కేబినెట్ నిర్ణయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 29: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ దిశగా కేంద్ర కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయంపై కేంద్రమంత్రి జీ. కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 8వ వేతన సవరణ సంఘం విధివిధానాలను ఆమోదించినందుకు కేంద్ర కేబినెట్కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన స్పందించారు. ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ అనే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నినాదం ఆధారంగా దేశంలోని ప్రతివర్గం సమగ్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కృషికి సరైన గుర్తింపు ఇవ్వడమే కాకుండా, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఈ నిర్ణయం కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. వేతన సవరణతో ఉద్యోగుల్లో ఉత్సాహం పెరగడంతో పాటు, కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉత్పాదకత పెరిగి ప్రజా సేవల నాణ్యత మరింత మెరుగవుతుందన్నారు. ఉద్యోగుల ఆర్థిక స్థితి మెరుగుపడటం ద్వారా దేశీయ వినియోగం పెరిగి, ఆర్థిక వృద్ధికి కూడా ఊతమిస్తుందన్నారు. నరేంద్రమోదీ నాయకత్వంలో ప్రభుత్వం ప్రజల సంక్షేమం, ఉద్యోగుల ప్రయోజనాల కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు. మోదీ నాయకత్వం వహించిన తర్వాత 2016లో 7వ వేతన సవరణ కమిషన్ ద్వారా ఉద్యోగులకు అనుకూలమైన సంస్కరణలు తీసుకువచ్చారు. 2006లో జరిగిన 6వ పీఆర్సీలో కనీస వేతనం రూ.7 వేలుగా ఉండగా, 7వ పీఆర్సీలో దాన్ని రెండున్నర రెట్లు పెంచి రూ.18 వేలుగా నిర్ణయించారు. అంతేకాక కనీసం 3 శాతం ఇంక్రిమెంట్ తప్పనిసరిగా ఇవ్వాలనే నిర్ణయం కూడా మోదీ ప్రభుత్వంలోనే తీసుకున్నారని గుర్తుచేశారు. ఇప్పుడు 8వ పీఆర్సీ ద్వారా కేంద్ర ప్రభుత్వం మరిన్ని మార్పులు తీసుకువచ్చిందని, ఈ నిర్ణయం ద్వారా 50 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 65 లక్షలకు పైగా పెన్షనర్లు లబ్ది పొందనున్నారని కిషన్ రెడ్డి తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





