- ఎరుపెక్కిన వెలిశాల.. భావోద్వేగంతో నివాళులు
- భారీగా తరలివచ్చిన ప్రజా, విప్లవ, విరసం సంఘాల బాధ్యులు
- ఎన్కౌంటర్పై న్యాయ విచారణ చేయాలని ప్రజా సంఘాల డిమాండ్
- రవికి చావు లేదు : గాదె ఇన్నయ్య
- సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి: విమలక్క
జయశంకర్ భూపాలపల్లి, ప్రజాతంత్ర, జూన్ 20 : మావోయిస్ట్ అగ్రనేత గాజర్ల రవి (Gajarla Ravi) అలియాస్ గణేష్, అలియాస్ ఉదయ్ అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం ఆయన స్వగ్రామం వెలిశాలలో అశృనయనాల మధ్య ముగిశాయి. గణేష్ జోహార్లు..అంటూ గ్రామస్థులు, విప్లవకారులు, మాజీ మావోయిస్టులు నినాదించారు. అంత్యక్రియల్లో పాల్గొన్న విమలక్క రవన్నపై ప్రత్యేకంగా విప్లవ గీతం ఆలపించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది జనం తరలివరావడంతో వెలిశాల గ్రామంలో కోలాహలంగా మారింది. వెలిశాల గ్రామాన్ని అనుసంధానం చేసే మార్గాల్లో వాహనాల రద్దీ నెలకొంది.
దాదాపు ఒకటిన్నరకు మొదలైన అంతియయాత్ర నాలుగున్నర గంటల పాటు కొనసాగింది. 5 గంటల సమయంలో గ్రామంలో గాజర్ల రవి అంత్యక్రియలు పూర్తి చేశారు. నివాళులర్పించిన వారిలో చెరుకు సుధాకర్, గద్దర్ కొడుకు సూర్యం, జనశక్తి అమర్.. విమలక్క, గాదె ఇన్నయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాజీ స్పీకర్ మధుసూదనాచారితో పాటు వివిధ సంఘాల నేతలు, మాజీ మావోయిస్టు నేతలు పెద్ద సంఖ్యలో వెలిశాలకు తరలివచ్చి రవికి నివాళులర్పించారు.
నక్సలైట్ల ఏరివేతకు చంద్రబాబు రూ.కోట్లు : గాదే ఇన్నయ్య
కగార్ పేరుతో పాశవికంగా ఎన్కౌంటర్లు చేస్తూ నక్సలైట్లను ఎరివేస్తున్న చంద్రబాబు కుక్క చావు చేస్తాడని మండిపడ్డారు. తన రాష్ట్రంలో విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడానికి డబ్బులు లేవని చెప్పే చంద్రబాబు నక్సలైట్ల ఏరివేతకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాడని, ఆ పాపం పండుతుందని హెచ్చరించారు .భూమి కోసం, భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం పోరాడే నక్సలైట్లను అకారణంగా బూటకపు ఎన్కౌంటర్ల పేరుతో చంపటం అమానుషమైన చర్య అని మండిపడ్డారు. నక్సలిజాన్ని అంతం చేయడం రాజ్యం అవివేకమైన చర్య అని అన్నారు.
సిట్టింగ్ జడ్జిచే న్యాయ విచారణ జరిపించాలి : విమలక్క
కేంద్ర ప్రభుత్వం కగార్ ఆపరేషన్ పేరుతో నక్సలిజాన్ని రూపుమాపాలని 2026 టార్గెట్గా చేసుకొని చేస్తున్న బూటకపు ఎన్కౌంటర్లన్నీ అమిత్ షా, మోదీ హత్యలని ఆరోపించారు గాజర్ల రవి ఎన్కౌంటర్ పై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నక్సలిజంపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్పొరేట్ వ్యక్తులకు కొమ్ముకాస్తున్న బిజెపి : న్యూడెమోక్రసీ
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అదాని, అంబానీ లాంటి కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తోందని న్యూ డెమోక్రసీ నేతలు ఆరోపించారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఎన్కౌంటర్లన్నీ బూటకమైనవేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచి పెట్టేందుకే నక్సలిజాన్ని అంతం చేసేందుకు కంకణం కట్టుకున్నాయని మండిపడ్డారు.
జోహార్లతో హోరెత్తిన వెలిశాల
గాజర్ల రవి అలియాస్ గణేష్లి ఆలియాస్ ఉదయ్ అంతిమయాత్రకు నాలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ ప్రజా సంఘాలు విప్లవ సంఘాలు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారులు సానుభూతిపరులు భారీగా తరలివచ్చారు. వెలిశాల గ్రామం కామ్రేడ్ రవి అమర్రహే , జోహార్లతో వెలిశాల గ్రామం హోరెత్తిపోయింది. గాజర్ల రవి అంతిమయాత్రకు అమర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, శాసనమండలి ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, డాక్టర్ చెరుకు సుధాకర్, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ తదితరులు నివాళులర్పించారు.