రజతోత్సవానికి కదిలిన గులాబీ దండు
(మండువ రవీందర్రావు, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి )
దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటుకు కారణమైన భారత రాష్ట్ర సమితి 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం భారీ స్థాయిలో ఉత్సవాన్ని జరిపేందుకు అన్ని హంగులను పూర్తి చేసింది. సహజంగా రాజకీయ పార్టీలు ఎంత పెద్ద సభను ఏర్పాటు చేసినా రెండు నుంచి ఐదు లక్షల లోపు మందినే పోగుచేసిన చరిత్ర ఉంది. కానీ, బిఆర్ఎస్ పార్టీ ఎవరూ ఊహించని విధంగా 10 లక్షల మందితో ఈ సభను ఏర్పాటు చేస్తోంది. అందుకు కావాల్సిన ఏర్పాట్లను గత 20 రోజులుగా నిర్వహిస్తూ వొచ్చారు. ముఖ్యంగా హన్మకొండ బిఆర్ఎస్ అధ్యక్షులు దాస్యం వినయ్భాస్కర్, ఎంఎల్సీలు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, తక్కళ్ళపల్లి రవీందర్రావు, బిఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి గ్యాదరి బాలమల్లు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, వొడితల సతీశ్ కుమార్లు ఈ ఏర్పాట్లను తమ భుజస్కందాలపైన వేసుకున్నారు. అంత పెద్ద స్థాయిలో సభకు విచ్చేసే జనానికి సరిపోయేంతస్థలం హనుమకొండ నగరనడిబొడ్డున లేకపోవడంతో హనుమకొండ, కరీంనగర్ జిల్లా సరిహద్దు ప్రాంతమైన ఎల్కతుర్తిని ఎంచుకున్నారు. మొత్తం వ్యవసాయ భూమే అయినప్పటికీ బిఆర్ఎస్ అధినేత కెసిఆర్పై ఉన్న అభిమానంతో రైతులు స్వచ్చందంగా తమభూములను చదును చేసుకునేందుకు ముందుకొచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఎల్కతుర్తి సభా ప్రాంగణంతో పాటు ఆ గ్రామానికి తరలే మార్గాలన్నీ గులాబీ తోరణాలతో ప్రజలందరినీ స్వాగతిస్తున్నాయి. ఈ ప్రాంతమంతా ఎక్కడ చూసినా కెసిఆర్, కెటిఆర్ ఫొటోలతో ఉన్న జెండాలు, భారీ కటౌట్లు, ప్లెక్సీలు దర్శనిమిస్తున్నాయి. ఎల్కతుర్తి ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన కెసిఆర్ భారీ కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేదికను కూడా అత్యంత సుందరంగా అలంకరించారు. వేదిక ముందు కూడా బిఆర్ఎస్, కెసిఆర్, కెటిఆర్ల కటౌట్లను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదిక పక్కనే మరో వేదికను ఏర్పాటు చేశారు. దీన్ని కళాకారుల కోసం ప్రత్యేకించారు. వేదిక ముందు జనం ఆసీనులు కావడానికి వేలాది కుర్చీలను ఏర్పాటు చేశారు. అలాగే మహిళ కోసం ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేసి వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు 2వేల మంది వలంటీర్లను నియమించారు.
వంద వైద్య బృందాలతోపాటు, 12 వైద్య శిబిరాలను, అంబులెన్స్లను సిద్దం చేశారు.జాతరను తలపించే విధంగా అశేష జనం వొస్తుండడంతో వారికోసం సభా ప్రాంగణంలో వివిధ ప్రాంతాల్లో సుమారు 12వేల మరుగుదొడ్లను కూడా ఏర్పాటు చేశారు. సభాస్థలికి చేరుకునే రహదారుల ఇరుపక్కల గుంతలను మొరంతో పూడ్చి, ముళ్ల కంచను తొలగించి దారిని విస్తరించారు. సుమారు 12 వందల 50 ఎకరాల సువిశాల స్థలంలో చేస్తున్న ఈ ఏర్పాట్లలో దాదాపు 400 ఎకరాలను కేవలం సభాస్థలికే కేటాయించారు. మిగతా స్థలాన్ని సభకు జనాన్ని తరలించే వాహనాల కోసం ప్రత్యేకించారు. దాదాపు 50 వేలకు పైగా వాహనాలు రావొచ్చని అంచనా వేస్తున్నారు. వీటిల్లో మూడు వేల ఆర్టీసి బస్సులను ఇప్పటికే పార్టీ వర్గాలు బుక్ చేసుకున్న విషయం తెలిసిందే. పార్కింగ్ను కూడా అయిదు జోన్లుగా విభజించారు. ఏ జిల్లాలనుండి వచ్చే వాహనాలను ఎక్కడ నిలపాలన్ విషయంలో గూగుల్ ట్రాన్స్ లొకేషన్ మ్యాపులతో సూచించే ఏర్పాట్లు చేశారు. 10 లక్షల మందికి సరిపోయే విధంగా తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను సిద్దం చేశారు.
