ఇరుదేశాల సరిహద్దుల్లో ఒకవైపు భీకరదాడులు జరుపుతూనే శాంతివచనాలు పలుకుతున్నది పాకిస్తాన్. దీనికి అమెరికా, రష్యాతోసహా వివిధ దేశాల మధ్యవర్తిత్వాన్ని కోరుతున్నది. అయితే ఈ వార్త రాసేప్పటికి రెండు దేశాలు చర్చలకు అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వార్తలు రావడం విశేషం. ఇదే జరిగితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తాత్కాలికంగా తగ్గుతాయి తప్ప శాశ్వత పరిష్కారం కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పాక్ ఎన్నడూ తన మాటమీద నిలబడే దేశం కాదన్న విషయం భారత్తో పాటు ప్రపంచ దేశాలన్నిటికీ తెలిసిన విషయమే. తాజాగా కాల్పుల విరమణ ఒప్పందాలను ఉల్లంఘించి దాడులు జరుపుతున్న విషయం తెలియంది కాదు. గత నాలుగు రోజులుగా ఇరుదేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉన్నది. సామాన్యప్రజలన్న కనీస విచక్షణ లేకుండా పాక్ సరిహద్దు గ్రామీణప్రజల ఇండ్లపైన బాంబు దాడులకు తలపడుతున్నది. ఫలితంగా ఇప్పటివరకు పద్దెనిమిది నుండి ఇరవై వరకు పౌరులు మృత్యువాత పడ్డారు. కాగా, సరిహద్దు గ్రామాల్లో ఎక్కడ చూసినా బాంబులు, డ్రోనుల అవశేషాలు కనిపిస్తున్నాయి. సుమారు నూరు నుండి నూట యాభై కిలోమీటర్ల వరకు ఆవి దూసుకు వొస్తున్నాయి. అవి పడిన చోట పెద్దగా గుంటలు ఏర్పడుతున్నాయి. అనేక ఇండ్లు ధ్వంసమైనాయి. ప్రధానంగా హిందూ దేవాలయాలు, గురుద్వార్లను, ఏయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకుని పాక్ డ్రోన్లతో దాడులకు పాల్పడుతున్నది. ఈ డ్రోన్ ఒక్కొక్కటి పది కిలోల బరువైన బాంబులను మోసుకొస్తున్నాయి.
కొన్ని డ్రోన్లు కేవలం భారత సైనికచర్యల వివరాలను ఫోటోతీసే కెమరాలున్నట్లు తెలుస్తున్నది. దీంతో ఎప్పుడు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవాల్సి వొస్తుందోనని ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. పాక్ చర్యలను భారత సైన్యం సమర్ధవంతంగా తిప్పికొడుతూనే ఉంది. శుక్రవారం ఒక్క రోజే సుమారు నాలుగు వందల డ్రోన్లను పాక్ ప్రయోగించింది. అయితే అవి లక్ష్యానికి చేరకుండానే ఆకాశమార్గంలో భారత సైన్యం నిర్వీర్యం చేయడం తో భారీ ప్రమాదం తప్పింది. ఇంతటి విధ్వంసం కు పాల్పడుతూనే ఇప్పుడు పాక్ ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటున్నట్లు నాటకమాడుతున్నది. ఒకపక్క పాక్ ఇంకా తన బలగాలను, ఆయుధాలను ఎల్ఓసి వైపు భారీస్థాయిలో తరలిస్తూనే ఉంది. మరోపక్క పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగమంత్రి ఇషాక్దార్ భారత్కు ఒక కీలక ప్రతిపాధన చేశారు. భారతదేశం తన సైనిక దాడిని ఆపితే, తాము కూడా దాడులను నిలిపివేస్తామని ప్రతిపాదించింది. తమ దేశంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఉద్రిక్తతలను తగ్గించాలని తాము కోరుకుంటున్నట్లు ఆ ప్రతిపాదన కొనసాగింపుగా పేర్కొన్నారు. అంతేకాదు పాకిస్తాన్ ఎప్పుడూ శాంతిని కోరుకుంటుందని, భారత్ తన కార్యకలాపాలు ఆపేస్తే, తదుపరి చర్యలకు తమ దేశంకూడా దూరంగా ఉంటుందని, చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నది ఆయన ప్రతిపాదనలోని ప్రధానాంశాలు. అయితే భారత్ ప్రతిదాడులకు తట్టుకోలేకే పాకిస్తాన్ ఒక మెట్టు దిగివొచ్చిందన్నది భారత ప్రజల భావన. వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి నీతి వ్యాఖ్యాలు పలికినట్లుందీ ప్రతిపాదన అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పాక్ గురించి క్షుణ్ణంగా తెలిసినవారెవరూ దీన్ని నమ్మేస్థితిలోలేరు. వారంతా పాక్ ‘సుదర్నేవాలీ నయీ హై’ అంటున్నారు. … తోక ఎప్పుడూ వంకరేనన్న కామెంటు చేస్తున్నారు.