ఫార్మాసిటీతో ప‌చ్చ‌ని పొలాలు ధ్వంసం

వికారాబాద్‌ ‌ఘటనపై మండిపడ్డ మాజీ మంత్రి హరీష్‌ ‌రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్ 11 : ‌వికారాబాద్‌ ‌జిల్లా ఫార్మాసిటీ ఘటనపై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయ‌న‌ మీడియాతో మాట్లాడుతూ.. గరీబీ హటావో అని ఇందిరా గాంధీ పిలుపునిస్తే.. ఫార్మా సిటీ పేరుతో పచ్చని పంట పొలాల నుంచి కిసాన్‌ ‌హటావో అని రేవంత్‌ ‌రెడ్డి పిలుపునిస్తున్నారని విరుచుకుపడ్డారు. రేవంత్‌ ‌పాలన పిచ్చోడి చేతిలో రాయిలా తయారైందన్నారు. ఆ రాయి ఈరోజు ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన వికారాబాద్‌ ‌రైతన్నల నెత్తిన పడిందన్నారు. అందుకే రైతులు రేవంత్ మీద ఉన్న కోపాన్ని జిల్లా కలెక్టర్‌, ‌ప్రభుత్వ అధికారుల మీద చూపుతున్నారని తెలిపారు. రేవంత్‌ ‌చేస్తున్న అసమర్థ పాలనకు ఐఎఎస్‌ ‌లు, ప్రభుత్వ అధికారులు ప్రజాగ్రహానికి గురవుతున్నారని తెలిపారు. ఫార్మా సిటీ కోసం కేసీఆర్‌ ‌హైదరాబాద్‌కు దగ్గరగా కాలుష్యం లేకుండా జీరో వ్యర్థాలతో 15 వేల ఎకరాలు సేకరించి సిద్ధం చేసినట్లు తెలిపారు. పర్యావరణం, అటవీ సహా అన్ని రకాల అనుమతులు వొచ్చిన దాన్ని పక్కన బెట్టి పచ్చటి పొలాల్లో ఫార్మా చిచ్చు పెడుతున్నారంటూ మండిపడ్డారు. జహీరాబాద్‌ ‌న్యాల్కల్‌ ‌మండలంలోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉందన్నారు. ఫార్మాసిటీ కోసం సేకరించిన భూమిని తన రియల్‌ ఎస్టేట్‌ ‌దందా కోసం వినియోగించే కుట్రతో ఈ సమస్య మొదలైందన్నారు. ‘నీ మీద, నీ పాలన మీద తిరగబడని వర్గం ఏదైనా ఉందా రేవంత్‌ ‌రెడ్డి.. ఇప్పటికైనా పిచ్చి పనులు మాని పరిపాలన మీద దృష్టి పెట్టాలని, పచ్చని పొలాల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి‘ అని హరీష్‌ ‌రావు డిమాండ్‌ ‌చేశారు.
——————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *