అప్ర‌క‌టిత క‌రెంట్ కోత‌ల‌తో అవ‌స్థ‌లు

– కాంగ్రెస్ తీరువ‌ల్ల విద్యుత్ కేంద్రాల్లో ప‌డిపోయిన ఉత్ప‌త్తి
– నీటిని ఎత్తిపోయ‌లేదు.. రిజ‌ర్వాయ‌ర్లు నింప‌లేదు
– ఇత‌ర రాష్ట్రాల‌కు నాణ్య‌మైన బొగ్గు స‌ర‌ఫ‌రా
– తెలంగాణ‌కు త‌క్కువ ర‌కం బొగ్గు ఎందుకిస్తున్నారు?
– పంట బోన‌స్‌ను పెద్ద బోగ‌స్ చేశారు
– ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డ హ‌రీష్‌రావు

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జూలై 16: రాష్ట్ర ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్ల రాష్ట్రం అంధకారం అయ్యే పరిస్థితి వచ్చింది. అప్రకటిత కరెంట్ కోతలతో రైతులు, విద్యార్థులు, వ్యాపారస్థులు, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి హ‌రీష్‌రావు అన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో గురువారం ఆయ‌న విలేక‌ర్ల‌తో మాట్లాడుతూ బీఆర్ఎస్‌ హయాంలో కరెంట్ పోతే వార్త.. ఇప్పుడు కరెంట్ ఉంటే వార్త అన్న పరిస్థితి నెలకొందని, నేడు 11 జిల్లాల్లో సబ్‌స్టేషన్ల ముందు రైతాంగం ధర్నాలు చేసిందని అన్నారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు అందుబాటులో లేకపోవడం వల్లే కరెంట్ కోతలు వస్తున్నాయన్నారు. సింగరేణి విషయంలో పీపీటీలు పెట్టి థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు లేవని ముందే చెప్పాం.. 40 లక్షల టన్నుల బొగ్గు ఉందని ప్రభుత్వం చెప్పింది.. వాస్తవానికి లేదని మేం హెచ్చరించాం.అని విమ‌ర్శించారు.. బీఆర్ఎస్ నిద్ర లేపినా కూడా ప్రభుత్వం నిద్ర లేవలేదు. కాంగ్రెస్ తీరు వల్ల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. కొత్తగూడెం, కాకతీయ, భద్రాద్రి, యాదాద్రి పవర్ స్టేషన్లలో 6–7 రోజులకు మించి బొగ్గు నిల్వలు లేవు. యాదాద్రి ప్లాంట్‌లో యూనిట్-1, యూనిట్-4లో బొగ్గు లేక ఉత్పత్తి నిలిచిపోయింది. భద్రాద్రి ప్లాంట్‌లో నిర్వహణ వైఫల్యంతో ఉత్పత్తి ఆగిపోయింది. అసలు విద్యుత్ కోతలు ఎందుకు వస్తున్నాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో లోడ్ కేవలం 15 వేల మెగావాట్లు మాత్రమే ఉంది. 7,180 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉన్నా ఉత్పత్తి జరగడం లేదు. నిన్న కేవలం 3,190 మెగావాట్ల సామర్థ్యం మేర ఉత్పత్తి జరిగింది. అంటే సగం సామర్థ్యం కూడా వినియోగించడం లేదు. ఉన్న సామర్థ్యంలో కేవలం 44 శాతం మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.. 56 శాతం సామర్థ్యాన్ని వినియోగించడం లేదు. బొగ్గు సరఫరాలో వైఫల్యం నీటి నిల్వల నిర్వహణలో వైఫల్యం విద్యుత్ కేంద్రాల నిర్వహణలో వైఫల్యం బొగ్గులో స్కాం పవర్‌లో స్కాం సాండ్‌లో స్కాం ల్యాండ్‌లో స్కాం కాంగ్రెస్ పాలన అంతా స్కాముల మయంగా మారింద‌న్నారు. రాష్ట్రం మీద అసలు సోయి ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మీ నిర్లక్ష్యం వల్ల విద్యుత్ ఉత్పత్తి తగ్గి సరఫరా తగ్గింది. అందుకే రాష్ట్రవ్యాప్తంగా కరెంట్ కోతలు పెడుతున్నారు. నీటిని లిఫ్ట్ చేయలేదు.. రిజర్వాయర్లలో నీళ్లు నింపలేదు.. థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని కూడా అసాధ్యం చేశారు. ముందస్తు ఆలోచనతో అయినా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి సజావుగా జరిగేలా చూడలేదు. సాగునీటి సరఫరాలో ఫెయిల్ అయ్యారు.. విద్యుత్ సరఫరాలో కూడా ఫెయిల్ అయ్యారు. తెలంగాణకు మొత్తంగా 23 వేల మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఉంది. అయినా ప్రస్తుతం కేవలం 3,190 మెగావాట్లే ఉత్పత్తి అవుతోంది. దీనికి కారణమేంటో ప్రభుత్వం చెప్పాలి. అడ్డగోలు ధరలకు 80 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను పవర్ ఎక్స్ఛేంజ్‌లో కొనుగోలు చేస్తున్నారు. ఆ భారం వినియోగదారులు, పారిశ్రామికవేత్తలు ఎందుకు భరించాలని ప్రశ్నిస్తున్నాం. సింగరేణి వెబ్‌సైట్ మూసివేసి ఉత్పత్తి, సరఫరా, బొగ్గు నాణ్యత వివరాలు బయటకు రాకుండా చేశారు. నాణ్యమైన సింగరేణి బొగ్గును తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌కు పంపుతున్నారు. తెలంగాణకు మాత్రం లో-క్వాలిటీ బొగ్గు పంపిస్తున్నారు.. 