గోశాల‌ల ఏర్పాటుకు పూర్తిస్థాయి ప్ర‌ణాళిక

అధికార్ల‌ను ఆదేశించిన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి

 గోశాలల ఏర్పాటుకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేయాలని, నిర్ణీత గడువులోగా కమిటీ పూర్తిస్థాయి ప్రణాళికతో రావాలని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికార్ల‌ను ఆదేశించారు. శ‌నివారం ఆయ‌న, రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారులతో స‌మీక్షా స‌మావేశంలో పాల్గొన్నారు.  ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ గోసంరక్షణ, నిర్వహణ సులువుగా ఉండేందుకు వీలుగా గోశాలల ఏర్పాటు వుండాల‌న్నారు. మొదటి దశలో రాష్ట్రంలోని వెటర్నరీ యూనివర్సిటీ, కళాశాలలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ, కళాశాలలు, దేవాలయాలకు సంబంధించిన భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని ముఖ్య‌మంత్రి సూచించారు.
ఇందుకోసం అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించాలని ముఖ్య‌మంత్రి అధికార్ల‌ను ఆదేశించారు.

కనీసం 50 ఎకరాల విస్తీర్ణానికి తగ్గకుండా గోశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.   ఇరుకు స్థలాల్లో బంధించినట్లుగా కాకుండా మేత మేసేందుకు, స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.  అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలు ఏర్పాటు చేసేందుకు పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్వహణ, సంరక్షణలో ధార్మిక సంస్థలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. గోశాలల నిర్మాణం, నిర్వహణ, సంరక్షణకు సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ అంచనాలతో ప్రణాళికలు రూపొందించాలన్నారు.

ఈ సంద‌ర్భంగా రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎంకేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించి పలు డిజైన్లను రేవంత్ రెడ్డి పరిశీలించారు.  షెడ్ల నిర్మాణం, ఇతర డిజైన్లలో పలు మార్పులను ఆయ‌న సూచించారు.  మరో నాలుగైదు రోజుల్లోగా తుది మోడల్ ను  ప్ర‌భుత్వం ఖ‌రారు చేయ‌నున్న‌ది.  ఈ సమీక్షా సమావేశంలో సీఎంఓ అధికారులు శేషాద్రి, శ్రీనివాసరాజు, మాణిక్ రాజ్, అజిత్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్, హెచ్ఎం ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, పశుపోషణ విభాగం డైరెక్టర్ బి.గోపి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page