‌ప్రశ్నోత్తరాలపై సమాధానం చెప్పలేక సర్కారు పరారు..

•అసెంబ్లీలో క్వశ్చన్‌ అవర్‌ ‌పెట్టాల్సిందే..
•మాజీ మంత్రి హరీష్‌ ‌రావు డిమాండ్‌

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,  మార్చి 18: అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలపై సమాధానం చెప్పలేక కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం పారిపోతోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. మంగళవారం కీలకమైన ప్రశ్నోత్తరాలు ఉన్నాయని సమాధానం చెప్పలేక రద్దు చేసుకుంది. దీని పైన స్పీకర్‌కు, కార్యదర్శికి అభ్యంతరం చెప్పామని హరీశ్‌రావు తెలిపారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో ఆయన  చిట్‌ ‌చాట్‌ ‌చేశారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం హెచ్‌ఎం‌డీఏ భూములను తాకట్టు పెట్టి 20 వేల కోట్లు అప్పు తెస్తున్నారని,  టీజీఐఐసీ 10 వేల కోట్లు, హెచ్‌ఎం‌డీఏ ఆస్తులు కుదబెట్టి 20 వేల కోట్లు, హెచ్‌ఎం‌డబ్ల్యూఎస్‌ 10 ‌వేల కోట్లు, జీహెచ్‌ఎం‌సీ ఆస్తులను తాకట్టు పెట్టి 10 వేల కోట్లు అప్పులు తెచ్చేందుకు సిద్ధమైందని, మొత్తం 50 వేల కోట్లను అప్పు చేస్తోందని ఆరోపించారు. తమ ప్రశ్నలపై సమాధానం చెప్పలేక మా గొంతు నొక్కే యత్నం చేస్తోందన్నారు. సభ్యుల హక్కులను స్పీకర్‌ ‌కాపాడాలని,  జీవోలను వెబ్‌సైట్‌లో పెట్టడం లేదని హరీశ్‌రావు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ ‌జల దోపిడీ కారణంగా మహబూబ్‌ ‌నగర్‌, ‌నల్లగొండలో పంటలు ఎండిపోతున్నాయి. రైతు భరోసా వానకాలం వేశారా లేదా అని ప్రశ్న వేస్తే దానిని రద్దు చేశారు. కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఏర్పాటు చేయకపోవడం వల్ల తక్కువ ధరకు రైతులు పంటలు అమ్ముకొని తీవ్రంగా నష్టపోయారు. తమ హయాంలో 70 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం అని అన్నారు.  ప్రస్తుత ప్రభుత్వం కేవలం 52 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల వరి ధాన్యం మాత్రమే కొనుగోలు చేసింది. మేము 54 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల సన్న వరి ధాన్యం కూడా కొనుగోలు చేస్తాం అన్నారు. కొన్నది 24 లక్షల మెట్రిక్‌ ‌టన్నులు మాత్రమే. ధాన్యం కొనుగోళ్లలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీశ్‌రావు ఫైర్‌ అయ్యారు.

యాసంగి రైతు భరోసా ఇంతవరకు ఇవ్వలేదు. వరంగల్‌ ‌జిల్లాలో దేవాదుల కింద పంటలు ఎండిపోతున్నాయి. మల్లన్న సాగర్‌, ‌దుబ్బాకలో పంటలు ఎండిపోతున్నాయి. వీటి పైన మేము ప్రశ్నలు వేస్తే  ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. రైతు రుణమాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. రుణమాఫీ పూర్తయిందని ముఖ్యమంత్రి, మంత్రులు పదే పదే చెబుతున్నారు, కానీ ఇంకా 50 శాతం మంది రైతులకు రుణమాఫీ కాలేదు. నిజామాబాద్‌ ‌జిల్లాలో రుణమాఫీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నా నియోజకవర్గంలో రైతు భరోసా క్రింద రైతులకు 39 కోట్లు మాత్రమే వేశారు. ఇంకా 37 కోట్లు రావాల్సింది. కాంగ్రెస్‌ ‌ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక హడావిడిగా ప్రశ్నోత్తరాలను ఎత్తివేశారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం సమాధానాలు ఇవ్వడానికి భయపడుతుంది. సభ్యులకు తెలియకుండా ప్రశ్నోత్తరాల్లో ప్రశ్నలు మారుతున్నాయని తెలిపారు.

నిన్న రెండు ముఖ్యమైన ప్రశ్నలు ఉండేవి. హెచ్‌ఎం‌డీఏ భూములు తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన విషయం. జీహెచ్‌ఎం‌సీ, హెచ్‌ఎం‌డబ్ల్యూఎస్‌ ‌నుంచీ అప్పులు తెచ్చిన విషయం. ఇవి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతాయని ఈరోజు ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. ఎంఐఎం వారి ప్రశ్న కూడా ఒకటి ఉండేది. మా మూడవ ప్రశ్న ‘‘యాసంగి పంటలు ఎండిపోతున్నాయి’’ అనే అంశంపై మా కేటీఆర్‌ ‌ప్రశ్న ఉండేది. శాసనసభ వ్యవహారాల మంత్రిని అడుగుతున్నా, ప్రశ్నోత్తరాలను ఎందుకు రద్దు చేశారు? ప్రభుత్వం మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక హడావిడిగా ప్రశ్నోత్తరాలను రద్దు చేసింది. స్పీకర్‌తో నిన్ననే ఫోన్‌లో మాట్లాడాను. హడావుడిగా చేసి క్వశ్చన్‌ అవర్‌ ‌లేకుండా చేశారు. ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇలా రద్దు చేయడం ఏంటి? క్వశ్చన్‌ అవర్‌ ‌మ్యాండేటరీ. జీరో అవర్‌ ‌పెట్టకపోయినా పర్వాలేదు..  కనీసం క్వశ్చన్‌ అవర్‌ ‌పెట్టాల్సిందేనని  మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ ‌చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page