- రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు
- హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు వెల్లడి
- బూస్టర్ డోసు సర్వీస్ చార్జీ రూ.150 మించవద్దు : కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ
- కోవాగ్జిన్ బూస్టర్ డోసుతో వ్యాధి నిరోధక శక్తి రెండింతలు పెరిగింది : అధ్యయనాల్లో వెల్లడి
ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 9 : నేటి నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం బూస్టర్ డోసు టీకా ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని.. రెండో టీకా తీసుకుని 9 నెలలు నిండిన వారు ఇందుకు అర్హులని ఆయన వెల్లడించారు. కొరోనా విజృంభణ నేపథ్యంలో టీకా తీసుకోవడం కీలకమని ఆయన సూచించారు. ఒమిక్రాన్ వేరియంట్ అంతగా ప్రభావం చూపకపోవడానికి వ్యాక్సినేషనే కారణమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో జలవిహార్ వద్ద.. సీవీఆర్ కళాశాల సెన్సేషియా ‘పీస్ రన్’ పేరుతో నిర్వహించిన 5కే పరుగులో డీహెచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. జెండా ఊపి పరుగు ప్రారంభించారు.
దాదాపు 600 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. సే నో టూ డ్రగ్స్ ప్లకార్డులతో విద్యార్థులు పరుగు తీశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రపంచ శాంతి ఎంతో ముఖ్యమని…శాంతి పేరుతో నిర్వహిస్తున్న ఈ పరుగు అభినందనీయమని డీహెచ్ అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులు, యువతలో ఐకమత్యాన్ని పెంపొందిస్తాయని అభిప్రాయపడ్డారు.
బూస్టర్ డోసు సర్వీస్ చార్జీ రూ.150 మించవద్దు : కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ
బూస్టర్ డోసు సర్వీస్ చార్జీ రూ.150 మించవద్దని కేంద్ర ప్రభుత్వం శనివారం తెలిపింది. అలాగే తొలి, రెండో డోసుగా తీసుకున్న టీకానే బూస్టర్ డోసు లేదా ప్రికాషన్ డోసుగా తీసుకోవాలని సూచించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య కార్యదర్శులతో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివారం నుంచి ప్రైవేట్ హాస్పిటళ్లలో ప్రారంభం కానున్న ప్రికాషన్ డోసు విధివిధానాలపై చర్చించారు. దీనికి సంబంధించి పలు సూచనలు చేశారు. నేటి నుంచి ప్రైవేట్ హాస్పిటళ్లలో బూస్టర్ డోసు టీకాలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
అయితే ఇది ఉచితం కాదు. కొరోనా టీకా ప్రికాషన్ డోసు కావాలనుకునేవారు డబ్బులు చెల్లించి ప్రైవేట్ హాస్పిటళ్లలో ద్వారా పొందవచ్చు. దీనికి సంబంధించి కొవిన్లో రిజిస్టేష్రన్ కోసం కూడా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఏర్పాటు చేసింది. అయితే బూస్టర్ డోసు ధర ఎంత అన్నది స్పష్టం చేయలేదు. మరోవైపు కొవిషీల్డ్ టీకాను తయారు చేసిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా బూస్టర్ డోసు ధర రూ.600గా పేర్కొన్నారు. పన్నులు అదనమని వెల్లడించారు.
అయితే ఆసుపత్రులు, పంపిణీ దారులకు బూస్టర్ డోసు కొవిషీల్డ్ టీకాలపై భారీగా డిస్కౌంట్ ఇస్తామని ఆయన తెలిపారు. కాగా, భారత్ బయోటిక్ దేశీయంగా అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ బూస్టర్ డోసు ధర రూ.900గా ఉండనున్నది. దీనికి కూడా పన్నులు అదనం. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రికాషన్ డోసు సర్వీస్ చార్జీ గరిష్ఠంగా రూ.150 మాత్రమే ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు పరిమితి విధించింది.
కోవాగ్జిన్ బూస్టర్ డోసుతో వ్యాధి నిరోధక శక్తి రెండింతలు పెరిగింది : అధ్యయనాల్లో వెల్లడి
కోవాగ్జిన్ బూస్టర్ డోసుతో వ్యాధి నిరోధక శక్తి రెట్టింపు అయినట్లు ఓ స్టడీలో తేల్చారు. బూస్టర్ డోసుతో ఒమిక్రాన్తో పాటు అన్ని వేరియంట్లకు వ్యతిరేకంగా యాంటీబాడీలను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. రెండు డోసుల కోవిడ్ టీకా తీసుకున్న ఆరు నెలల వ్యవధి తర్వాత కోవాగ్జిన్ బూస్టర్ డోసు తీసుకున్న వారిలో ఇమ్యూనిటీ అధికంగా పెరుగుతున్నట్లు ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ నిర్వహించిన అధ్యయనంలో తేల్చారు. సుమారు 30 ముటేషన్లతో ఒమిక్రాన్ వేరియంట్ తీవ్ర భయాందో ళనలు కలిగించిన విషయం తెలిసిందే. టీకా ప్రభావం నుంచి కూడా ఒమిక్రాన్ తప్పించుకోగలదని భావించారు. అధ్యయనంలో భాగంగా 51 మంది సెరాలో ఉన్నయాంటీబాడీలను పరీక్షించారు.
రెండవ డోసు తీసుకున్న తర్వాత సేకరించిన నమోనాతో పాటు మూడవ డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత సేకరించిన సెరా నమోనాలను పరిశీలించారు. ఆ రెండు సెరాలపై కోవాగ్జిన్ ప్రభావాన్ని స్టడీ చేశారు. ఐసీఎంఆర్, భారత్ బయోటెక్ ఈ జనవరిలో ఆ స్టడీ నిర్వహించాయి. మార్చి 24వ తేదీన ట్రావెల్ మెడిసిన్ జర్నల్లో రిపోర్ట్ను ప్రచురించారు. బూస్టర్ డోసుతో యాంటీబాడీలు అధిక సంఖ్యలో ఏర్పడినట్లు డాక్టర్ గజానన్ సక్పాల్ తెలిపారు. అన్ని వేరియంట్లపై కోవాగ్జిన్ సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు సాక్పాల్ చెప్పారు.152 కోవాగ్జిన్ టీకాతో బీటా, ఒమిక్రాన్ వేరియంట్లతో పాటు అన్ని స్టెయ్రిన్లను నిర్వీర్యం చేసే శక్తి ఉన్నట్లు తేల్చారు. కొత్త కొత్త వేరియంట్లు ఉద్భవిస్తున్న నేపథ్యంలో బూస్టర్ డోసు సమర్థవంతం గా పనిచేస్తోందని స్టడీలో పేర్కొన్నారు.