హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13 : భూదాన్ భూముల వ్యవహారంలో ఓ మాజీ ఎమ్మెల్యే సహా నలుగురుకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 16న విచారణకు రావాలంటూ అందులో పేర్కొంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్కుమార్ను ఈడీ ఇప్పటికే విచారించిన విషయం తెలిసిందే. తాజాగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేతోపాటు వంశీరాం బిల్డర్స్ సుబ్బారెడ్డి, మరో ఇద్దరికి నోటీసులు ఇచ్చింది. ఐఏఎస్ అమోయ్కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన సమయంలో అబ్దుల్లాపూర్మెట్ మండలం పిగ్లీపూర్ రెవెన్యూ పరిధిలోని 17వ సర్వే నంబర్లో 386 ఎకరాల ప్రభుత్వ భూమిలో కొంత అన్యాక్రాంతమైనట్టు ఆరోపణలువొచ్చాయి.
ఇదే సర్వేనంబర్లోని ప్రైవేట్ భూమి 26 ఎకరాల్లో మెరుగు గోపాల్ యాదవ్ వెంచర్ వేసి సీలింగ్ ల్యాండ్ను కూడా కలుపుకున్నాడు. అయితే తమ భూమిలో గోపాల్ యాదవ్ వెంచర్ వేశాడని పలువురు రైతులు ఆరోపిస్తూ అప్పటి కలెక్టర్ అమోయ్కుమార్కు ఫిర్యాదు చేశారు. తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్నామని, తమ పేరిట పట్టాలు ఉన్నాయని ఆయన దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోలేదు. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో ఈ వ్యవహారంపై నిగ్గుతేల్చేందుకు ఈడీ రంగంలోకి దిగింది.