ఘటనా స్థలిని పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
అగ్ని ప్రమాద బాదిత కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 13 : సికింద్రాబాద్లో సోమవారం రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదం ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు రెండు లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేలు సాయం ప్రకటించారు. ఇక అగ్నిప్రమాదం జరిగిన సికింద్రాబాద్ రూబీ హోటల్ వద్ద ప్రమాద స్థలాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. అధికారుల నుంచి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన హోటల్ లోపలికి కిషన్ రెడ్డిని తొలుత పోలీసులు అనుమతించలేదు. బిల్డింగ్, సెల్లార్కి లాక్ వేశారు. లోకల్ ఎంపీని లోపలికి పంపించరా? అంటూ కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. దీంతో పోలీసులు లాక్ తీసి కిషన్రెడ్డిని లోపలికి అనుమతించారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం కిషన్ రెడ్డి వి•డియాతో మాట్లాడుతూ..సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది చనిపోవడం దురదృష్టకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయాలైన వారికి 50 వేలు ప్రకటించారు. మృతుల రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి వారిని ఆదుకోవాలని కోరుతానని కిషన్ రెడ్డి వెల్లడించారు. గతంలో కూడా హైదరాబాద్ లో ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్స్ జరిగాయన్నారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరపాలన్నారు.
ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగిందనేది తెలియాలన్నారు. వెహికిల్ మ్యానుఫ్యాక్చరింగ్లో లోపం ఉంటే ఎలక్ట్రికల్ వెహికిల్ కంపెనీపై కేసు పెట్టాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ అధికారులు కరెంట్ బిల్లు వసూలు చేయడానికే రాకూడదని.. ఇలాంటి కాంప్లెక్స్), అపార్టుమెంట్లలో తనిఖీలు చేయాలని సూచించారు. అన్ని వ్యాపార సంస్థల వారు, రెసిడెన్షియల్ కాంప్లెక్సుల వారు విధిగా ఎలక్ట్రిక్ వైరింగ్ సిస్టం ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలని కిషన్ రెడ్డి తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వొచ్చి.. ఎలాంటి సంబంధం లేకుండా ఇక్కడ చనిపోయారన్నారు.



