•మంత్రి ఉత్తమ్ మాటలన్నీ ఉత్తవే..
•పాలమాకులలో వారం రోజులైనా ధాన్యం డబ్బులు ఇవ్వలేదు..
•ప్రభుత్వంపై మాజీమంత్రి హరీష్రావు మండిపాటు
సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందని మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన శుక్రవారం సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలంలోని పాలమాకులలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. వడ్ల కొనుగోళ్లు, మద్దతు ధర, వడ్లు అమ్మిన తర్వాత డబ్బులు రైతుల ఖాతాల్లో ఎప్పుడు వేస్తున్నారని తదితర విషయాలను రైతులను అడిగి ఆరా తీశారు. వడ్ల కొనుగోలు కేంద్రాలలో ఏర్పాటు చేసిన సౌకర్యాలనూ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ.. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట వంటి జిల్లాల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు దళారులకు అమ్ముకుంటున్నారన్నారు. ప్రభుత్వం నిర్ణయించినట్లుగా క్వింటాలుకు 2,320 రూపాయలు మద్దతు ధర రావాల్సి ఉండగా దళారులకు 2వేలు, 2,100 రూపాయలకే అమ్ముకుంటున్నారన్నారు. అకాల వర్షాలు, వడగండ్ల వానల భయంతో రైతులు కల్లాల్లోనే ధాన్యాన్ని దళారులకి అమ్ముకునే దుస్థితి నెలకొందన్నారు. గతేడాది వానాకాలంలో మొత్తం 1 లక్షా 53 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తామని చెప్పి కేవలం 52 వేల మెట్రిక్ టన్నులే సేకరించగలిగారన్నారు. మిగతా 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని బయటకు వొదిలేశారన్నారు.
అంటే మూడొంతుల్లో ఒక వంతు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయగలిగిందన్నారు. రెండొంతుల ధాన్యాన్ని రైతులు తక్కువ ధరకు అమ్ముకున్నారనానరు. యాసంగి పంటకు కూడా ప్రభుత్వంలో అదే నిర్లక్ష్యం కనబడుతోందని ధ్వజమెత్తారు. ఇది రైతు కంటక ప్రభుత్వం అన్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పి సగం మందికి కూడా చేయలేదనీ, రైతు బంధును వానకాలంలో ఎగ్గొట్టి యాసంగిలో రెండు మూడు ఎకరాలకే ఇచ్చారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు, గాలి దుమారం వల్ల మూడు నాలుగు లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిందనీ, అందుకు ఎకరాకి 20 వేల రూపాయల ఇన్ఫుట్ సబ్సిడీగా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీష్రావు డిమాండ్ చేశారు.
తక్షణమే జిల్లా కలెక్టర్ల ద్వారా నివేదిక తెప్పించుకొని రైతులను ఆదుకోవాలన్నారు. నంగునూరు మండలంలోని పాలమాకుల వడ్ల కొనుగులు కేంద్రంలో వడ్లు కొని వారమైనా ఇంకా రైతులకు డబ్బులు ఇవ్వలేదన్నారు. ఓ వైపు రాష్ట్ర మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డేమో 48 గంటల్లో రైతులకు డబ్బులను బ్యాంకు అకౌంట్టలో వేస్తున్నామనీ హైదరాబాద్లో చెబుతారనీ, కానీ వాస్తవంగా మాత్రం రైతులకు మంత్రి చెప్పే సమయంలో రావడం లేదన్నారు. గన్నీ బ్యాగులు నాణ్యంగా లేకపోవడం వల్ల హమాలీలకు ఇబ్బందిగా ఉందనీ, తూకంలో క్వింటాలుకు రెండు కిలోలు తరుగు తీస్తున్నారన్నారు. అటు అకాల వర్షాలు, ఇటు రైతుబంధు, మద్దతు ధర రాక ఇబ్బందులు పడుతున్న రైతాంగాన్ని వెంటనే ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్ పార్టీ తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీమంత్రి తన్నీరు హరీష్రావు డిమాండ్ చేశారు.