“ప్రమాదాలు జరిగినప్పుడు కూడా బస్సులలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, లైఫ్ సేవింగ్ కిట్స్ వంటి అత్యవసర అంశాలను అధికారులు పరిశీలించడం లేదనేది బహిరంగ రహస్యం. ఇప్పటికీ ఏ బస్సులో కూడా అవి సరిగా అందుబాటులో కనిపించడం లేదంటే రవాణా శాఖ ఏం చేస్తోంది? ఏదో ఒక పెద్ద యాక్సిడెంట్ అయిందని ఆనాటి నుండి వారం రోజులు మాత్రమే తనిఖీలు నిర్వహించి, ఆ తర్వాత యథావిధిగా క్లోజ్ చేయడం అధికారులకు అలవాటే కదా? చూసీ చూడనట్టు వదిలేయడం అధికారులకు ఒక అలవాటుగా మారడం ఇదేనా ప్రభుత్వం? ఇదేనా అధికార యంత్రం? చట్టాన్ని అక్రమించి అధికారులు కూడా రాజకీయ నాయకులకు వత్తాసు పలికిన సందర్భాలు లేకపోలేదు.”

రెండు తెలుగు రాష్ట్రాలలో రోడ్డు ప్రమాదాలు జరిగి అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోయినప్పుడే రవాణా శాఖ అధికారులకు, ప్రభుత్వాలకు తనిఖీలు గుర్తుకొస్తున్నాయా? పత్రికా ప్రకటనల కోసం చేసే తూతూ మంత్రం తనిఖీలతో నిత్యం జరుగుతున్న ప్రమాదాలను ఎలా అరికట్టగలుగుతున్నారు? అని పౌర సమాజం, మేధావులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రోడ్లపై తిరుగుతున్న ప్రైవేట్ బస్సులు, ట్రావెల్స్ను తనిఖీ చేయడం అనేది ఏదైనా పెద్ద యాక్సిడెంట్ జరిగిన తర్వాతే రవాణా శాఖ (రవాణా) అధికారులకు, ప్రభుత్వానికి గుర్తు వస్తుందా? అని ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యంగా, ప్రభుత్వంలో ఉన్న నాయకులకు సంబంధించిన ట్రావెల్స్, 90% ప్రైవేట్ స్కూల్ బస్సులు రాజకీయ నాయకులకు చెందినవే అయినప్పుడు, అప్పటిదాకా నిబంధనల అమలులో లేని ఈ తనిఖీలు ఇప్పుడే ఎందుకు మొదలు పెడుతున్నారో తెలియడం లేదు. ప్రమాదాల ద్వారా సంభవిస్తున్న ఈ ప్రాణనష్టాలన్నింటినీ ప్రభుత్వ హత్యల కిందనే నమోదు చేయాలి అని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. చట్ట ప్రకారం నడుచుకోవాల్సిన అధికారులు, రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయి, నిబంధనల ఉల్లంఘనలను చూసీ చూడనట్లు వదిలేయడం అత్యంత బాధాకరం.
రాజకీయ ఒత్తిళ్లతో పక్కదారి పట్టిన విధి నిర్వహణ!
అధికారులు తనిఖీలు నిర్వహించడానికి ప్రయత్నించిన ప్రతి సందర్భంలోనూ రాజకీయ ఒత్తిళ్లతో వాటిని నిలిపివేసిన సందర్భాలు అనేకంగా ఉన్నాయి. అందువల్ల ఈ మరణాలను రాజకీయ హత్యలు అందామా? లేక అధికారుల విధి నిర్వహణలో నిరంతర నిర్లక్ష్యం కాబట్టి ప్రభుత్వ హత్యలు అందామా? అనే గందరగోళం నెలకొంది. అధికారులు మత్తు వీడి ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడితే తప్ప ప్రమాదాలు అరికట్టలేని పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రమాదాలు జరిగినప్పుడు కూడా బస్సులలో తప్పనిసరిగా ఉండాల్సిన ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, లైఫ్ సేవింగ్ కిట్స్ వంటి అత్యవసర అంశాలను అధికారులు పరిశీలించడం లేదనేది బహిరంగ రహస్యం. ఇప్పటికీ ఏ బస్సులో కూడా అవి సరిగా అందుబాటులో కనిపించడం లేదంటే రవాణా శాఖ ఏం చేస్తోంది? ఏదో ఒక పెద్ద యాక్సిడెంట్ అయిందని ఆనాటి నుండి వారం రోజులు మాత్రమే తనిఖీలు నిర్వహించి, ఆ తర్వాత యథావిధిగా క్లోజ్ చేయడం అధికారులకు అలవాటే కదా? చూసీ చూడనట్టు వదిలేయడం అధికారులకు ఒక అలవాటుగా మారడం ఇదేనా ప్రభుత్వం? ఇదేనా అధికార యంత్రం? చట్టాన్ని అక్రమించి అధికారులు కూడా రాజకీయ నాయకులకు వత్తాసు పలికిన సందర్భాలు లేకపోలేదు.
