నేడు ‘జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినం’
‘బ్లడ్ బ్యాంక్ సొసైటీ’తో పాటు ‘ఇండియన్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అండ్ ఇమ్యునో హెమ టాలజీ’ స్థాపించి ‘ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్’లో అపార సేవలు అంది ంచిన డా: జై గోపాల్ జోలీ తీసుకున్న చొరవను అభినందించాల్సిందే. డా: జై గోపాల్ జోలీ కృషిని గుర్తించి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఏట 01 అక్టోబర్న ‘జాతీయ స్వచ్ఛంధ రక్త దాన దినం’ నిర్వహిస్తూ, ఈ వేదిక ద్వారా రక్తదానం పట్ల అవగాహన కార్యక్రమాలను 01 అక్టోబర్ 1975 నుంచి నిర్వహించుకుంటున్నాం. జై గోపాల్ జోలీ సేవను గుర్తించిన వైద్య సమాజం వారిని ‘భారత మార్పిడి వైద్యశాస్త్ర పితామహుడి(ఫాదర్ ఆఫ్ ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ ఇన్ ఇండియా’గా పిలుస్తున్నారు. ప్రమాదం లేదా పలు వ్యాధితో బాధ పడుతున్న రోగుల ప్రాణాలు నిలుపడానికి అత్యవసరమైన రక్తం దాతల నుంచి స్వచ్ఛందంగా సేకరించుట జరుగు తున్నది. స్వల్ప సంఖ్యలో రక్తదాతలు ముందుకు రావడంతో రక్త కొరతతో వేల ప్రాణాలు గాల్లో కలుస్తుండటం విచారకరం. రక్త కొరతతో పాటు మన దేశంలో సరిపోయే రక్తనిధి కేంద్రాలు కూడా అందుబాటులో లేవు. ఆరోగ్యవంతులు రక్తదాన సేవ పట్ల అపోహలను తొలగించుకొని, తరుచుగా కనీసం ఏడాదికి 2-3 సార్లయినా (ప్రతి 3 మాసాలకు ఒకసారి) స్వచ్ఛందంగా రక్తదానం చేయుటకు ఉత్సుకత చూపడానికి ప్రేరణను కల్పించే వేదికగా 01 అక్టోబర్ను ఉపయోగిస్తారు.
గత వివరాల ప్రకారం భారత దేశంలో 12 మిలియన్ యూనిట్ల రక్తం అవసరం ఉండగా, 10.9 మిలియన్ యూనిట్లు మాత్రమే దాతల నుండి లభ్యం అవుతున్నందున 1.1 మిలియన్ యూనిట్ల కొరత ఏర్పడుతోంది. అనేక అభాగ్యులకు సమయానికి రక్తం అందక నిండు ప్రాణాలు గాల్లో కలుస్తున్నారు. 18-60 ఏండ్లు వయస్సుగల ఆరోగ్యవంతులైన వ్యక్తులు కనీస 45 కేజీల బరువు కలిగిన రక్త దాతల నుంచి ప్రతి 3 మాసాలకు ఒకసారి 33 – 350 మిల్లీ లీటర్ల రక్తం సేకరిస్తారు. స్వచ్ఛంధ రక్త దాత రక్తంలో 12.5 గ్రామ్స్/డియల్ హిమోగ్లోబిన్, రేబిస్/కాన్సర్/బిపి/షుగర్ /టిబి/హెచ్ఐవి-ఏయిడ్స్/సుఖవ్ యాధులు వంటి ఎలాంటి వ్యాధులు/రుగ్మతలు ఉండరాదు. ఆధునిక ప్రజారోగ్య వ్యవస్థలో స్వచ్ఛంధ రక్తదాతల అవసరం ఎంతగానో ఉంది. ఒకరి జీవితాన్ని కాపాడగలిగిన రక్తం, ప్లాస్మా, ప్లేట్లెట్లను దానం చేయడమనేది అతి ముఖ్యమైన సేవగా గుర్తించాలి. మన సమీప బంధువుల అవసరానికి కాకుండా విశ్వ మానవాళి ప్రాణాలు నిలుపడానికి రక్తదాన యజ్ఞం మన జీవితంలో అంతర్భాగం కావాలి.
