నగరంలో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలి

ఓల్డ్ సిటీకి కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2:  తెలంగాణ అభివృద్ధిలో మొదట ప్రతిబింబించేది హైదరాబాద్ సిటీనే అని, అభివృద్ధి అంటే కేవలం హైటెక్ సిటీ కాదు – ఓల్డ్ సిటీ, గౌలిగూడ, అంబర్ పేట్, సనత్ నగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాలూ కీలకమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం ముగిసిన అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ సంస్థలు నగర మౌలిక వసతుల కల్పనలో కీలక పాత్ర పోషిస్తాయని,  నిధుల కొరత లేకుండా చూసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎడ్యుకేషన్, మహిళా సంక్షేమం కూడా కీలకంగా ఉంటాయి. తాగునీరు, డ్రైనేజీ వంటి సమస్యలు బస్తీల్లో సాధారణంగా కనపడుతుంటాయి.

నగరంలో అవసరమైన ప్రతిచోట స్ట్రీట్ లైట్స్ అవసరాలు, రీస్టోరేషన్ తక్షణ చర్యలు అవసరం. జీహెచ్ఎంసీలో కూడా విస్తరణ, జనాభా పెరుగుదల నేపథ్యంలో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని, దీన్ని బాధ్యతగా తీసుకోవాలని కిషన్ రెడ్డి కోరారు. దిశా సమావేశంలో కేంద్ర నిధులతో జరుగుతున్న కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం పూర్తిస్థాయిలో సమాచారాన్ని సమర్పించాలని, హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, పాతబస్తీ ప్రాంతాల్లో మౌలిక వసతుల కొరత, ప్రాథమిక సౌకర్యాల సమస్యలు మరింతగా తలెత్తుతున్నాయని, హైటెక్ సిటీతో పాటు ఓల్డ్ సిటీ అభివృద్ధిపై సమాన దృష్టితో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.  అభివృద్ధి బడ్జెట్ కేవలం కొత్త ప్రాంతాలకే కాకుండా, పాతపట్నానికి కూడా సమానంగా కేటాయించాలని సూచించారు.

ప్రతి డివిజన్‌కు సంబంధించిన అవసరాలను గుర్తించి కేంద్రానికి వివరాలు అందించాలని,  కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేసే విషయంలో పూర్తి స్థాయిలో సహకరిస్తుందని హామీ ఇచ్చారు. డంప్‌యార్డులు పేరుకుపోయిన ప్రాంతాలను శుభ్రపరచడానికి అవసరమైన నిధులను తీసుకురావడానికి స్థానిక అధికార యంత్రాంగం సమగ్ర సమాచారం ఇవ్వాలి. కేంద్ర నిధులను సమర్థవంతంగా ఉపయోగించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టులో అప్జల్‌గంజ్ వరకే పరిమితమైన ఫస్ట్ ఫేజ్‌ను విస్తరించి, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫేజ్‌ల కోసం ప్రతిపాదనలు వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని  ఆ వివరాలు అందితే కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులు, రుణాలు లభించేలా సహకరిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page