- ఏడాదిలోపే 50వేల ఉద్యోగాల భర్తీ.. దేశ చరిత్రలో రికార్డు..
- వైద్యశాఖలో 14వేల ఉద్యోగాలు భర్తీ చేశాం…
- గత ప్రభుత్వం పరీక్షలు పెట్టకుండా ప్రశ్నపత్రాలను అమ్ముకుంది
- పరీక్షల వాయిదా కోసం కృత్రిమ ఉద్యమాలు..
- ఆరోగ్య ఉత్సవాల సభలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 2 : తెలంగాణలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక ఏడాదిలో వైద్య ఆరోగ్య శాఖ లో 14 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, 7,750 మంది పారామెడికల్ సిబ్బందికి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఎన్టీఆర్ మార్గ్లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్లో నిర్వహించిన ఆరోగ్య ఉత్సవాల్లో ఆయన ప్రసంగించారు. ఉద్యోగ, ఉపాధి కోసం తెలంగాణ ఉద్యమంలో యువత రోడ్లపైకి వొచ్చి పోరాడారని, గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకుండా, పరీక్షలు పెట్టకుండా ప్రశ్నా పత్రాలను అమ్ముకుందని ఆరోపించారు. కేసీఆర్ ఇంట్లో వాళ్లను ఉద్యోగాల నుంచి బర్తరఫ్ చేస్తే.. తెలంగాణ యువతకు ఉద్యోగాలు వొచ్చాయన్నారు.
75 యేళ్ల స్వాతంత్య్ర భారత దేశ చరిత్రలో ఏ రాష్ట్రం ఒకే యేడాదిలో 50 వేల ఉద్యోగాలు ఇవ్వలేదని, దేశంలో తెలంగాణ గొప్ప చరిత్ర సృష్టించింది.. డీఎస్సీ వాయిదా వేయాలని రాజకీయ ప్రేరేపిత కృత్రిమ ఆందోళన చేశారు. ఎవరు అడ్డుపడినా డీఎస్సీ పరీక్షలు నిర్వహించి 55 రోజుల్లో నియామక పత్రాలు అందించామని, తెలంగాణ యువత పట్ల మాకున్న చిత్తశుద్ధి కి ఇది నిదర్శనమని తెలిపారు. గ్రూప్ 1 పరీక్షలు వాయిదా వేయాలని కోర్టులకు వెళ్లినా న్యాయస్థానాలు సమర్థించలేదు. పరీక్ష వాయిదా కోసం కొందరు కృత్రిమ ఉద్యమాలు చేశారు. 2011 తర్వాత గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించలేదు. 13 యేళ్ల తర్వాత గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించి ప్రశ్నా పత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్ముకున్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 563 మంది గ్రూప్ 1 అధికారులు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారు.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరు కు ఇది గీటురాయి.. మూడున్నర యేళ్ల సర్వీస్ ఉన్నప్పటికి బుర్రా వెంకటేశం ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా నియమించాం. గత ప్రభుత్వం రాజకీయ పునరావాస కేంద్రంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను మార్చింది. ఆర్ఎంపీ డాక్టర్లు, డిప్యూటీ ఎమ్మార్వో లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా నియమించారు. ఉన్నత చదువులు చదువుకున్న వారిని మా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా నియమించింది.. 10 యేళ్ల పాటు రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్ ఛాన్స్ లర్లను నియమించలేదు.. ఆరోగ్యశ్రీ పథకాన్ని గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసింది.. మా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచింది.. యేడాది కాలంలో 835 కోట్ల ముఖ్యమంత్రి సహాయ నిధి ని ప్రజలకు ఇచ్చాం.. ఇదొక రికార్డు ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటి వరకు కోటి 15 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు.. 50 లక్షల కుటంబాలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ను అందిస్తున్నాం.
మొదటి యేడాదిలోనే 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల రుణమాఫీ చేశాం. సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఖచ్చితంగా ఇచ్చి తీరుతాం…. రుణ మాఫీ, రైతు భరోసా తో కొంత మంది గుండెల్లో పిడుగులు పడుతున్నాయి.. గత పాలకులు వరి వేసుకుంటే ఉరేనని అన్నారు. మా ప్రభుత్వం సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తోంది… తెలంగాణ రైతులు 63 లక్షల ఎకరాల్లో కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను పండించారు. సన్న వడ్లకు ఇస్తున్న బోనస్ తో కౌలు రైతులు కూడా సంతోషంగా ఉన్నారు.. వొచ్చే పదేళ్లు మా ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. బోనస్ కొనసాగిస్తుంది. సంక్రాంతి పండుగ కు వొచ్చే గంగిరెద్దుల్లా కొందరు స్థానిక సంస్థల ఎన్నికల కోసం వొస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, 15 యేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. ప్రభుత్వాన్ని బదనాం చేసేవారికి కర్రు కాల్చి వాత పెట్టాలి. ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత తెలంగాణ ప్రజలదే.. ప్రభుత్వంపై జరుగుతున్న విషప్రచారాన్ని తిప్పికొట్టాలి… 10 యేళ్ళ పాటు అధికారంలో ఉండి జయ జయహే పాటను జాతికి అంకితం చేయకపోవడం ద్రోహం కాదా…? తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్ లో పెట్టే ఆలోచన కూడా గత పాలకులకు రాలేదు.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గత పాలకులు నెరవేర్చలేదు.. తెలంగాణ ప్రభుత్వ యేడాది విజయోత్సవాలకు ప్రజలు తరలిరావాలని అని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.