– సున్నిత అంశాలపై ఎట్లా మాట్లాడాలో తెలియకపోతే ఎట్లా?
– రాహుల్ బడేమియా…రేవంత్ ఛోటేమియా
– దేశ ప్రయోజనాలకు మోకాలడ్డుతున్న కాంగ్రెస్
– యద్ధాల సమయంలో సైన్యానికి అండగా ప్రజలు
– బీఆర్ ఎస్ ది ఫ్యామిలీ డ్రామా
– కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
రాహుల్ గాంధీ ప్రధానిగా ఉంటే పీవోకేను స్వాధీనం చేసుకునే వాళ్లమంటూ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. అసలు పాకిస్తాన్ కు పీఓకేను కట్టబెట్టిందెవరనే విషయం రేవంత్ కు తెలుసా? అసలు పీవోకేను భారత్ కోల్పోయేలా చేసింది కాంగ్రెస్ కాదా? అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం ఆయన న్యూ దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ భారతసైన్యం 1971 యుద్ధంలో లాహోర్ వరకు చొచ్చుకుపోయినప్పుడు పీఓకేను తీసుకురాకుండా మిమ్మల్ని ఎవరు ఆపారు? పీఓకేను స్వాధీనం చేసుకునే అవకాశాలు చాలా ఉన్నా 93 వేల మంది పాకిస్థాన్ సైనికులను బేషరతుగా విడిచిపెట్టారని ఎద్దేవా చేశారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా మన రఫేల్ యుద్ధ విమానాలు ఎన్ని కూలిపోయాయో లెక్క చెప్పాలని రాహుల్ గాంధీ ప్రశ్నించడం విడ్డూరంగా వున్నదని ఆయన విమర్శించారు. రక్షణకు సంబంధించి, సున్నితమైన అంశాలపై ఎలా మాట్లాడాలో తెలియకుండా మాట్లాడుతున్న వారు మన ప్రతిపక్షంలో వుండటం దురదృష్టమని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి చురకలంటించారు. ఎంత మంది ఉగ్రవాదులు చనిపోయారనే విషయం గురించి, పాకిస్తాన్ పై మన సైనికులు ఎలా విరుచుకుపడ్డారో అడిగి ఉంటే మన దేశ ప్రజలు, సైనికులు సంతోష పడేవారన్నారు.
వీటిని వదిలిపెట్టి ప్రతిపక్ష నేేత రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఓ వితండ వాదం లేవనెత్తారు. రాహుల్ గాంధీ, ఆయన బావ రాబర్ట్ వాద్రా, రేవంత్ రెడ్డి దేశ సైనికులను అవమానించేలా వారు చేసిన పోరాటాలను తక్కువ చేసేలా మాట్లాడుతున్నారన్నారు. ఢిల్లీలో బడేమియా రాహుల్ మాటలకు వత్తాసుగా అక్కడ హైదరాబాద్లో చోటేమియా రేవంత్ ఇలాంటి కాపీ, పేస్ట్ ప్రశ్నలనే సంధిస్తున్నారు.ఇలాంటి వ్యాఖ్యలతో మన దేశ సైనికుల శౌర్యం, పరాక్రమాన్ని, ధైర్యాన్ని, సాహసాన్ని, త్యాగాలను అనుమానిస్తున్నామని, వారి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నామన్న సోయి కూడా వారికి లేకుండా పోయిందన్నారు. ప్రపంచ దేశాల ఎదుట పాకిస్థాన్ను దోషిగా నిలబెట్టేందుకు శాయశక్తులా కృషి చేస్తుంటే కాంగ్రెస్ మాత్రం మన దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి మోకాలడ్డే ప్రయత్నం చేస్తోందన్నారు. రేవంత్ రెడ్డి మొన్న ఢిల్లీ వచ్చి మూడు రోజలు పాటు రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోసం పడిగాపులు కాశారు. హైదరాబాద్ తిరిగి వెళ్లాక రాహుల్ మాటలను వల్లె వేస్తూ సైనికులను అవమానపరుస్తూ మాట్లాడారు. ఇలాంటి వైఖరిని దేశ ప్రజలు ముక్త కంఠంతో ఖండించాలని కోరుతున్నానన్నారు.