ఉత్సాహంగా తరలతున్న గులాబీ దండు
మాజీ మంత్రులు కెటిఆర్, హరీష్రావు, ఎంఎల్సీ కవిత వరంగల్ జిల్లాతోపాటు వివిధ జిల్లాలో పర్యటించి ప్రజలను, కార్యకర్తలను రజతోత్సవ సభకు తరలే విధంగా సన్నద్ధం చేశారు. దీంతో రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల నుంచి ప్రజలు అశేషంగా సభాస్థలికి చేరుకునేందుకు అమితోత్సాహం ప్రదర్శిస్తున్నారు. సభకు రావడానికి తమకు వాహన సదుపాయాలు కల్పించాలని కొందురు విజ్ఞప్తులు చేస్తుండగా మరికొందరు తమ సొంత వాహనాల్లో రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కెసిఆర్ స్వంత జిల్లాగా చెప్పుకునే సిద్దిపేట ప్రత్యేకతను చాటుకుంది. ఈ నియోజకవర్గానికి చెందిన సుమారు 1500 మంది యువకులు వరంగల్ సభాస్థలికి 70 కిలోమీటర్ల పొడవున కాలినడకన చేరుకోవడానికి సిద్దపడ్డారు. వారి పాదయాత్ర కార్యక్రమాన్ని మాజీ మంత్రి హరీష్రావు శుక్రవారం ప్రారంభించారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని హసన్పర్తి మండలం దేవన్నపేట నుంచి ఎడ్లబండ్లతో బయలుదేరిన బిఆర్ఎస్ శ్రేణుల ర్యాలీని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు జెండా ఊపి ప్రారంభించారు. సూర్యాపేట నుంచి కూడా భారీ స్థాయిలో ఎడ్లబండ్ల గులాబీ ర్యాలీ బయలుదేరింది. చలో వరంగల్ అంటూ బయలుదేరిన గులాబీ దండు ర్యాలీని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ప్రారంభించారు. రేవంత్ గో బ్యాక్ – కెసిఆర్ కమ్ బ్యాక్ అన్న నినాదాలతో వారు బయలుదేరారు.
మహబూబాబాద్లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే శంకర్నాయక్తో కలిసి మహిళలకు బొట్టుపెట్టి సభకు ఆహ్వానిస్తున్నారు. ఎల్కతుర్తి సభను విజయవంతం చేయాలని హనుమకొండ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్ నియోజకవర్గంలోని పలుప్రాంతాల్లో బైక్ర్యాలిద్వారా ఇంటింట ప్రచారంచేశారు. ప్రజలంతా ఎదురుచూసే కెసిఆర్ ప్రసంగం సాయంత్రం అయిదు గంటలకుంటుంది. అయితే ఆయన రావడానికి ముందే ప్రజలంతా సభాస్థలికి చేరుకునే విధంగా నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన ప్రసంగానికి ఎక్కడి నుంచి అయినా చక్కగా వినేందుకు సభా నలువైపులా భారీ స్పీకర్లను ఏర్పాటు చేశారు. కాగా సభకు చేరుకున్న ప్రజలను ఉత్సాహ పరిచేందుకు ఆటాపాట కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందుకోసం ప్రత్యేకించిన వేదికపైనుండి మాజీ ఎంఎల్ఏ రసమయి బాలకిషన్ సారధ్యంలో ఉర్రూతలూగించేవిధంగా సాయంత్రం మూడుగంటలనుండే ధూం.. ధాం.. జరగనుంది. బిఆర్ఎస్ రజతోత్సవాన్ని, కాంగ్రెస్ పదహారు నెలల పాలనపైన ప్రత్యేకంగా పాటలను సిద్దం చేశారు.
