తెలంగాణ స‌త్తా ప్ర‌పంచానికి చాటేలా భార‌త్ స‌మ్మిట్‌

ప్రపంచ పటంలో హైదరాబాద్ ను నిలిపేందుకు కృషి
డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క

హైద‌రాబాద్, ప్ర‌జాతంత్ర, ఏప్రిల్ 24: ప్రోగ్రెసివ్ ఆలోచనలో తెలంగాణను ప్రపంచానికి ఒక మోడల్ గా చూపడానికి భారత్ సమిట్ గొప్ప కార్యక్రమంగా భావించి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్య‌క్ర‌మాన్ని చేపట్టిందని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతాలైన  అహింస, సత్యం ,న్యాయం, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై 100 దేశాలకు పైబడిన ప్రభుత్వ అధినేతలు, ఎంపీలు, జాతీయ పార్టీల నాయకులు, కార్పొరేట్ దిగ్గజాలు, థింక్ ట్యాంకర్స్ మొత్తంగా 450 మంది ప్రపంచవ్యాప్తంగా ప్రతినిధులు సమావేశానికి హాజరవుతారని తెలిపారు. ఆనాడు ప్రపంచవ్యాప్తంగా అమెరికా, రష్యా రెండు బలమైన శక్తులు కోల్డ్ వార్ చేస్తుండగా… ఎదుగుతున్న భారతదేశం అలీన విధానాన్ని తీసుకుని ముందుకు వెళ్లిందని వివ‌రించారు. భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య రాజకీయ పార్టీగా కాంగ్రెస్ నిలబడిందని. అలీన విధానాన్ని నాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ముందుకు తీసుకువెళ్లాల‌ని తెలిపారు.  రాహుల్ గాంధీ ఆలోచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ దేశాలకు చెందిన ప్రతినిధులను వివిధ అంశాలపై రెండు రోజులపాటు చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించిందని వివరించారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర అభివృద్ధి, వనరులు, చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి వివరించేందుకు ప్రత్యేక స్లాట్ కేటాయించామని తెలిపారు. ప్రపంచ పటంలో హైదరాబాదును నిలిపేందుకు ఈ సమ్మిట్ ఉపయోగపడుతుందని తెలిపారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతమైన జెండర్, యూత్, న్యాయ మూల సిద్ధాంతాలు వివరించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని.. వాటిని ఈ ప్రపంచానికి చాటేందుకు ఈ సమావేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని భ‌ట్టి విక్ర‌మార్క‌ అన్నారు.

సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు అధికారికంగా 67 టీఎంసీల కేటాయింపు
ఖమ్మం జిల్లాలోని సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు 67 టీఎంసీలు కేటాయిస్తూ కేంద్రం అధికారికంగా నిర్ణయం తీసుకుందని, దాంతోపాటు సీతమ్మ సాగర్ బ్యారేజ్ నిర్మాణానికి సాంకేతిక అనుమతులు మంజూరు చేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. గురువారం ఈమేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం ద్వారా ఖమ్మం జిల్లాలోని వేల ఎకరాల బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రానికి స్పష్టమైన సమాచారం ఇప్పించి, వారిని ఒప్పించి అధికారిక అనుమతులు సాధించారని ప్రకటనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్‌ ను అభినందించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నం ద్వారా భవిష్యత్తులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున బీడు భూములు సాగు చేసుకునేందుకు అవకాశం ఏర్పడింద‌ని డిప్యూటీ సీఎం తెలిపారు. దశాబ్దాల తరువాత రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం మూలంగా అధికారిక అనుమతులు సాధించడం అభినందనీయమ‌ని భ‌ట్టి విక్ర‌మార్క‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page