మనం దానం చేసిన రక్తాన్ని అవసరార్థులకు ఇవ్వడానికి ముందు ఏయిడ్స్, హెపటైటిస్-బి/సి, మలేరియా, యస్టిడి, కోవిడ్-19, బ్లడ్ గ్రూపులు (ఏ,బి,ఏబి, ఓ) లాంటి పలు రక్త నాణ్యత పరీక్షలు చేస్తారు. రక్తదానం వ్యాపారం కారాదు. ధనాన్ని ఆశించి రక్తదానం చేయడమే వృత్తిగా తీసుకోవడం, అలాంటి దాతలను ప్రోత్సహించడం ప్రమాదకరం. స్వచ్ఛంధ రక్తదాన సేవల పట్ల యువతలో అవగాహన కల్పించడం, అనుమానాలను (రక్తహీనత కలుగుతుందని, సూదులకు భయపడడం, నొప్పికి భయపడడం, బలహీనం అవుతామని) నివృత్తి చేయడం, రక్తదాన శిబిరాలు నిర్వహించడం, అత్యవసర సమయాల్లో రోగులకు ప్రత్యక్షంగా దానం చేయడం లాంటి అంశాలను చేపట్టాలి. గుండె పంపింగ్ ద్వారా రక్తం నాళాల్లోంచి శరీరంలోని అన్ని కణజాలాలకు ఆక్సీజన్, పోషకాలను అందించడమే కాకుండా శరీరం నుంచి వ్యర్థాలను విసర్జించడానికి దేహద పడుతుంది. రోడ్డు ప్రమాదాలు, ప్రసవ సంక్లిష్టాలు, తీవ్ర రోగాలు, హింసాత్మక ఘటనలు లాంటి జరిగినపుడు సత్వరమే దాతల నుంచి రక్తం అవసరం అవుతుంది. మనందరం కనీసం మన పుట్టిన రోజు, పెళ్ళి రోజుల్లో లేదా ఇతర ముఖ్య తేదీల్లో ఏడాది ఒకటి రెండు సార్లు రక్తదానం చేయడానికి ప్రతిన బూనాలి. మన దేశంలో త్రిపుర రాష్ట్రంలో అత్యధిక స్వచ్ఛంధ రక్తదాతలు, మణిపూర్లో అత్యల్ప దాతలు ఉన్నారని గణాంకాలు వివరిస్తున్నాయి.
రెడ్క్రాస్, లయన్స్ క్లబ్స్, రోటరీ క్లబ్స్, యన్యస్యస్, యన్సిసి, పలు స్వచ్ఛంధ సంస్థలు, యువజన సంఘాలు, కళాశాలలు, యువజన సంస్థల్లో విధిగా రక్తదాన శిబిరాలు నిర్వహించి, స్వచ్ఛంధ రక్తదాతల వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి. పవిత్ర నిస్వార్థ ఆదర్శ సేవగా స్వచ్ఛంధ రక్తదానం పేరు గడించింది. ఆరోగ్యవంతుల శరీరంలో 4-5 లీటర్ల రక్తం ఉంటుంది. రక్తదానంలో విధిగా డిస్పోజబుల్ నీడిల్స్ వాడడం జరుగుతుందని తెలుసుకోవాలి. ప్లాస్మా దానాన్ని ‘ది గిఫ్ట్ ఆఫ్ లైఫ్’గా అభివర్ణిస్తున్నారు. రక్తంలోని పసుపు వర్ణపు ద్రవాన్ని ప్లాస్మాగా పిలుస్తూ, బలహీన రోగనిరోధకశక్తి ఉన్న రోగులకు అందిస్తారు. కోవిడ్-19 రోగులు, తీవ్ర ట్రామా, కాలిన గాయాలు, రక్తం గట్టని సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ప్లాస్మా అందిస్తారు. ప్లేట్లెట్ కణాలు రక్తం గడ్డకట్టడానికి, రక్తస్రావాన్ని ఆపడానికి ఉపయోగ పడుతుంది. ల్యుకేమియా, కీమోథెరపీ, డెంగ్యూ లాంటి అనారోగ్యాలకు ప్లేట్లెట్స్ అత్యవసరం అవుతాయి. ఇండియాలో రక్తం, రక్త ఉత్పత్తుల కొరత అధికంగా ఉన్నందున యువభారతం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్త కొరతను రూపుమాపుతూ రక్త కొరత వల్ల జరిగే ప్రాణ హానిని పూర్తిగా అరికట్టాలి.
డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
కరీంనగర్ – 994970003
కరీంనగర్ – 994970003




ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల