రాజీవ్‌ స్వగృహ ఓపెన్‌ ప్లాట్లకు ఈ-వేలం

– కుర్మల్‌గుడ, బహదూర్‌పల్లి, తొర్రూర్‌లలో మొత్తం 167 ప్లాట్ల విక్రయం
– ఈనెల 28 నుంచి 30వ‌ర‌కు నిర్వహణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 25: ఎలాంటి వివాదాలు లేని నివాసయోగ్యమైన ఓపెన్‌ ప్లాట్లను ఇ-వేలం ద్వారా నిర్వహించడానికి తెలంగాణ రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ మరోసారి నోటిఫికేషన్‌ ఇచ్చింది. తమ అభిరుచులకనుగుణంగా ఇంటిని నిర్మించుకునేందుకు అనువుగా ఉన్న స్థలాలను(ప్లాట్లను) కొనుగోలు చేయడానికి ఇది మరో చక్కటి అవకాశం అని రాజీవ్‌ స్వగృహ మేనేజింగ్‌ డైరక్టర్‌ వి.పి.గౌతం తెలిపారు. రంగారెడ్డి జిల్లాలోని కుర్మల్‌గుడ, తొర్రూర్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోని బహదూర్‌పల్లి ప్రాంతాల్లోని మొత్తం 167 ప్లాట్లకు ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు మూడు రోజులపాటు ఈ-వేలం ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తొర్రూర్‌లో 200-500 చదరపు గజాల విస్తీర్ణంలోని 120 ప్లాట్లకు, కుర్మల్‌గుడలో 200-300 చ. గజాల విస్తీర్ణంలోని 29 ప్లాట్లు, బహదూర్‌పల్లిలో 200 -1000 చ. గజాల విస్తీర్ణంలోని 18 ప్లాట్లను ఈ-వేలం ద్వారా విక్రయిస్తున్నామన్నారు. ప్రజలకు చక్కటి వసతులతో కూడిన నివాస భూములను అందుబాటులోకి తెచ్చే ప్రక్రియలో భాగంగా పూర్తి పారదర్శకమైన విధానంలో ఈ-వేలం ద్వారా వీటిని విక్రయిస్తున్నామని వివరించారు. ఈ ప్రాంతాల్లోని ప్లాట్లకు గతంలో బహిరంగ వేలం నిర్వహించగా ప్రస్తుతం ఈ-వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయించామన్నారు. ఆసక్తిగల వారు ముందుగా ఆన్‌లైన్‌లో ఎంఎస్‌టీసీ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేయించుకోవాలన్నారు. ఈ వేలం పాటల్లో పాల్గొంటున్న బిడ్డర్ల వివరాలు, బిడ్డింగ్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎవరికీ తెలియవని, అందువల్ల కొనుగోలుదారులు స్వేఛ్చగా వేలం ప్రక్రియలో పాల్గొని నచ్చిన ధరకు స్థలాలను కొనుగోలు చేయవచ్చని గౌతం తెలిపారు. ఈ ప్లాట్లన్నీ కనీస మౌలిక సదుపాయాలు కల్పించిన, అభివృద్ధి చెందిన లే అవుట్లలో ఉన్నాయి. తొర్రూర్‌లో సుమారు 100 ఓపెన్‌ ప్లాట్ల విక్రయానికి గతంలో నిర్వహించిన వేలం ప్రక్రియలో చదరపు గజం భూమి ధర గరిష్టంగా రూ 67.500 వేల వరకు పలికి హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. అయినప్పటికీ ప్రస్తుత నోటిఫికేషన్‌లో చదరపు గజానికి కనీస ధర రూ.25 వేలు గాను, కుర్మల్‌గుడలో సైతం గతంలో చ.గజానికి సుమారు రూ.29 వేల ధర పలికినా ప్రస్తుత కనీస ధర రూ.20 వేలుగా నిర్ధారించారు. బహదూర్‌పలిల్లో సైతం గతంలో ఆఫ్‌సెట్‌ ధర కంటే చాలా అధికంగా రూ.47 వేల వరకు చ.గజం ధర పలికినా గతంలోని కనీస ధరలకే (కార్నర్‌ ప్లాట్లు రూ.30 వేలు, ఇతర ప్లాట్లకు రూ.27 వేలు) ప్రస్తుతం కూడా విక్రయిస్తున్నట్లు ప్రకటించారు.

ఈ-వేలం షెడ్యూల్‌

కుర్మల్‌గుడ, బహదూర్‌పల్లిలోని ఫ్లాట్లకు ఎంఎస్‌టీసీ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌కు ఆఖరు తేదీ అక్టోబరు 27వ తేదీ కాగా 28వ తేదీ ఉదయం కుర్మల్‌గుడలోని 29 ప్లాట్లకు, మధ్యాహ్నం బహదూర్‌పల్లిలోని 18 ప్లాట్లకు ఈ-వేలం నిర్వహిస్తారు. అలాగే తొర్రూర్‌లోని 120 ప్లాట్ల కొనుగోలుదారులు 28వ తేదీ నాటికి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి 29, 30 తేదీల్లో ఒక్కో సెషన్‌లో 30 ప్లాట్లు చొప్పున మొత్తం నాలుగు సెషన్స్‌లో వేలం నిర్వహించనున్నారు. పూర్తి వివరాలు రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ వెబ్‌సైట్‌ www.swagruha.telnagana.gov.in లో చూడవచ్చు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page