రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ బిసి నేతలు ఒత్తిడి తేవాలి
17న రైల్ రోకోకు అన్ని పార్టీలు ముందుకు రావాలి
విూడియా సమావేశంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై3: బీసీ రిజర్వేషన్ల సాధన కోసం దిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకుని వెళ్లాలని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోమారు డిమాండ్ చేశారు. ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తానన్న సీఎం ఇంకా తీసుకెళ్లలేదని విమర్శించారు. ఈనెల8 లోపు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. గురువారం ఇక్కడ ఆమె విూడియాతో మాట్లాడుతూ రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి వీలు లేదని తేల్చిచెప్పారు. ఈ బిల్లు అమలు కోసం జాగృతి ఆధ్వర్యంలో ఈనెల 17న నిర్వహించనున్న రైల్ రోకోకు మద్దతు కోరుతూ బిఆర్ఎస్ సహా అన్ని పార్టీలకు లేఖ రాస్తామని చెప్పారు. రైల్రోకోకు సంబంధించిన పోస్టర్ను హైరదాబాద్లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల మద్దతు కూడగట్టామన్నారు. రైల్రోకో నిర్వహించి తెలంగాణ నుంచి దిల్లీ వెళ్లే ప్రతి రైలును ఆపుతామన్నారు. కాంగ్రెస్లోని బీసీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. బిల్లు విషయమై బీజేపీపై ఒత్తిడి తీసుకురావాలని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకి లేఖ రాస్తున్నామని చెప్పారు. బీసీ బిల్లుపై బీజేపీ చొరవ తీసుకోవాలని, ఈ విషయమై ఆ పార్టీ నూతన అధ్యక్షుడు రామచందర్ రావుకు లేఖ రాశామని చెప్పారు. ఆయన చొరవ తీసుకుని బీజేపీ అధ్యక్ష హోదాలో తొలి విజయం నమోదు చేసుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ది పొందేందుకే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ వస్తున్నారని విమర్శించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా బీజేపీపై ఖర్గే ఒత్తిడి తేవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల వారీగా కులగణన వివరాలు బయట పెట్టాలన్నారు. కాగా, గోదావరి-బనకచర్ల విషయంలో ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తోందని, ఏపీ సిఎం చంద్రబాబు నాయుడును ఒక్క మాట కూడా అనలేడంలేదని పేర్కొన్నారు. కొందరి కాంట్రాక్టుల కోసమే బనకచర్ల ప్రాజెక్టు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారని చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారని చెప్పారని, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి బనకచర్లను ఆపాలని, గట్టిగా కొట్లాడాలని కవిత కోరారు.