- లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు
- ఐదుగురి మృతి.. నలుగురి పరిస్థితి విషమం
- 20 మందికి తీవ్ర గాయాలు
సూర్యాపేట ఖమ్మం హైవే పై శుక్రవారం తెల్లవారుజామున సుమారు నాలుగున్నర గంటలకు ఒడిశా నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ప్రైవేట్ బస్సు ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా నుంచి హైదరాబాద్కు వెళ్తున్న ప్రైవేట్ బస్సులో సుమారు 32 మంది ఉన్నట్లు వెల్లడించారు. బస్సు సూర్యాపేట ఖమ్మం హైవే చివ్వెంల మండలం ఐలాపురం స్టేజి వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, నలుగురి పరిస్థితి విషమంగా మారింది.
దీంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించగా 20 మందికి గాయాలు కావడంతో క్షతగాత్రులను సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్కి తరలించారు. హైదరాబాద్కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున కావడంతో డ్రైవర్ నిద్ర మత్తు వల్ల జరిగిందా లేదా మంచు కురవడం వల్ల జరిగిందా అనేది తెలియాల్సి ఉంది. వీరంతా ఒడిశాలోని జైనాపురికి చెందిన వారుగా గుర్తించారు.
ఈ రోడ్డు ప్రమాదంలో మరణించిన డ్రైవర్ సునీల్ రూప హరిజన్, సుల హరిజన్, ప్రభాస్ హరిజన్, సునమని హరిజన్గా గుర్తించామని వెల్లడించారు. సంఘటన స్థలానికి జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్, డిఎస్పీ రవి, రూరల్ సీఐ రాజశేఖర్లు చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చివ్వెంల మండల ఎస్సై మహేశ్వర్ వెల్లడించారు