చర్యలు తీసుకోవాలంటూ సిఎం కెసిఆర్కు పిసిసి చీఫ్ రేవంత్ లేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 27 : సీఎం కేసీఆర్కు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి లేఖ రాశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉద్యోగాల కుంభకోణంపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే చందర్, మంత్రి కొప్పుల కలిసి 800 మంది నిరుద్యోగుల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేసి తాత్కాలిక ఉద్యోగాలిచ్చారని అన్నారు.
ఈ ఉద్యోగాల నియామకంలో రూ.50 కోట్లు చేతులు మారాయని చెప్పారు. అక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్యే, మంత్రిని బర్తరఫ్ చేయాలని లేఖ ద్వారా ఆయన డిమాండ్ చేశారు. వారిపై క్రిమినల్ కేసులు పెట్టి సమగ్ర విచారణ జరిపించాలని సూచించారు. ఆత్మహత్య చేసుకున్న యువకుడు హరీష్ కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా, బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు.




