నిర్వహణకు అధికారుల సన్నాహాలు
ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్5:గతంలో జరిగిన కొన్ని తప్పిదాల దృష్టిలో ఉంచుకుని గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 11వ తేదీ ఆదివారం పరీక్ష ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నారు. అయితే.. ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేట్ మూసివే స్తామని పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థులకు స్పష్టం చేసింది.ఉదయం 10 గంటల 15 నిమిషాల తర్వాత అభ్యర్థులను ఎగ్జామ్ సెంటరల్లోకి అనుమతి ంచేదని లేదని స్పష్టం చేసింది. ఇంకా ఓఎంఆర్ షీట్ ను నింపే విషయంలో చాలా అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఓఎంఆర్ షీట్ నింపే సమయంలో ఏమైనా మిస్టేక్ చేస్తే కొత్తది ఇచ్చే ప్రసక్తే లేదని కమిషన్ స్పష్టం చేసింది. అభ్యర్థులు కేవలం బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ తో మాత్రమే ఓఎంఆర్ షీట్లో ఆన్సర్లను బబ్లింగ్ చేయాలని కమిషన్ సూచించింది. పెన్సిల్, ఇంక్ పెన్, జెల్ పెన్లతో బబ్లింగ్ చేస్తే ఆ ఓఎంఆర్ షీట్లు చెల్లవని స్పష్టం చేసింది. డబుల్ బబ్లింగ్ చేస్తే కూడా అంగీకరించేది లేదని టీఎస్పీఎస్సీ వెల్లడించింది. అభ్యర్థులు హాల్ టికెట్ తో పాటు ఆధార్, పాన్ కార్డులు, ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు వంటి ఫొటోలతో కూడిన ప్రభుత్వ ఐడెంటిటీ కార్డులను తీసుకురావాలని అధికారులు సూచించారు. ఎగ్జామ్ సెంటర్ లో పరీక్షలు రాసే అభ్యర్థులు ఎవరైనా సరే నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు పెడుతామని హెచ్చరించారు.
భవిష్యత్తులో కమిషన్ నిర్వహించే పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తామని తెలిపారు. తెలంగాణ హైకోర్టు నిర్ణయంతో పరీక్షా నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయబోతున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. చాలా కాలంగా గ్రూప్ వన్ ఎగ్జామ్ కోసం దాదాపు 3 లక్షల 60వేలకుపైగా అభ్యర్థులు అతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలతో అభ్యర్థుల్లో నమ్మకం ఏర్పడింది. హైకోర్టు నిర్ణయంతో 11వ తేదీ ఆదివారం గ్రూప్ 1 ఎగ్జామ్ నిర్వహించాలని అధికారులు కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. మొత్తం 3 లక్షల 63 వేల మంది గ్రూప్ 1 ఎగ్జామ్ రాసేందుకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. 503 పోస్టులకు టీఎస్ పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.2022 ఏప్రిల్ 26న 503 పోస్టులతో తెలంగాణ తొలి గ్రూప్-1 ప్రకటనను టీఎస్పీఎస్సీ వెలువరించింది. రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల 63 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబరు 16న ప్రిలిమినరీ నిర్వహించగా 2,85,916 మంది రాశారు. పేపర్ లీకేజీ కారణంతో ఈ పరీక్షను రద్దు చేసి, జూన్11న నిర్వహించనున్నారు.
గ్రూప్ 1 పరీక్షకు తొలగిన అడ్డంకులు
పరీక్ష నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్,జూన్5(ఆర్ఎన్ఎ)
:తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలకు అడ్డంకులు తొలిగాయి. పరీక్ష నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీలపై విచారణ కొనసాగుతుందని.. ఈ సమయం లో పరీక్ష ఎలా నిర్వహిస్తారంటూ కొందరు కోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. వీటిపై సోమ వారం విచారించిన హై కోర్టు.. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు అభ్యంతరం లేదని.. నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థులు పరీక్ష రాసేందుకు సిద్ధంగా ఉన్నారని.. ఇప్పటికే లక్షా 20 వేల మంది హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారన్న ప్రభుత్వ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. గ్రూప్ 1 పరీక్షను టీఎస్ పీఎస్సీ పరిధిలో నిర్వహించకూడదని పిటీషనర్లు వాదించారు. పేపర్ లీకేజీ దర్యాప్తు కొనసాగుతుందని.. ఏ కమిషన్ లో అయితే పేపర్లు లీక్ అయ్యాయో.. అదే కమిషన్.. విచారణ పూర్తి కాకుండానే గ్రూప్ 1 పరీక్ష ఎలా నిర్వహిస్తుందని ప్రశ్నించారు.
11 సంవత్సరాల తర్వాత జరుగుతున్న గ్రూప్ 1 పరీక్ష అని.. పారదర్శకత లేకపోతే అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతారని పిటీషనర్ల తరపు లాయర్లు వాదించారు. పేపర్లు లీక్ అయిన పరీక్షలను మళ్లీ నిర్వహించకుండా.. హడావిడిగా గ్రూప్ 1 ఎందుకు నిర్వహిస్తున్నారంటూ పిటీషనర్ల తరపు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. విచారణ పూర్తయ్యే వరకు గ్రూప్ 1 పరీక్ష నిర్వహించకూడదని వాదించారు. ఈ వాదనను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశారు అని.. దర్యాప్తు తీరుపై కోర్టులు నిర్ణయం తీసుకుంటాయని.. అందులో భయపడాల్సిన అవసరం లేదంటూ.. పిటీషనర్లను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసింది హైకోర్టు.