కంచ గచ్చిబౌలి భూముల్లో పర్యావరణ విధ్వంసం

పండుగ రోజులు, సెలవు దినాల్లో చెట్ల నరికివేత
జింకల మృతికి ప్రభుత్వానిదే బాధ్యత
మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు
సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి కంచ గచ్చిబౌలి భూముల నివేదిక అందజేత

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 10: కంచ గచ్చిబౌలి భూముల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని నియమ నిబంధనలు ఉల్లగించిందని, పండుగ రోజులు, సెలవు దినాల్లో పర్యావరణ విధ్వంసం చేసిందని, ఈ అంశంలో అన్ని వివరాలతో సెంట్రల్ కమిటికి నివేదించామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు వెల్లడించారు.

కంచె గచ్చిబౌలి భూముల్లో పర్యావరణ విధ్వంసం, ఉల్లంఘనలు, హెచ్ సీయూ విద్యార్థులు, ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ వేత్తలు లేవనెత్తుతున్న అంశాలు, వాస్తవాలతో కూడిన నివేదికను హోటల్ తాజ్ కృష్ణలో సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి మాజీ మంత్రి హరీశ్ రావు నేతృత్వంలోని బిఆర్ఎస్ ప్రతినిధి బృందం అందజేసింది. అనంతరం తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, ప్రతినిధులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. అడవుల విధ్వంసం, వన్య ప్రాణుల పట్ల ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందని మండిపడ్డారు. కంచ గచ్చిబౌలి అంశంపై 11 పేజీలతో రిప్రెంజంటేషన్ ఇచ్చామని, దాదాపు 200 పేజీల డాక్యుమెంట్స్ ఇచ్చామని తెలిపారు. కమిటీ మమ్మల్ని ప్రశ్నలు వేశారు, అన్నిటికి సమాధానాలు చెప్పాం.పేద రైతు తన పొలంలో ఉన్న చింత చెట్టు, యాప చెట్టు కొట్టుకుంటే పోలీసులు, ఎమ్మార్వో వెళ్లి లక్షల జరిమానా వేస్తారు. వేల సంఖ్యలో చెట్లు నరుకుతుంటే ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు.

రైతుకు ఒక న్యాయం, సీఎంకు ఒక న్యాయమా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఎవరికైనా ఇల్లు కట్టాలంటే వాల్టా చట్టం ప్రకారం, గ్రామీణంలో రూ.50, పట్టణంలో రూ.100 చలానా కట్టి దరఖాస్తు చేయాలి. ఆ తర్వాత కమిటీ చెప్పిన ప్రకారం, రూ. 450 డిపాజిట్ చేయాలి. ఒకటి బదులు రెండు చెట్లు పెట్టాలని నిబంధన ఉంటుంది. అలా అనుమతి పొందిన తర్వాత చెట్టు కొట్టాలి. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ఏం జరిగింది. అటవీశాఖకు ఒక్క దరఖాస్తు కూడా పెట్టలేదు. నిజానికి అటవీ భూమిలో కాదు, సొంత భూమిలో చెట్టు కొట్టినా అనుమతి పొందాలని చెప్పారు. కంచె చేను మేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజ్ చేస్తున్నది. వేలాది చెట్లను నరుకుతున్నదని ఫైర్ అయ్యారు. చెట్లు కొట్టడానికి పోలీసు స్టేషన్లలో టిజిఐఐసి దరఖాస్తు చేసింది.  పోలీసులు న్యాయబద్ధమైన పనా కాదా అని ఆలోచన చేయాలి కదా టీజీఐఐసీ దరఖాస్తే నేరపూరితమైంది. చెట్లు నరకడానికి ఫారెస్టు అనుమతి ఉందా, వాల్టా చట్టం అనుమతి ఉందా అని అడిగి పోలీసులు అనుమతి ఇవ్వాలి.  పోలీసు రక్షణలో రాత్రింబవళ్లు 50 బుల్డోజర్లు పెట్టి చెట్లను ఊచకోత కోశారు. మూడు జింకలు చనిపోయాయి. ఆవాసాలు కోల్పోయి జంతువులు ఇండ్లకు వొస్తున్నాయి.  బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ జింకను చంపితే జైలులో పెట్టారు. మూడు జింకలు చంపితే రేవంత్ రెడ్డి పై ఏం చర్యలు తీసుకోవాలి, ఈ ప్రభుత్వంపై ఏం చర్యలు తీసుకోవాలి. ఏడేళ్లు శిక్ష వేయాలని చట్టం ఉంది.

మూడు జింకలు చనిపోతే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాదా.అని ప్రశ్నించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పీసీసీఎఫ్ కి రెండో ఏప్రిల్ నాడు లెటర్ రాశారు. అనుమతి లేకుండా చెట్లు కొడుతున్నారని ఫిర్యాదు చేసిన తర్వాత కూడా స్పందించరా? యూనివర్సిటీ విద్యార్థులు ధర్నా చేస్తే కనిపించడం లేదా? అటవీ శాఖ నేరపూరిత నిర్లక్ష్యం వేల సంఖ్యలో చెట్లు కుప్ప కూలాయి, జింకలు మృత్యువాత పడ్డాయి. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో అనేక రకాల ఉల్లంఘనలు జరిగాయి. సుప్రీంకోర్టు ఆర్డర్ 2025 మార్చి 4 ఫారెస్టు భూమి అని రాయాల్సిన అవసరం లేదు. ఫారెస్ట్ నేచర్ కలిగిన భూముల వివరాలు సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలను కోరింది. ఆ కమిటీ ఒకవైపు పని చేస్తున్నది. వీళ్లు ఆ భూములను గుర్తించి తెగనమ్మే యత్నం చేస్తున్నారు. కంచ గచ్చిబౌలి భూముల్లో 2011లో లక్షల మొక్కలు పెట్టారు, మన్మోహన్ కూడా మొక్కలు నాటారు.

హైడ్రా విషయంలో శని ఆదివారాల్లో కూల్చొద్దని హైకోర్టు కూడా చెప్పింది. దాన్ని కూడా ఉల్లంఘించింది రాష్ట్ర ప్రభుత్వం. ఉగాది రంజాన్ ఆదివారం సెలవులు చూసుకొని ఉల్లంఘనలు చేశారు. వందల ఎకరాల్లో లక్షల కొద్దీ చెట్లు కొడుతున్న సీఎం, సీఎస్, పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ప్రశ్నించిన పాపానికి వారిని జైళ్లో పెట్టారు. పది రోజులుగా వాళ్లు జైల్లో ఉన్నారు. దీనికి బాధ్యత హోం మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిదేనని అన్నారు. ఈ భూముల్లో చెరువు కూడా ఉందని, హెచ్  సీయూ భూముల్లో చెట్ల నరికివేతతో ఏడు చట్టాలను సీఎం రేవంత్ దుర్వినియోగం చేశారని హరీష్ రావు విమర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page