ప్రభుత్వాలు, అధికారులకు ఘాటైన హెచ్చరిక లాంటిదే..? నిరంతర తనిఖీలు చేపట్టాలి!
తక్షణమే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు మేల్కొనాలని పౌర సమాజం తీవ్రంగా డిమాండ్ చేస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్, విద్యాసంస్థల బస్సులపై నిరంతరాయంగా, పారదర్శకంగా తనిఖీలు నిర్వహించడానికి శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కేవలం ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే తనిఖీలు చేసి, చేతులు దులుపుకోవడం మానుకోవాలి. రవాణా శాఖ అధికారులు మత్తు వీడి నిరంతరం ట్రావెల్స్ పై నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిర్లక్ష్యం వల్ల జరిగే ప్రతి ప్రాణ నష్టాన్ని ప్రభుత్వ హత్యగా పరిగణించాల్సిన పరిస్థితిని సృష్టించవద్దు అని పౌర సమాజం తీవ్ర స్థాయిలో హెచ్చరిస్తోంది.
విద్యాసంస్థల బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. నిబంధనలు పాటించాల్సిందే!
ఈ నేపథ్యంలో, జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలలు మరియు కళాశాలలకు చెందిన బస్సులపై పోలీసులు మరియు రవాణా శాఖ అధి కారులు సంయుక్తంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహించడం గమనార్హం. విద్యార్థుల భద్రత, రక్షణను అత్యంత ప్రాధాన్యంగా పరిగణిస్తూ ఈ ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ తనిఖీలలో బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్లు (ఎఫ్సి), ఇన్సూరెన్స్ పత్రాలు, డ్రైవర్ల లైసెన్సులు, వాహనాల రిజిస్ట్రేషన్ పత్రాలు తదితరాలను అధికారులు పరిశీలించారు. అంతేకాకుండా, బస్సుల్లో ఉండే ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు, సీటింగ్ సామర్థ్యం వంటి అంశాలను కూడా అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల సందర్భంగా కొన్ని వాహనాల్లో నిర్లక్ష్యంగా నిర్వహణ జరిగినట్లు గుర్తించగా వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. అయితే, ఈ చర్యల తర్వాత కూడా, పౌర సమాజం మరియు ప్రజలు విద్యా సంస్థల యాజమాన్యాలకు మరియు డ్రైవర్లకు కొన్ని కీలక సూచనలు జారీ చేస్తున్నారు.
విద్యార్థుల భద్రత విషయంలో రాజీపడటం జరగదని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని పౌర సంఘాలు హెచ్చరిస్తున్నాయి. డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, అతివేగం వలన కలిగే ప్రమాదాలు వంటి అంశాలపై స్వీయ నియంత్రణ పాటించాలని ప్రజలు కోరుకుంటున్నారు. డ్రైవర్లు ఎప్పటికప్పుడు తగిన విశ్రాంతి తీసుకోవడం, మద్యం లేదా మత్తు పదార్థాల ప్రభావంలో వాహనాలు నడపకూడదనే నిబంధనను తప్పక పాటించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు తమ విద్యార్థుల రవాణా బాధ్యతను అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలని, వాహనాలపై రవాణా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పౌర సమాజం గట్టిగా కోరుతోంది. ఉదయం, సాయంత్రం సమయంలో డ్రైవర్ వాహనం తీసుకుని విద్యార్థుల కోసం వెళుతున్న సమయంలో స్కూల్ యాజమాన్యం తప్పకుండా చెక్ చేసి పంపాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏ ఒక్క నిబంధన అతిక్రమణ జరిగినా, యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలు తప్పవని సామాజిక వర్గాలు హెచ్చరిస్తున్నారు.





