పదేళ్ళకే ఆయన్ను మరచిపోయారా?
సెప్టెంబర్ 21 పదవ వర్ధంతి. 27వ తేదీ 97వ జయంతి
ఓట్ల రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలపక్షాన నిలబడి ఉద్యమాలు చేసిన ఉన్నతుడు. క్విట్ ఇండియా ఉద్యమం మొదలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాల వరకు స్వీయ రాజకీయ ప్రయోజనాలను పణంగా పెట్టి తెలంగాణ ప్రజలతో కలిసి అడుగులేసిన వ్యక్తిగా, రాజకీయ నాయకుడిగా విలువలకు, నీతికి, నిజాయితీకి కట్టుబడి నిర్భీతితో వ్యవహరించి, నియంతృత్వ నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా తలెత్తిన ఉద్యమంలో యువకార్యకర్తగా పాలుపంచుకుని రాజకీయ జీవితం ప్రారంభించి తన కాలానికి ప్రాతినిధ్యం వహించిన మహావ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇంత ఉన్నత వ్యక్తికి తెలంగాణా విమోచన/విలీన ఉత్సవాల నిర్వాహకులుగాని, తెలంగాణ స్వాతంత్య్ర సంరంభ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించిన విపక్షాలు, వామపక్షాలు అధికార పార్టీ, ఈ ఉత్సవాల్లో బాపూజీకి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు? తెలంగాణ పోరాటాలకు ఊపిరిగా నిలిచిన బాపూజీని స్మరించి సముచిత స్థానం ఇచ్చి ఆయన్ను గుర్తు చేసుకోలేదు? నిజాం వ్యతిరేక పోరాటంలో తమకు దన్నుగా నిలిచిన ఆయనకు కమ్యూనిస్టులు లాల్ సలాం చెయ్యలేదు. పటేల్ ను తమవాడుగా చెప్పుకున్న పార్టీ కాంగ్రెస్ నేతలు లక్ష్మణ్ బాపూజీని తమవాడు అని విస్మరించారా.. అమరవీరులకు వందనాలు చేసినచేసిన వారు ఆయన పేరు ఎక్కడా పలకలేదే.. కొండా లక్ష్మణ్ నివాసం జలదృశ్యం నుంచీ రాజకీయ పార్టీగా ఆవిర్భవించి,న అధికారంలోకి వచ్చి, 27వ తేదీని కొండా లక్ష్మణ్ బాపూజి జయంతి ప్రభుత్వ కార్యక్రమంగా ఆదేశాలు జారీచేసిన తెరాస ప్రభుత్వ వేదికలపై ఆయనకు నివాళులర్పించి కృతజ్ఞతలు తెలిపిన ఆనవాళ్ళు లేవే.
ఒక వ్యక్తి ఏడున్నర దశాబ్దాల పాటు పీడిత ప్రజల పక్షాన నిలబడి, ప్రజా ఉద్యమాలను నిర్మించి నిర్వహించడమంటే దాదాపు అసాధ్యం. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపారు. 1938నాటి వందేమాతర ఉద్యమం మొదలు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు ఆయన సాగించిన ప్రజాప్రస్థానం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాల్సిన ఘట్టాలు. వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతికోసం చేనేత, సహకార రంగాల్లోనూ ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైనది. .. సర్వజనామోద నాయకుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు సార్లు అవకాశం వచ్చినా అయినా బాపూజీ, తన విలువల పట్ల ఎక్కడా, ఎప్పుడూ రాజీపడలేదు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ మంత్రి పదవుల్ని నిర్వహించిన ఉదాత్తుడాయన. ప్రత్యేక తెలంగాణ కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన మహనీయుడు. మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసారు. తాను కాంగ్రెస్ రాజకీయాలతో మమేకమైనప్పటికీ ఎక్కువ కమ్యూనిస్టుల కేసులే అదీ ఫీజు లేకుండా వాదించారు. పేదలపాలిట దేవుడుగా నిలిచారు. అలుపెరుగని మహోన్నత పోరాటయోధుడు. వ్యక్తిగా, రాజకీయ నాయకుడిగా విలువలకు, నీతికి, నిజాయితీకి కట్టుబడి నిర్భీతితో వ్యవహరించిన మహనీయుడు.
