ఉత్తర భారత దేశంలో వరదలు విలయతాండవం చేశాయి. దక్షిణంలో తెలంగాణా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి.ఇక్కడ కూడా కూడా వరదలు రావడానికి అవకాశం ఉంది.వరదల సమయంలో ప్రభుత్వాలు శక్తికి మించి తీసుకున్న చర్యలు ఫలితంగా చాలావరకు ప్రాణ, ఆస్థి నష్టాలు తగ్గాయి . ఐతే వరదల తరువాత కూడా చాలా సమస్యలు తీవ్రమవుతాయి. వరద సమయం లో ముంపు ప్రాంతాలనుండి ప్రభుత్వాలు యంత్రాంగం సహాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరవేసింది. ఇప్పుడిప్పుడే ఉత్తరాది రాష్ట్రాలు వరద తీవ్రత నుండి కోలుకుంటున్నాయి. ఈ సమయంలో బాధితులు తొందరపడి వారి వారి ప్రాంతాలకు లేదా నివాసాలకు చేరుకోగూడదు.
సంబంధిత అధికారులు సూచనల మేరకు వారి నివాసాలకు చేరుకోవాలి. బాధితులు అక్కడకు చేరుకొనక ముందరే వరద వచ్చిన ప్రదేశాలలో కొట్టుకు వచ్చిన మానవ ,జంతువుల మృతదేహాలను తొలగించాలి. ఖాళీ ప్రదేశాలలో నిలువ ఉండిపోయే మిగులు నీరును పైపులు సహాయంతో తోడెయ్యాలి. నేల కూలిన వృక్షాలు, భవన శిధిలాలను తొలగించాలి. పరిసర ప్రాంతాలలో అంటువ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యవసరమైన మందులను సిద్ధంచేసుకోవాలి. నిత్యావసర సరుకులు వ్యాపారస్తులు బ్లాక్ చేయకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉండేటట్లు చూడాలి. నివాసాలు లేనివారికి తాత్కాలిక నివాసాలు, ఆహారం , బట్టలు వంటి సదుపాయాలు కల్పించాలి. విద్యుత్ సరఫరాను పునరుధ్దాంచాలి, మంచి నీటి సొకర్యాన్ని అందుబాటులో ఉంచాలి. అందరికీ అన్నీ సౌకర్యాలు కల్పించడం తలకు మించిన పని. ప్రజలు, స్వచ్చంధ సంస్థలు ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించాలి. ప్రజలు వారి గృహాలకు చేరుకునే క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్
ఆరోగ్య మరియు కుటుంబ మంత్రిత్వ శాఖ
భారత ప్రభుత్వం మరియు భారత వాతావరణ శాఖ వారు వేరు వేరుగా వరదల తరువాత తీసుకోవలసిన జాగ్రత్తలు గూర్చి కొన్ని మార్గదర్శకాలను ఇంతకు మునుపే విడుదల చేశారు.వాటిని పాటించవలసిన అవసరం అందరిమీదా వుంది. ఇళ్లన్నీ వర్షం మరియు వరదల వలన తడిసి ఉండడం వలన గోడలు దెబ్బతింటాయి. అవి కూలిపోయే ప్రమాదం ఉంది. అటువంటి ప్రదేశాలలో ఎట్టి పరస్థితుల్లోనైనా నివసించగూడదు. గృహాలు నివాసానికి సురక్షితంగా ఉన్నాయని నిర్దారణ చేసుకున్నాక లోపలికి వెళ్ళాలి. విద్యుత్ పరికరాలను తాకగూడదు. బ్యాటరీ లైట్ని ఉపయోగిస్తూ లోపలికి పోవాలి. భవనాలలో పాడైపోయిన ఇనుప వస్తువులు, విరిగిన గజాలు ఉండొచ్చు. వీటిని గమనించి భవనాలలోనికి వెళ్ళాలి. ముందుగా ఇంటిలోపల నిలువా ఉండి పోయిన నీటిని బయటకు పంపించాలి.
అక్కడ బ్లీచింగ్ చెయ్యాలి. తడిచిన వస్తువులని ఆరబెట్టాలి. ముఖ్యమైన డాక్యుమెంట్లుని జాగ్రత్త పరచుకోవాలి. వరదలు వలన ఇంట్లో పాములు చేరుతాయి.వీటిని పారద్రోలాలి. ఇది అత్యంత ప్రధానమైన జాగ్రత్తలలో మొదటిది. మొక్కలు , జంతువులు కుళ్లడం వలన మరియు నీరు కలుషితం అవడం వలన వీటికి దోమలు ,ఈగలు తోడవడం వలన మరియు సూక్ష్మ జీవులు, వైరస్ ల వలన మలేరియా, కలరా, అతిసారం, డెంగ్యూ, హెపటైటిస్ మొదలైన అంటు రోగాలు ప్రభలే అవకాశం ఉంది. చెత్త, కుళ్లిపోయిన వాటిని వీలైనంత త్వరగా తొలగించుకోవాలి.క్రిమి సంహారక మందులు జల్లాలి. మంచి నీటి బావులు, బోరు బావుల చుట్టూ బ్లీచింగ్ జల్లాలి.,ఇంట్లో తడిచిన ఆహార పదార్థాలను వాడగూడదు. త్రాగడానికి మంచి నీరు అందుబాటులో ఉంచుకోవాలి. ఒక వేళ పరిశుభ్రమైన నీరు లేకపోతే క్లోరిన్ బిళ్లలు నీటిలో కరిగించి కొంతసేపైన తరువాత ఆ నీటిని కాచి చల్లార్చిన తరువాత త్రాగడానికి ఉపయోగించాలి. ఆహారం వండడానికి మరియు తినే ముందు చేతులు కడుక్కోవాలి.
కూరగాయలు, పండ్లు మరియు ముడి పదార్థాలను ఉడికించే ముందు సురక్షితమైన నీటితో కడగాలి ఆహారం తయారుచేసే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచాలి.ఆహారాన్ని పూర్తిగా ఉడికించాలి.ఆహారాన్ని సురక్షితమైన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి. ఆహార పదార్థాలు వేడిగా ఉన్నప్పుడే భుజించాలి.ఇంకా ఇంతకుముందే గృహాల మీద , గృహ సామగ్రి మీద బీమా చేసి ఉంటే దానిని పరిష్కరించుకోవాలి.వరదలు వలన రోడ్లు అక్కడక్కడా తెగిపోయిగాని లేదా గుతకలు ఏర్పడతాయి. అందువల్ల వరదలు తగ్గిన వెంటనే రహదారులు మీద వాహనాలతో ప్రయాణం చేయడం అంత మంచిది కాదు. వరద ప్రాంతాలలో పిల్లలను అడనివ్వరాదు. పిల్లలు, గర్భిణీలు, బాలింతలు, వృద్ధుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. తిరిగి యధాతధ పరిస్థితులు వచ్చే వరకు అందరూ ప్రభుత్వ యంత్రాంగానికి సహాయకారిగా ఉండాలి.
డి. జె. మోహన రావు
యం.యస్సీ ( ఫిజిక్స్ & గణితం)
టీచర్, ఆమదాలవలస
శ్రీకాకుళం జిల్లా
ఆంధ్రప్రదేశ్, 9440485824




