రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హ్యామ్ రోడ్ల ప్రణాళికపై మంత్రి సుధీర్ఘ సమీక్ష
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : పదేళ్లుగా అభివృద్ధికి నోచుకోకుండా ప్రజలకు ఇబ్బందికరంగా మారిన రహదారులను గుర్తించి హ్యామ్ మోడల్ లో అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం సచివాలయంలో రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. హ్యామ్ రోడ్ల నిర్మాణం ప్రతిపాదనల పనులను వేగవంతం చేయాలని సూచించారు.
హ్యామ్ పద్ధతిలో ఫేజ్-1 లో 5,189 కిమీ రహదారులు గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసినట్టు తెలిపిన మంత్రి అందుకు సంబంధించిన తదుపరి ప్రక్రియలో భాగంగా డీటెయిల్డ్ ఎస్టిమేషన్లను సిద్ధం చేయమని కన్సల్టెంట్ ను ఆదేశించారు. అనంతరం, జాతీయ రహదారుల సంస్థ ఉన్నతాధికారులతో సమీక్షించారు. రీజినల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) ఉత్తర భాగం కోసం భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లింపులు త్వరితగతిన చేపట్టాలని (ఎన్హెచ్ఏఐ) అధికారులకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
అలాగే జాతీయ రహదారి ప్రణాళిక 2025-26 కు ప్రతిపాదనలు త్వరగా సిద్ధం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన తర్వాత హ్యామ్ రోడ్లపై సమగ్ర సమీక్ష చేసి.. క్యాబినెట్ ఆమోదం అనంతరం పనులు ప్రారంభిస్తామని మంత్రి వివరించారు. పాట్ హోల్స్ లేని, సురక్షితమైన రహదారులు,గ్రామీణ- నగర ప్రాంతాల అనుసంధానం.ప్రజా ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి అన్నారు