ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టం ప్రకారం నిధులు ఖర్చు చేయాలి

శాఖల వారీగా ప్రతినెలా ఖర్చు వివరాలు వెల్లడిరచాలి
అటవీ భూముల్లో సోలార్‌ మోటార్లు..
వెదురు, అవకాడో, పామాయిల్‌ సాగును ప్రోత్సహించండి.. : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జనవరి 17 :  ప్రతి శాఖలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టం ప్రకారం నిధులు సకాలంలో ఖర్చు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం డాక్టర్‌ బి.ఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టం అమలు తీరుపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో సమావేశం నిర్వహించారు. సబ్‌ ప్లాన్‌ చట్టం ప్రకారం శాఖల వారీగా చేసిన ఖర్చు వివరాలను ప్రతి నెల రోజులకు ఒకసారి వెల్లడిరచాలని అధికారులను ఆదేశించారు.
ఉన్న నిధులను సంపూర్ణ స్థాయిలో వినియోగించాలని కోరారు. సబ్‌ప్లాన్‌ చట్టం ప్రకారం చేస్తున్న వ్యయం ఆయా వర్గాల్లో ఆదాయం బాగా పెరిగేలా, ఆస్తులు మరింత సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

వీటికి సంబంధించిన పూర్తి వివరాలతో ఈనెల 23న నిర్వహించబోయే సమావేశానికి రావాలని అధికారులను కోరారు. సబ్‌ ప్లాన్‌ చట్టం కోటా ప్రకారం ఇప్పటివరకు నిధులు ఖర్చు చేయని శాఖల అధికారులు రాబోయే రెండు నెలల్లో లక్ష్యాన్ని చేరుకునేందుకు ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని ఆయా శాఖ అధికారులను ప్రశ్నించారు. బడ్జెట్‌ యేతర నిధులు ఖర్చు చేసే సమయంలోను ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ చట్టం ప్రకారం జనాభా దామాషా లో నిధుల ఖర్చు జరిగిందా? లేదా? అందుకు సంబంధించిన సంపూర్ణ సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు.

చట్టం అమలుకు సంబంధించి గత ఎనిమిదేళ్లుగా  క్షేత్రస్థాయిలో వివిధ శాఖల్లో అధ్యయనం చేసిన సెస్‌ నివేదికను సమావేశాలు సంబంధిత అధికారులు ప్రదర్శించారు. సెస్‌ అధికారులు పరిశీలించిన అంశాలు, వారు పరిశీలించిన అంశాలపై అధికారులు సాధించిన ఫలితాలను డిప్యూటీ సీఎం ఆరా తీశారు. ఇక నుంచి సెస్‌ అధికారులు తమ నివేదికలను ఫైనాన్స్‌, ప్లానింగ్‌ శాఖ అధికారులకు అందజేసి వారితో తరచూ సమావేశం కావాలని సెస్‌ అధికారులను ఆదేశించారు.

అటవీ భూముల్లో సోలార్‌ మోటార్లు

అటవీ భూముల్లో సోలార్‌ పవర్‌ ద్వారా మోటార్లు వినియోగించడం. ఆయా భూముల్లో వెదురు, అవకాడో, పామాయిల్‌ వంటి వాటితో పాటు అంతర పంటల సాగు ప్రాజెక్టులు డిజైన్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పథకం పనులను అనుసంధానం చేసుకోవాలని సూచించారు. ఈ ప్రయత్నం ద్వారా అడవులను సంరక్షించడం తోపాటు ఆదివాసీ, గిరిజన రైతులకు ఆదాయాలు పెరుగుతాయని తెలిపారు. మూసీ పునర్జీవనం కార్యక్రమంలో నిర్వాసితులవుతున్న ఎస్సీ, ఎస్టీ మహిళలను గుర్తించి స్వయం సహాయక సంఘ సభ్యులుగా చేర్పించి వారికి వడ్డీలేని రుణాలు అందించి వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధి పథకాలు విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీలు, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రవాణా వాహనాలు, క్లీనింగ్‌ యంత్రాలు ఆయా వర్గాలకు అందించాలని సూచించారు. ఇందిర జల ప్రభ, మరమ్మతులకు గురైన ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించి ఎస్సీ, ఎస్టీ రైతులకు ఆర్థిక చేయూతను అందించాలన్నారు.

ఆర్థిక సంవత్సరంలో సబ్‌ ప్లాన్‌ చట్టం ప్రకారం నిధులు ఖర్చు చేసేందుకు వివిధ శాఖల ప్రిన్సిపల్‌ సెక్రెటరీలతో ఎస్సీ, ఎస్టీ శాఖల ప్రిన్సిపల్‌ సెక్రటరీలు సమావేశమై ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీలు రామకృష్ణారావు, వికాస్‌ రాజ్‌, మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దాన కిషోర్‌, ఎస్సీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీధర్‌, ఎస్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ శరత్‌, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ సందీప్‌ కుమార్‌ సుల్తానియా, పంచాయతీరాజ్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ లోకేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page