- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, తరుణ్చుగ్, ఈటల హాజరు
- భారీగా తరలి వొచ్చిన బిజెపి శ్రేణులు
- మునుగోడు అభివృద్ధిని కెసిఆర్ అడ్డుకున్నారన్న బిజెపి అభ్యర్థి
నల్గొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 10: భారీ ర్యాలీతో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్,తరుణ్ చుగ్ వెంటరాగా బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి శ్రేణులు భారీగా తరలివచ్చారు. మునుగోడు ఉప ఎన్నికతో కేసీఆర్ పతనం ఖాయమని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం చండూరులో మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ దాఖలు చేసిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. మునుగోడు అభివృద్ధిని కేసీఆర్ అడ్డుకున్నారని విమర్శించారు. ఎన్నిసార్లు ఇక్కడి సమస్యలను లేవనెత్తినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యైనైనందుకు తనపై కక్షసాధింపుకు పాల్పడ్డారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రశ్నించే గొంతుకలు లేకుండా కేసీఆర్ అణగదొక్కుతున్నారని తెలిపారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తాను రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు.
దేశంలో ఏ సీఎం పాల్పడనంతా అవినీతికి కేసీఆర్ పాల్పడ్డారని ఆరోపించారు. కేసీఆర్ అవినీతి సొమ్మును మోడీ, అమిత్ షా కక్కిస్తారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. సీఎం కేసీఆర్ రూ.100 కోట్లు పెట్టి సొంత విమానం కొనేది దుబాయికో.. సింగపూర్ కో పారిపోవడానికేనని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడ్డదని, వాళ్లు జైలుకెళ్లడం ఖాయమని అన్నారు. మోడీ, అమిత్ షాలకు భయపడి కేసీఆర్ విమానం కొనుగోలు చేశారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఇచ్చే కాంట్రాక్టులకు ఆశపడి తాను బీజేపీలోకి వెళ్లినట్లు టీఆర్ఎస్ నాయకులు అసత్యం ప్రచారం చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి్ అయ్యారు. తాను బీజేపీకి అమ్ముడు పోలేదని యాదగిరి లక్ష్మినరసింహా స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తానని, మరి కాదని కేసీఆర్, కేటీఆర్ ప్రమాణం చేస్తారా అని రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. దేశం మొత్తం మునుగోడు వైపే చూస్తుందని, ఈ ఎన్నికతో కేసీఆర్ కుటుంబ పాలన అంతమవడం ఖాయమన్నారు. నల్గొండ జిల్లా ఉద్యమాల ఖిల్లా అని పేర్కొన్న రాజగోపాల్ రెడ్డి… దమ్ముంటే మునుగోడు నుంచి పోటీ చేయాలని కేసీఆర్ కు సవాలు విసిరారు. బీజేపీ పులి లాంటి పార్టీ అని, తన గెలుపుతో కేసీఆర్ పాలనకు బొంద పెడ్తామని చెప్పారు.
మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లను ప్రలోభపెట్టడానికి టీఆర్ఎస్ నాయకులు పోలీసుల వాహనాల్లోనే డబ్బు సంచులను తరలిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. సోమవారం మునుగోడు బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నామినేషన్ వేయగా… ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్, వివేక్ వెంకటస్వామితో పాటు ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడారు. మునుగోడు ప్రజల రుణం తీర్చుకోవడానికే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని తెలిపారు. రాజీనమా తర్వాత ఆయనకు వస్తున్న ప్రజా స్పందనను చూసి కేసీఆర్ ఫాంహౌజ్ నుంచి బయటకు వచ్చారని విమర్శించారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలనే కుట్రతో సీఎం కేసీఆర్ వందల కోట్ల రూపాయలు పంచి పెడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారం మొత్తం పోలీసుల ఆధ్వర్యంలో జరగడం సిగ్గచేటని మండిపడ్డారు.
టీఆర్ఎస్ కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మునుగోడులో తీష్ట వేశారని, వారంతా ఇక్కడి ప్రజలను రకరకాలుగా ప్రలోభపెడుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే మోటర్లకు మీటర్లు వస్తాయని, రైతు బంధు, కల్యాణ లక్ష్మి వంటి పథకాలు బంద్ పెడ్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో కాషాయ జెండా ఎగరడం ఖాయమని, ఈ విజయంతో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం కూడా పక్కా అని ధీమా వ్యక్తం చేశారు. సాక్షాత్తు సీఎం ఓ చిన్న గ్రామానికి ఎన్నికల ఇంచార్జ్ గా రానుండటం చూస్తే టీఆర్ఎస్ లో ఓటమి భయం మొదలైందని అర్థమవుతుందన్నారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గెలుపు 4 కోట్ల మంది ఆత్మగౌరవానికి ప్రతీక అని ఈటల రాజేందర్ తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చే డబ్బులను తీసుకోవాలని, ఓటు మాత్రం బీజేపీకే వేయాలని కోరారు. మునుగోడులో టీఆర్ఎస్ డబ్బు పంపిణీపై చర్యలు తీసుకోవాలని ఈటల రాజేందర్ ఎన్నికల కమిషన్ ను ప్రజలు మార్పు కోరుతున్నారు.




