేశించి ‘ఎక్కడ సచ్చిండు రాహుల్ గాంధీ?’ అంటూ మూడు రోజుల క్రితం కరీంనగర్ పర్యటనలో కేటీఆర్ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్లను ఆయన మీడియా సమక్షంలో ప్రదర్శించారు. కాంగ్రెస్ అగ్రనేతలపై అంతటి దిగజారుడు పదజాలాన్ని ఉపయోగించిన బీఆర్ఎస్ నేతలు తమకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





