తెలంగాణలో 25 ఏళ్లు పూర్తిచేసుకున్న పార్టీలు టిడిపి, బిఆర్ఎస్ లే..
ప్రధాన ప్రతిపక్ష పాత్రను బాధ్యతగా పోషిస్తున్నాం
సెంట్రల్ వర్సిటీ భూములపై విద్యార్థులే పోరాడారు
కెసిఆర్పై కేసులు ఎలా పెట్టాలన్న ఆలోచనలో ప్రభుత్వం
మీడియా చిట్చాట్లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
తెలుగునాట విజయవంతంగా 25 ఏండ్లు పూర్తి చేసుకున్న రెండు పార్టీలు బీఆర్ఎస్, టీడీపీ మాత్రమే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. అందుకే ఏడాది పాటు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేశారు. వరంగల్ ఎల్కతుర్తిలో ఎలాంటి ట్రాఫిక్ లేకుండా.. ప్రజలకు ఇబ్బంది కాని ప్రాంతంలో సభ నిర్వహణ జరుగుతుంది. 1200 ఎకరాల్లో పార్కింగ్తో పాటు సభ ఏర్పాట్లు అన్ని ఘనంగా జరుగుతున్నాయి.
ఆర్టీసీ ద్వారా 3000 బస్సుల కోసం విజ్ఞప్తి చేశాను.. ఆర్టీసీ సూతప్రాయంగా అంగీకరించింది. 27వ తేదీ ఆదివారం కావడం విద్యార్థులకు సెలవులు ఉండటం ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలగవని కేటీఆర్ పేర్కొన్నారు. మా పార్టీ చరిత్రలో ఈ సమావేశం ఒక పెద్ద మీటింగ్ అవుతుంది. బహిరంగ సభ తర్వాత విద్యార్థి , కార్యకర్తల సభ్యత్వ నమోదు చేస్తాం. సభ్యత్వ నమోదు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుంది.
సభ్యత్వ నమోదు తర్వాత అధ్యక్ష ఎన్నిక జరుగుతుంది. రాష్ట్ర కమిటీలతో పాటు జిల్లా కమిటీలను ఇతర కమిటీలను వేసుకుంటాం. ఆ తర్వాత జిల్లాల వారీగా కార్యకర్తల శిక్షణ సమావేశాలు ఉంటాయి. ప్రతినెల ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహించేలా 12 నెలలపాటు- కొనసాగేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం. ప్రభుత్వం గతంలో మా పార్టీ సమావేశాలకు అనుమతులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టింది. ఈ బహిరంగ సభకు కూడా అనుమతులు ఇవ్వకుంటే కోర్టును ఆశ్రయించి అనుమతి పొందుతాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో నెగెటివ్ పాలసీలు, నెగెటివ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మాజీ సర్పంచ్ నుంచి మాజీ సీఎం వరకు కేసులెలా పెట్టాలని చూస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంలో మేం లేము. హెచ్సీయూ విద్యార్థులపై కేసుల ఉపసంహరణ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కేసుల ఉపసంహరణ సరిపోదు.. జంతువధ కారకులపై కేసులు పెట్టాలి. సోషల్ మీడియాలో మాపై ఎదురుదాడి చేయిస్తున్నారు. భారీగా ఖర్చు చేసి టూల్ కిట్ సాయంతో ఎదురుదాడికి పాల్పడుతున్నారన్నారు.