భారతదేశంలో ఎప్పుడు యుద్ధాలు వచ్చినా దేశంలోని రాజకీయ పార్టీలు, కులాలు మతాలు పక్కన పెట్టి ప్రజలు సైనికులకు అండగా నిలిచారు. పహల్గామ్ ఉగ్ర ఘటన అనంతరం కూడా దేశమంతా ఇలాగే ప్రజలంతా సైనికులకు అండగా నిలబడ్డారన్నారు. ప్రతీకారం తీర్చుకోవాలని, ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాలన్న ప్రజల ఆకాంక్షతో ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో ‘ఆపరేషన్ సింధూర్’ చేపట్టి.. అటు పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలతోపాటు వారికి సహకరిస్తున్న పాక్ ఆర్మీ వైమానిక స్థావరాలను కూడా ధ్వంసం చేశాం. ఆపరేషన్ సింధూర్ కు సంబంధించి అన్ని వివరాలను మీడియాలో ప్రపంచమంతా చూసిందన్నారు. ఆపరేషన్ మొదటిరోజే 23 నిమిషాల్లో పాకిస్తాన్ భూభాగంలోని 9 ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ ఆర్మీ, ఆ దేశ ప్రధాని స్వయంగా ప్రకటించారని గుర్తుచేశారు. మన మిసైళ్లు చేసిన విధ్వంసాన్ని వీడియో ఫుటేజీలతో సహా అందించాం. భారత్పై తాము దాడులు జరపాలని నిర్ణయించుకున్న తర్వాత రాత్రికి రాత్రే తమ వైమానిక స్థావరాలపై భారత్ సాయుధ దళాలు దాడులు జరిపాయని, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఒప్పుకున్నారు. ఒకవైపు పాకిస్థాన్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేసి, ఆపరేషన్ సింధూర్ విజయాన్ని ప్రపంచ దేశాలకు తెలిపేందుకు మన దేశ ప్రతినిధులు వివిధ దేశాల్లో పర్యటిస్తున్నారు.శత్రు దేశాన్ని ఇరుకున పెట్టేందుకు ఆపరేషన్ సింధూర్ తో పాటు సింధూ జలాల ఒప్పందాన్ని ఆపేశాం. వాణిజ్య సంబంధాలను పూర్తిగా నిలిపేశాం.
సైనికులకు అండగా తిరంగా ర్యాలీ నిర్వహిస్తే వారికి బీజేపీ కార్యక్రమంలాగా కనిపించడం దుర్మార్గం. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2016లో పటాన్ కోట్ లో జరిగిన దాడికి సర్జికల్ స్ట్రయిక్స్ పేరుతో పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మన దేశ పరాక్రమాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. 2019లో బాలాకోట్ దాడికి దీటుగా వాయుసేన విమానాలు పాకిస్థాన్ లోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాద శిబరాలు ధ్వంసం చేశారు.ఇటీవల ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ కు నరకం చూపించాం. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వందల ఉగ్రదాడులు జరిగాయి. దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక ఉగ్రదాడి జరిగేది ఎప్పుడైనా సైనికులకు స్వేచ్ఛ ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ కు ఉందా? అని ప్రశ్నించారు. ఆపరేషన్ సింధూర్ విజయంపై సంతోషం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. కనీసం బయటకు ఏడవకుండా ఉంటే చాలన్నారు. రాహుల్ అగ్నివీర్ పథకాన్ని యూజ్ అండ్ త్రో పాలసీ అని విమర్శించారు. మూడు వేలకుపైగా అగ్నివీర్స్ ఇవాళ మన గగనతల రక్షణ వ్యవస్థకు రక్షణగా నిలిచారని గుర్తుచేశారు.
ఫ్యామిలీ డ్రామా
బీజేపీలో, బీఆర్ఎస్ విలీనం అవుతుందంటూ వ్యాఖ్యలు చేసే వారికి ఉన్న క్రెడిట్ ఏంటి? అలాంటి వారి వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వలేను.అదంతా డాడీ డాటర్, సిస్టర్ బ్రదర్ డ్రామా, ఫ్యామిలీ డ్రామా గురించి మాకు, తెలంగాణ ప్రజలకు సంబంధం లేదు. బీఆర్ఎస్ ఓ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ. ఇది ప్రజలకు సంబంధించిన విషయం కాదన్నారు.