కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రితో కిషన్ రెడ్డి భేటీలో హామీ
న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్ 18: రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి కేంద్రం నిరంతరం సహకారం అందిస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ హామీ ఇచ్చారు. దిల్లీలోని శ్రమ్ శక్తి భవన్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాల స్థితిగతుల గురించి చర్చించారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులకు కేంద్ర ప్రభుత్వ సహకారం అంశంపై చర్చ జరిగింది. మెట్రో ఫేజ్-2 కోసం తెలంగాణ ప్రభుత్వం పంపిన డీపీఆర్ ఇటీవలే అందిందని, దీన్ని అధికారులు పరిశీలిస్తున్నారని ఖట్టర్ తెలిపారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డీపీఆర్లో కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని ఈ కొత్త డీపీఆర్ రూపొందించి ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.