70 రేకులు పంపితే 30 రేకులు రిజెక్ట్ అవుతున్నాయి. అందుకే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి జరగడం లేదు. రాష్ట్ర అవసరాలు, రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టి ఇతర రాష్ట్రాలకు బొగ్గు ఎందుకు పంపిస్తున్నారో ప్రభుత్వం చెప్పాలి. మీ దగ్గర బొగ్గు ఉండి కూడా అడ్డగోలు ధరలకు పవర్ ఎక్స్ఛేంజ్‌లో విద్యుత్ ఎందుకు కొనుగోలు చేస్తున్నారో సమాధానం చెప్పాలి. ఎందుకు కేవలం 44 శాతం మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చి తెలంగాణ వ్యవసాయాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టాం. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మళ్లీ చీకట్లలోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది. లోవోల్టేజ్, మోటార్లు కాలిపోవడం, ట్రాన్స్‌ఫార్మర్లు పేలిపోవడం వంటి సమస్యలతో రైతులు సతమతమవుతున్నారు. త్రీ ఫేజ్ కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియక రైతులు రాత్రంతా పొలం వద్ద జాగారం చేయాల్సి వస్తోంది. ఇందిరమ్మ పాలన అంటే సమైక్య రాష్ట్రం నాటి విద్యుత్ కష్టాలను మళ్లీ తీసుకురావడమేనా? పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా కరెంట్ కోతలే ఉన్నాయి. రైతులు మాత్రమే కాదు.. చిన్న వ్యాపారులు, విద్యార్థులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో గంటల తరబడి కరెంట్ ఉండడం లేదు. విద్యార్థులు రాత్రి సమయంలో చదువుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. రుణమాఫీ సగం చేసి.. సగం మంది రైతులను వదిలేశారు. రైతు భరోసాను సీజన్లకు సీజన్లు ఎగ్గొట్టారు. యూరియా, ఎరువుల సరఫరాలో కోతలు విధించారు. పంట బోనస్‌ను పెద్ద బోగస్ చేశారు. వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో కోతలు విధించి రైతుల జీవితాలతో ఆటలాడుతున్నారు. మీది కోతల సర్కార్… వాతల సర్కార్. గ్రీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చిన తర్వాత 3 వేల మంది పారిశ్రామికవేత్తలు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు ఆ దరఖాస్తులు ఎందుకు క్లియర్ చేయలేదో ప్రభుత్వం చెప్పాలి. కమిషన్లు తేలక ఆపారా? లేక ఇంకేదైనా కారణం ఉందా? కమిషన్ల కక్కుర్తితో గ్రీన్ ఎనర్జీ పాలసీ అమలు చేయకుండా పారిశ్రామికవేత్తలను ఇబ్బంది పెడుతున్నారు. వెంటనే థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని పెంచాలి. థర్మల్ ప్లాంట్లకు అవసరమైన బొగ్గు సరఫరా చేయాలి. రాష్ట్రంలోని రైతులందరికీ 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే రైతాంగం తరఫున బీఆర్ఎస్ ఉద్యమం చేపడుతుందని హెచ్చరిస్తున్నాం. ఖమ్మం జిల్లాలో ఈరోజు మంత్రులు ప్రారంభించిన సీతారామ మోటార్లు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు చేసినవే. కేసీఆర్ పెట్టిన మోటార్లకు కాంగ్రెస్ ప్రభుత్వం స్విచ్ వేయడానికి మాత్రమే వెళ్తోంది. మొన్న దేవాదుల ప్రాజెక్టుకు కూడా అలాగే వెళ్లారు. సీతారామ ప్రాజెక్టుపై మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. మీడియా సమావేశంలో మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే చింత ప్రభాకర్, ఉద్యోగ సంఘాల నాయకులు దేవి ప్రసాద్ పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *