– సిఎం రేవంత్ తీరుపై మండిపడ్డ కవిత
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 8: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన సమీకృత పాఠశాలలు నిర్ణయంపై టిఆర్ఎస్ చీఫ్ కె.కవిత మండిపడ్డారు. రాష్ట్రంలోని 27,000 పాఠశాలలను 4,000కు కుదించనున్నట్లు సిఎం ప్రకటించడం తీవ్ర అభ్యంతరకరమని సోమవారం విడుదల చేసిన ఒక వీడియో ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. పేద విద్యార్థులను, ముఖ్యంగా బాలికలను విద్యకు దూరం చేసేలా ఉన్న ఈ నిర్ణయం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని గురుకుల పాఠశాలల్లో వందమందికి పైగా విద్యార్థులు మరణించినా సిఎం కనీసం సమీక్ష కూడా నిర్వహించలేదని మండిపడ్డారు. ఇప్పుడు పాఠశాలలు మూసివేస్తున్నామని ప్రకటించారని, విద్యాశాఖపై ప్రభుత్వానికి కనీస పట్టు లేదని ఈ నిర్ణయం స్పష్టం చేస్తోందని అన్నారు. బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని 27,000 ప్రభుత్వ పాఠశాలల్లో 18 లక్షల మంది విద్యార్థులుండగా, 12,000 ప్రైవేట్ స్కూళ్లలో 35 లక్షల మంది చదువుతున్నారని రేవంత్ తెలిపారు. నాణ్యమైన విద్యను అందించే లక్ష్యంతో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకేచోట విద్య, ఉచిత రవాణా, భోజన వసతులతో కూడిన సమీకృత పాఠశాలలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




