ఏం సాధించారని దశాబ్దపు ఉత్సవాలు: ఎమ్మెల్యే సీతక్క విమర్శలు
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్6: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారాలతో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క విమర్శలు గుప్పించారు. సోమవారం డియాతో మాట్లాడుతూ.. ప్రజలు ఏం సంతోషంగా ఉన్నారని ఉత్సవాలు చేస్తున్నారని ప్రశ్నించారు. పేపర్ లీకేజీని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఏం తప్పు చేసిందని బంగాళాఖాతంలో కలపాలని కేసీఆర్ అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై కాంగ్రెస్ను అధికారంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
ధరణి వలన రైతుల ఇబ్బందులను సీఎం కేసీఆర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించాలన్నారు. వీఆర్ఓ వ్యవస్థను తీసివేసి కేసీఆర్ రెవిన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. తెలంగాణలో మహిళలపై దాడులు జరుగుతున్నాయని.. కేసీఆర్ పాలనలో మహిళలకు ప్రాధాన్యత లేదన్నారు. మనుధర్మ శాస్త్రాన్ని అనుసరించండంలో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని ఎమ్మెల్యే సీతక్క వ్యాఖ్యలు చేశారు. ఒడిశా రైలు ప్రమాదంలో మరణించిన వారికి ఎమ్మెల్యే నివాళులర్పించారు. ఈ ఘటన దురదృష్టకరమని అన్నారు.




