– విచారణకు ఆదేశించిన సింగపూర్ ప్రభుత్వం
న్యూదిల్లీ, సెప్టెంబర్ 7 : సింగపూర్లో స్థానిక భారతీయులను, భారత సంతతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో సాగుతున్న జాత్యహంకార, ద్వేషపూరిత వ్యాఖ్యలపై ఆ దేశ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల చైనా-నేపాల్ సరిహద్దుల్లో సంభవించిన ప్రకృతి వైపరీత్యంలో పలువురు సింగపూర్ పౌరులు గల్లంతైన ఘటనలతో పాటు, ఎయిర్ ఇండియాలో సింగపూర్ ఎయిర్లైన్స్ పెట్టుబడుల వ్యవహారాన్ని ముడిపెడుతూ కొంతమంది ఆన్లైన్లో భారతీయులపై తీవ్ర స్థాయిలో ద్వేషాన్ని చిమ్మడంపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, సీనియర్ మంత్రులు కే. షణ్ముగం, లీ సీన్ లూంగ్లు తీవ్రంగా స్పందించారు. ఈ జాత్యహంకార వ్యాఖ్యలను ‘‘అత్యంత సిగ్గుచేటు, హేయం, ఎంతమాత్రం సహించరానివి’’గా అభివర్ణించిన సీనియర్ మంత్రి కె.షణ్ముగం, వీటిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. సమాజంలో మత, జాతిపరమైన సామరస్యానికి భంగం కలిగించే ఈ పోస్టులను వెంటనే తొలగించాలని డిజిటల్ అభివృద్ధి, సమాచార మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను కోరింది. ఏ ఒక్క వర్గంపైనా ద్వేషాన్ని సాధారణ అంశంగా మారనివ్వబోమని, తప్పు చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సింగపూర్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



