- దీనిని జీర్ణించుకోలేకే కిషన్ రెడ్డి విమర్శలు
- మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
హైదరాబాద్,మే2: కులగణన విషయంలో తెలంగాణ బీజేపీ నేతలకు నిద్ర పట్టడం లేదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో బీజేపీ, సీపీఐ, బీఆర్ఎస్ కూడా పాల్గొన్నట్లు తెలిపారు. క్షేత్ర స్థాయికి సర్వే వెళ్ళిందని.. కిషన్ రెడ్డి ఈ విషయం తెలుసుకోవాలన్నారు. ఇంటింటికి అధికారులు వెళ్లి సర్వే చేశారన్నారు. కుల గణనపై కిషన్ రెడ్డి విమర్శలపై స్పందిస్తూ..దీనిపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. కులగణనలో రేవంత్ సక్సెస్ అయ్యాడు కాబట్టి డైవర్ట్ చేసి బురద జల్లే ప్రయత్నం చేయకండన్నారు. 100 శాతం సర్వే సక్సెస్ ఫుల్ గా జరిగిందని.. గవర్నర్ కూడా ఆమోదముద్ర వేశారన్నారు.
అంటే సర్వే సరిగా జరిగింది అనే కదా..? అని అన్నారు. సర్వే జరిగిన నెల రోజుకు కిషన్ రెడ్డి తెలంగాణలో లేరని అనుకుంటా అన్నారు. అందుకే ఆయనకు కుల గణన మీద పూర్తిస్థాయిలో అవగాహన లేదని జగ్గారెడ్డి అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని.. వాళ్ళు కూడా మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యేల మీద కూడా అనుమానం ఉందా..? అని ప్రశ్నించారు. సర్వేలో పాల్గొనని వాళ్ళ కోసం మళ్ళీ సమయం పొడిగించారు కదా..? అన్నారు. కిషన్ రెడ్డి మాటలు నమ్మకండని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కిషన్ రెడ్డికి సెంట్రల్ పార్టీ మొట్టికాయలు వేసిందని.. అందుకే ఈ మధ్య తరచూ ప్రకటనలు ఇస్తున్నారన్నారు. కేంద్రం నిర్ణయం తీసుకునే సమయంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. రాజకీయ విమర్శలు మానుకోండన్నారు.