తెలంగాణ రాష్ట్రం పైన కాషాయ జెండా ఎగురవేయాలని బిజెపి కేంద్ర నాయకత్వం చాలాకాలంగా ఎదురు చూస్తున్నది. ఉత్తరాది లో ఆ పార్టీని విస్తరించిన తరహాలో దక్షిణాదిలో కూడా పాగా వేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. అందుకు తెలంగాణ రాష్ట్రమే తమకు ముఖద్వారంగా భావిస్తూ వొచ్చింది. అయితే రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా పేరున్న బిఆర్ఎస్ పదేళ్ళకాలం ఎదురులేకుండా పాలించడంతో ఆ పార్టీకి అవకాశం లేకుండా పోయింది. దీంతో తాత్కాలికంగా కర్ణాటకతో సరిపెట్టుకుంది. ఏ రాజకీయ పార్టీ అయినా వరుసగా పది కాలాలపాటు అధికారంలో ఉన్నప్పుడు సహజంగానే ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటారు. దానికి తగినట్లుగా విపక్షాలు అధికారపార్టీ చేసిన అవకతవకలను ఎత్తిచూపి లబ్ధిపొందాలనుకుంటాయి. ఆవిధంగా తొమ్మిదిన్నర ఏండ్ల బిఆర్ఎస్ పాలనపైన బిజెపి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం ప్రారంభించింది. డబుల్ ఇంజన్ సర్కార్ వొస్తుందని ప్రచారం చేసింది.
కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండడమే కాకుండా ప్రధాని మొదలు కేంద్ర మంత్రులు, పార్టీ పెద్దలంతా తెలంగాణ పైనే దృష్టి సారించడంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం తధ్యమ నుకున్నారు. కాని, ఈలోగా రేవంత్రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దూసుకువొచ్చి, రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకున్నది . అయినప్పటికీ గత ఎన్నికలతో పోలిస్తే కొంతైనా ప్రజా బలాన్ని కూడగట్టుకోగలిగామన్న సంతృప్తి ఆ పార్టీకి మిగిలింది. ఆ ఎన్నికల్లో ఎనిమిది అసెంబ్లీ స్థానాలను రాబట్టుకోగా, ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎనిమిది ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. ఇది ఆ పార్టీకి ఊహించని విజయమనే చెప్పాలె. ఇదిలా ఉంటే ఆ తర్వాత కాలంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా దూసుకుపోవడంతో తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కూడగట్టుకోగలిగామన్న అశ చిగురించింది. అదే దూకుడుతో 2028 ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే పనిలో ఉంది కేంద్ర నాయకత్వం.
అందుకు కింది స్థాయి నుండి పై స్థాయి వరకు సంస్థాగత ఎన్నికలను నిర్వహించడం ద్వారా పార్టీలో నూతనోత్సాహాన్ని కలిగించాలని భావించింది. అంతకుముందే రాష్ట్రంలో స్థానిక ఎన్నికలుండడంతో ఆ ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తే 2028 ఎన్నికలు తమకు సులభతరమవుతాయన్న ఉద్దేశ్యంగా పావులు కదుపుతున్నది. అందులో భాగంగా పార్టీ రాష్ట్రఇన్ఛార్జి సునీల్ బన్సల్ (పార్టీ జాతీయ కార్యదర్శి) గత కొంతకాలంగా పార్టీ బలోపేతానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ముందుగా పార్టీ సభ్యత్వాలు, స్థానిక నాయకత్వ పనితీరుపై ఆయన దృష్టిసారించారు. కనీసం యాభై లక్షల సభ్యత్వాలను చేయాలని పార్టీ లక్ష్యంగా నిర్ణయించుకుంది. అయితే తాజాగా రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, సంస్థాగత ఇన్ఛార్జిలతో ఏర్పాటుచేసిన సమావేశంలో టార్గెట్ పూర్తి చేయలేకపోయారన్నది తేలిపోయింది. అంతేకాదు క్రియాశీల సభ్యత్వాల విషయంలో ఒక విధంగా పార్టీకి నష్టం వాటిల్లే విధంగా అనుసరించారంటూ బన్సల్ ఆ సమావేశంలో స్థానిక నాయకత్వంపై విరుచుకుపడినట్లు తెలుస్తున్నది. ఒకటికాదు రెండు కాదు దాదాపు పదమూడువేల ఫేక్ సభ్యత్వాలను తీసుకున్నట్లు తన దృష్టికొచ్చిందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తచేసినట్లు సమాచారం. అందుకే ప్రతీ నాయకుడి పనితీరుపై వివరణాత్మక నివేదికలను తయారు చేస్తున్నామని, వారి పనితీరు ఏమాత్రం సంతృప్తిగా లేకపోయినట్లు అయితే వారిని సస్పెండ్ చేస్తామని కూడా ఆయన హెచ్చిరించినట్లు తెలుస్తున్నది.
తెలంగాణ ఏర్పడినప్పటి నుండీ ఈ రాష్ట్రంపై కాషాయ జండాను ఎగురవేయాలన్న లక్ష్యంగా బిజెపి ప్రయత్నిస్తూనే ఉంది. అయితే ఇప్పటివరకు ఆ పార్టీకి కలిసి రావడంలేదు. సహజంగానే హైదరాబాదు, వరంగల్ లాంటి ఒకటిరెండు ప్రాంతాల్లో తప్ప మొదటి నుండి తెలంగాణలోని ఇతర జిల్లాలో బిజెపికి అంతగా పట్టు లేని విషయం తెలియంది కాదు. అయినప్పటికీ గత ఎన్నికల్లో ఎనిమిది ఎమ్మెల్యే స్థానాలు, మరో ఎనిమిది పార్లమెంటు స్థానాలను గెలుచుకున్న బిజెపి ఇప్పుడు 2028 ఎన్నికలపై దృష్టి కేంద్రీకరిస్తున్నది. అందుకు సంస్థాగత ఎన్నికల ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని పార్టీ శ్రేణులకు బన్సల్ ఆదేశించినట్లు తెలుస్తున్నది. మిగిలిపోయిన మండల అధ్యక్షుల నియామకాలను వొచ్చేనెల నాల్గవ తేదీలోపు పూర్తి చేయడంతోపాటు మే 15లోగా మండల కమిటీలను ఏర్పాటు చేయాలని సమావేశం నిర్ణయించింది.
అనంతరం రెండేసి ఉమ్మడి జాల్లాల పార్టీ మండల అధ్యక్షులతో సమావేశాలుంటాయని, ఈ తతంగమంతా పూర్తి అయిన తర్వాత జిల్లా అధ్యక్షుల ఎన్నికలు, చివరగా రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఉంటుంది. పహల్గాం ఉగ్రదాడి వల్ల పార్టీ జాతీయ స్థాయి అధ్యక్షుడి ఎన్నికలో ఆలస్యం జరిగే అవకాశముంది. దానితో రాష్ట్ర కమిటీ ఏర్పాటు ముడివడి ఉంటుం దంటున్నారు. ఆ పార్టీ నాయకులు. ఏదిఏమైన రాష్ట్రంలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే నాయకులు, కార్యర్తలంతా ప్రజల్లోకి వెళ్ళాలని పార్టీ ఆదేశించింది. ఇప్పుడు బిజెపి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ మాత్రమే. కాంగ్రెస్ పాలనా తీరుపై ఇప్పటికే ప్రజల్లో అసహనం కనిపిస్తుందనీ .. అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకుపోవడం ద్వారా ప్రజలతో మమేకం కావాలని పార్టీ నాయకులను ఆదేశించినట్లు తెలుస్తున్నది.