ఆయన జీవితం తెలంగాణ విశాల రాజకీయ, సాంఘిక చరిత్రల తాలూకు వ్యక్తిగత ప్రతిఫలమే కాదు. వాస్తవానికి స్వాతంత్య్రానంతర భారతదేశపు రాజకీయాల చట్రానికి వెలుపల ప్రజారాజకీయాలకు అద్దం పడుతుంది. నైతికత, విలువల్ని రాజకీయాల్లో సైతం పాటించిన పాతతరానికి ఆయన ఆఖరు ప్రతినిధి… ఆయన కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమైన వ్యక్తిగాదు. చేపట్టిన చర్యలు ఆయన్ని మొత్తం తెలుగువారి నాయకుడిగా నిలబెట్టాయి. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామం వాంకిడిలో 1915 సెప్టెంబర్ 27న జన్మించిన కొండా లక్ష్మణ్ తల్లిదండ్రులు అమ్మక్క, బాపూజీ. తల్లి చిన్నతనంలో మరణించడంతో మేనత్త రంగమ్మ దగ్గర పెరిగారు. స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. వకాలత్ చదివి 1941లో ‘హైదరాబాద్ బార్’లో పేరు నమోదు చేయించుకున్న కొండా వకాలత్ చేస్తూనే సత్యాగ్రహాల్లో, క్విటి ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. వందేమాతర ఉద్యమంలో పాల్గొన్నందుకు జ్కెలుశిక్ష అనుభవించారు. చాకలి ఐలమ్మ కేసు మొదలు, జైని మల్లయ్యగుప్త జైలు నుంచి తప్పించుకున్న కేసు వరకు ఉచితంగా వాదించారు. ఎన్నింటిలోనో విజయం సాధించారు. 1945లో నిజాం రాష్ట్ర పద్మశాలి మహాసభ మొదలు చనిపోయే వరకు పద్మశాలి సంఘం కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
వకాలత్ చదివి 1941లో ‘హైదరాబాద్ బార్’లో పేరు నమోదు చేయించుకున్న కొండా లక్ష్మణ్ చాకలి ఐలమ్మ కేసు మొదలు, జైని మల్లయ్యగుప్త జైలు నుంచి తప్పించుకున్న కేసు వరకు ఉచితంగా వాదించారు. ఎన్నింటిలోనో విజయం సాధించారు. వకాలత్ చేస్తూనే సత్యాగ్రహాల్లో, క్విటి ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. వందేమాతర ఉద్యమంలో పాల్గొన్నందుకు జ్కెలుశిక్ష అనుభవించారు. 1945లో నిజాం రాష్ట్ర పద్మశాలి మహాసభ మొదలు చనిపోయే వరకు పద్మశాలి సంఘం కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. జాతీయోద్యమంలో సామాజిక మూలాలు వీడని ప్రజారాజకీయ పార్శ్వాన్ని ఆయన రాజకీయ భావజాలం ప్రకటించింది. ప్రజాస్వామ్య రాజకీయాలలో అంతర్భాగంగా భావించే వెనుకబడిన కులాల ఉద్యమానికి ఈ భావజాలమే ప్రాతిపదిక. ఏక కాలంలో నాలుగు భిన్నమైన, అంతర్గత సంబంధం కలిగిన ప్రజాఉద్యమాలతో ఆయన జీవితం ముడివడి ఉన్నదనడం సముచితం. చాలామంది నాయకుల మాదిరే, అహింస ప్రబోధించే గాంధేయతత్వానికి బహిరంగ జీవితంలో కట్టుబడి ఉన్నారు.
హైదారాబాద్ సంస్థానం దేశంలో విలీనమైన తర్వాత జరిగిన తొలి సార్వత్రక ఎన్నికల్లో 1952లో ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, తర్వాత ఎన్నికల్లో ఆసిఫాబాద్ రిజర్వ్ నియోజకవర్గంగా మారడంతో కార్యరంగాన్ని నల్లగొండ జిల్లాకు మార్చుకుని 1957లో చిన కొండూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1962 సార్వత్రక ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయినప్పటికీ ఆయన ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. తిరిగి 1967, 1972 ఎన్నికల్లో భువనగిరి నియోజకవర్గం నుంచి ఎశసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 1957-59 మధ్యకాలంలో ఉపసభాపతి బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గాల్లో కేబినెట్ మంత్రిగా వ్యవహరించారు.
1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, ప్రజలపై ప్రభుత్వం కాల్పులు జరపడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ వైఖరిని నిరసించి మంత్రి పదవికి రాజీనామా చేసారు. డిల్లీలో జరిగిన ఎఐసీసీ సమావేశాల్లో ఇంధిరాగాంధినే నిలదీసిన ఘనత బాపూజీకి ఉంది. 1969-71 మధ్య కాలంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా పనిచేసారు. నిజానికి మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమయిన ఆయన నివాసం జలదృశ్యం నుంచే, కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రకటించారు. 1925 సెప్టెంబర్ 27న జన్మించి 2012 అదే నెలలో 21న దివంగతులయ్యారు. జయంతి-వర్ధంతి కేవలం ఆరురోజుల వ్యవధిలో రావడం విశేషం. జయంతికి ఆరురోజుల ముందే వర్ధంతి. 97 వసంతాలు పూర్తిచేసుకున్న ఆయనను శతాయుష్కులు అనవచ్చు.
– నందిరాజు రాధాకృష్ణ, 98481 28215




