- ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదు
- టీఆర్ఎస్కు 90 స్థానాల్లో గెలుపు ఖాయం
- మీడియాతో మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 15 : కెసిఆర్ మూడోసారి సిఎం అయి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని మంత్రి కెటిఆర్ అన్నారు. ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు తెరదించుతూ తమకు ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదని షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని వెల్లడించారు. పార్టీ చేరికలపై తాము ఎవరినీ బలవంతం చేయలేదని పేర్కొన్నారు. తమకున్న సమాచారం ప్రకారం టీఆర్ఎస్ 90 సీట్లలో గెలుస్తుందని, కేసీఆర్ మూడోసారి సీఎం కావడం తథ్యమని, తమ పార్టీలో ఉన్న విభేదాలు తమ బలానికి నిదర్శనమని అన్నారు. దక్షిణాదిలో వరుసగా మూడోసారి సీఎం అయిన నేత లేరని అన్నారు. వొచ్చే ఎన్నికల్లో బలాలు..బలహీనతలు ఆధారంగా తాము అభ్యర్థులను ఎంపిక చేస్తామని, కేంద్రం అభివృద్ధిలో తెలంగాణ ఉంది కానీ తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం పాత్ర లేదని, తాను చెప్పింది అబద్ధం అని నిరూపిస్తే తాను పదవికి రాజీనామా చేస్తానని కెటిఆర్ అన్నారు.
గవర్నర్తో తమకు పంచాయితీ లేదని, రాహుల్ గాంధీ సిరిసిల్లకు వొస్తే స్వాగతిస్తామని, అయితే కాంగ్రెస్ పాలనలో ఎట్లున్నది..ఇప్పుడు ఎట్లున్నదనేది రాహుల్ చూడాలని అన్నారు. రాహుల్ గాంధీ రెండు రోజులు సిరిసిల్లలో ఉండాలని తాను కోరుతున్నానని, కేసీఆర్ అభివృద్ధి ఎలా చేశారో చూసి నేర్చుకోవాలని కెటిఆర్ అన్నారు. అమేథిలో రాహుల్, కొడంగల్లో రేవంత్ చెల్లని నాణేలని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎవరికీ బెదరడు..లొంగడని కేటీఆర్ చెప్పారు. వాపును చూసి కొందరు బలుపు అనుకుంటున్నారని, బీజేపీ డబుల్ ఇంజిన్ అంటే మోదీ, ఈడీ అని అన్నారు. మంచి పనులతో మనసులు గెలవడం బీజేపీకి తెలియదని, రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిందన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని కెటిఆర్ అన్నారు. రైతులపై కేంద్రం కక్ష కట్టినట్లు వ్యవహరిస్త్తుందని మండిపడ్డారు. త్వరలో కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు ఇస్తామని తెలిపారు. ధరణి సమస్యలను పరిష్కరిస్తామని కేటీఆర్ తెలిపారు.




