- లక్ష్య సాధనకోసం దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాం
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13: 2030 నాటికి 20 గిగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోందని పునరుత్పాదక విద్యుత్ (గ్రీన్ పవర్) రంగం దిశగా రాష్ట్రం దృఢ సంకల్పంతో పనిచేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. డిసెంబర్ 14 నుంచి 20, 2024 వరకు నిర్వహించనున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ పొదుపు వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలంగాణ రాష్ట్ర పునరుత్పత్తి విద్యుత్ అభివృద్ధి సంస్థ (టిజి రెడ్కో) అధికారులు రూపొందించిన 2025 సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ పొదుపు క్యాలెండర్ను శుక్రవారం ప్రగతి భవన్లో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2030 నాటికి 20గిగావాట్ పునరుత్పత్తి విద్యుత్, 2035 నాటికి 40గిగావాట్స్ స్థాపన లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తుందని వెల్లడించారు. విద్యుత్ పొదుపు, విద్యుత్ సమర్థత సాధనకు అన్ని రంగాల్లో టెక్నాలజీ ఆధారిత చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. గత ఏడాదికాలంగా టిజి రెడ్కో చేపట్టిన కార్యక్రమాలను వి. సి. ఎండి. వావిల్ల అనిల డిప్యూటీ సీఎంకు వివరించారు. టిజి రెడ్కో విద్యుత్ పొదుపు, విద్యుత్ సమర్థతకు , బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ తో కలిసి వివిధ కీలక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. రాష్ట్రం ఈసీబిసీ అమలులో దేశంలోనే మొదటి స్థానంలో ఉందని ఈ కోడ్ ప్రకారం 879 కమర్షియల్ భవనాలు ఈసీబిసి అనుగుణంగా మార్పు చెందడంతో 392.21 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా జరిగిందని వివరించారు.
కూల్ రూఫ్ పాలసీ 2023-28:
తెలంగాణ కూల్ రూఫ్ పాలసీ దేశంలోనే మొట్టమొదటి పాలసీ అని, ఇది వేసవి కాలంలో తాపాన్ని తగ్గించి శక్తి వినియోగాన్ని తగ్గిస్తుందని తెలిపారు. డిమాండ్ సైడ్ మేనేజ్ మెంట్ చూస్తే హైదరాబాద్ నగరం మొత్తం 40మెగా వాట్ల విద్యుత్ ఆదా చేసిందని గర్వంగా చెప్పుకోవచ్చుని డిప్యూటీ సీఎంకు వివరించారు. రాష్ట్రంలోని 73 పట్టణాలు, గ్రామపంచాయతీలలో 17.23 లక్షల వీధి దీపాలు ఎల్ఈడీ లకు మార్చామని తెలిపారు. 32 లక్షల ఎల్ఈడీ బల్బులు, 20వాట్స్ ఎల్ ఈడీ ట్యూబ్ లైట్స్, 28వాట్స్ బిఎల్డిసీ ఫ్యాన్లు సరసమైన ధరలో పంపిణీ చేయడంతో 439 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా చేసినట్లు వివరించారు.
విద్యుత్ అవగాహన కార్యక్రమాలు:
విద్యార్థులలో విద్యుత్ సంరక్షణ మీద చైతన్యం కల్పించేందుకు 168 ఎనర్జీ క్లబ్బులు ఏర్పాటు చేశామని, ప్రభుత్వ సంస్థల్లో 57,483 పాత విద్యుత్ పరికరాలు ఆధునిక ఎల్ ఈడీలకు మార్పు చెందడంతో 2.87 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా జరిగిందని వివరించారు. ప్రతి సంవత్సరం తెలంగాణ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డస్ ఇచ్చి సంరక్షణా కార్యక్రమాల్లో విశిష్టమైన పనితీరు అందించినవారిని గౌరవిస్తున్నామని చెప్పారు. మూడుసార్లు జాతీయ విద్యుత్ పొదుపు అవార్డులను తెలంగాణ రాష్ట్రం అందుకుందని, విద్యుత్ పొదుపు వారోత్సవాల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మీడియా ద్వారా విస్తృత ప్రచారం, విద్యుత్ ర్యాలీలు, డిబేట్లు నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎంకు వివరించారు. కార్యక్రమంలో టీజీ రెడ్కో జిఎం ప్రసాద్, డిప్యూటీ జనరల్ మేనేజర్ వెంకటరమణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ రాధిక తదితరులు పాల్గొన్నారు.