ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులు
భారత్ సైనిక చర్యపై అఖిలపక్ష సమావేశం
ప్రధానమంత్రి మోదీ గైర్హాజరు
కేంద్రానికి అన్ని పార్టీల మద్దతు
పౌర మృతుల పరిహారం అంశం ప్రస్తావన
న్యూఢిల్లీ, ప్రజాతంత్ర, మే 8 : పహల్గామ్ ఉగ్రదాడి (ఏప్రిల్ 22) అనంతరం భారత సైన్యం చేపట్టిన ప్రతీకార చర్యగా నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా కొనసాగుతున్నదని కేంద్ర ప్రభుత్వం మే 8న జరిగిన అఖిలపక్ష సమావేశంలో వెల్లడించింది. ఈ దాడుల ద్వారా సుమారు 100 మంది ఉగ్రవాదులు, వారి సహచరులు హతమయ్యారని కేంద్రం అధికారికంగా తెలిపింది.
రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పూంఛ్, అఖ్నూర్ ప్రాంతాల్లో పాకిస్తాన్ గోలాబారీ కారణంగా జరిగిన పౌర మృతులు, పౌరుల తరలింపు, వారికి పరిహారం అంశాలపై విపక్షాలు ప్రభుత్వాన్ని కోరాయి.
ప్రధాని మోదీ గైర్హాజరుపై కాంగ్రెస్ విమర్శ
ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరు కాలేదు, ఇదే గత సమావేశంలోనూ జరిగింది. దీనిపై కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ “ప్రధాని స్వయంగా పాల్గొని సైనికుల ధైర్యాన్ని, ప్రభుత్వ వ్యూహాన్ని వివరించి ఉంటే దేశానికి బలమైన సందేశం వెళ్లేది” అన్నారు. ఈ సమావేశంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ, “ప్రతిపక్షాలన్నీ రాజకీయల కంటే దేశం మీద దృష్టి పెట్టాయని, ఇందుకు పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. . ఇది పరిపక్వ ప్రజాస్వామ్యానికి నిదర్శనం,” అని ప్రశంసించారు. ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ, పాక్ షెల్లింగ్లో మరణించినవారిని ఉగ్రవాద బాధితులుగా గుర్తించి, వారికి త్యేక నష్ట పరిహారం, ఇంటి పునర్నిర్మాణ సహాయం ఇవ్వాలని కోరారు. అదనంగా, పహల్గామ్ దాడికి బాధ్యత వహించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ పై అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయాలని, పాక్ను ఎఫ్ఏటీఎఫ్ గ్రే లిస్ట్లో చేర్చించే దిశగా ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ఒవైసీ మాట్లాడుతూ, “చైనాతో వాణిజ్యం దిగుమతులపైనే ఆధారపడుతోంది. గల్వాన్లో 50,000 మంది సైనికుల కూర్పు ఉన్న నేపథ్యంలో, చైనాను కూడా పాక్పై చర్యలు తీసుకునేలా ఒత్తిడి చేయాలి” అన్నారు.
ఇతర పార్టీలు – విపక్షాల సహకారం
ఈ సమావేశంలో టీఎంసీ నుంచి సుదీప్ బందోపాధ్యాయ్, ఆప్ నుంచి సంజయ్ సింగ్, సీపీఎం నుంచి జాన్ బృట్టాస్, ఐయూఎంఎల్ నుంచి మహ్మద్ బషీర్, ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే, డీఎంకే నుంచి టీ.ఆర్. బాలూ, సమాజ్వాది పార్టీ నుంచి రామ్ గోపాల్ యాదవ్, బీజేడీ నుంచి సస్మిత్ పత్ర, ఆర్జేడీ నుంచి పిసి. గుప్తా పాల్గొన్నారు. ఎన్డీఏ మిత్రపక్షాలుగా చిరాగ్ పాస్వాన్ (ఎల్జేపీ), లావు శ్రీకృష్ణ దేవరాయలు (టీడీపీ), శ్రీకాంత్ శిందే (శివసేన), సంజయ్ కుమార్ ఝా (జేడీయూ) హాజరయ్యారు.