కెసిఆర్ ఏం చెబుతారు
భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) ఆవిర్భావసభలో ఆపార్టీ అధినేతగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఏం చెప్పబోతున్నారన్నది ఇప్పుడు తెలంగాణ ప్రజల్లో ఆసకిని కలిగిస్తున్న అంశం. కేవలం తెలంగాణ ప్రజల్లోనేకాదు, దేశంలోని ఇతర రాష్ట్రాల రాజకీయనేతల్లోనూ ఆసక్తిని కలిగిస్తున్నది. ప్రాంతీయ పార్టీగానే మొదలైన భారత రాష్ట్రసమితి దేశరాజకీయాల్లో చక్రంతిప్పే ప్రయత్నం చేయడమే ఈ ఆసక్తికి కారణమైంది. స్వీయపార్టీ ప్రధాన నాయకుల్లోకూడా అదే అంశంపై చర్చజరుగుతున్నది. తెలంగాణ రాష్ట్రసాధన అనే ఏకైక లక్ష్యంతో పుట్టి లక్ష్యాన్ని ముద్దాడిన పార్టీగా బిఆర్ఎస్కు పేరుంది. దశాబ్దాల తెలంగాణ ప్రజలను సాకారం చేసిన పార్టీగా యావత్ తెలంగాణ ఆ పార్టీని అక్కున చేర్చుకుంది. ఒక విధంగా చెప్పాలంటే తమ గుండెల్లో దాచుకుంది. అనేక అవమానాలు, అన్యాయాలనుండి ఇక్కడి ప్రజలకు విముక్తికలిగించన పార్టీ స్థానికులు ఆదరించారు. గాంధేయ మార్గంలో రాజకీయ ప్రక్రియతో దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పాటు చేసుకోవడంతోపాటు దశాబ్దకాలం ఏలిన చరిత్రకూడా ఆపార్టీకి దక్కింది.
అయితే సరిగ్గా పదహారు నెలల క్రితం అధికారం కోల్పోయి ప్రస్తుతం ప్రతిపక్షపాత్ర పోషిస్తున్న బిఆర్ఎస్ స్వీయరాష్ట్రంలోనే పలు సవాళ్ళను ఎదుర్కుంటున్నది. నిధులు, నీళ్ళు, నియామకాలు అన్న నినాదంగా ఉద్యమించిన బిఆర్ఎస్, అధికారంలో వాటిని అమలు చేసే విషయంలో అనేక తప్పుడు విధానాలను అవలంభించిందన్న అపవాదలను మోస్తున్నది. ప్రపంచంలో వింత ఇంజనీరింగ్ అని చెబుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు మొదలు ఇతర ప్రాజెక్టులు, పాలనలో తీసుకున్న నిర్ణయాలపైన విచారణలను ఎదుర్కుంటున్నది. ఈ విషయాల్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ బిఆర్ఎస్ను ఆ పార్టీ అధినేతగా కెసిఆర్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నంచేస్తున్నది. వీటిపై ఇరుపార్టీలమధ్య సవాళ్ళు ప్రతిసవాళ్ళు కొనసాగుతున్నాయి. బహిరంగ చర్చకు రావాలని అధికారపార్టీ పలుసార్లు సవాల్ చేసింది. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకపోవడంపైన కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పలుసార్లు కెసిఆర్ను ప్రోవోక్ చేయడానికి ప్రయత్నించారు.
అయినప్పటికీ ఏనాడు కెసిఆర్ పెదవి విప్పలేదు. ఎంఎల్ఏగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రానిపక్షంలో తన పదవికి రాజీనామాచేయాలంటూ బిజెపికూడా తీవ్రంగా విమర్శించింది. అయినా తనకేమీ పట్లనట్లు ఆయన మౌనమునిగానే ఉండిపోయారు. ఇప్పుడు ఆయన మౌనం వీడే సమయం ఆసన్నమైంది. బిఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 సంత్సరాలు కావస్తుండడంతో ఆ పార్టీ రజతోత్సవాలను నిర్వహిస్తున్నది. ఉద్యమంలో వెన్నుతడుతూ వస్తున్న ఉమ్మడి ఓరుగల్లులో జరుగుతున్న ఈ సభకు సుమారు పదిలక్షలమంది హాజరవుతున్నారు. పార్టీ అధినేతగా ఆయన తన మౌనాన్ని వీడకతప్పదు. లక్షలాదిమంది హాజరవుతున్న ఈ సభలో ఆయన సంచలనాత్మక నిర్ణయాలు ప్రకటించే అవకాశాలుంటా యనుకుంటున్నారు. త్వరలోనే అధికారం చేపడుతామంటూ ఆ పార్టీ వర్గాలు తరుచు ప్రకటిస్తున్న నేపద్యంలో బిఆర్ఎస్ అందుకు తమ ప్రణాళిక ఏమిటన్నదానిపైన కూడా ఆయన మాట్లాడు తాడనుకు ంటున్నారు. ఇక ఆ పార్టీ పని అయిపోయి ందంటున్న వారికికూడా ఆయన ప్రసంగంలో తగిన సమాధానం చెబుతాడనుకుంటున్నారు.