వీడియో విడుదల చేసిన మావోయిస్ట్ పార్టీ
ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 18 : మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రాజిరెడ్డి..శుక్రవారం తుదిశ్వాస విడిచినట్టు వార్తలు గుప్పుమన్నాయి. అయితే..దండకారణ్యంలో రాజిరెడ్డి మృతిచెందినట్లు పేర్కొంటూ మావోయిస్టులు సోషల్ వి•డియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఎగ్లాస్పూర్ పరిధిలోని శాస్త్రులపల్లికి చెందిన రాజిరెడ్డి.. తొలితరం మావోయిస్టు నేతల్లో ఒకరు. ఆయన అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్లతో కూడిన మావోయిస్టుల నైరుతి ప్రాంతీయ బ్యూరోలో విప్లవాత్మక ఉద్యమానికి ఇంఛార్జిగా రాజిరెడ్డి పని చేశారు. మావోయిస్టు అగ్గనేతగా ఉన్న రాజిరెడ్డిపై దేశవ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి.
వివిధ రాష్ట్రాల్లో ఆయనపై కోటి రూపాయల రివార్డు కూడా ఉంది. పీపుల్స్ వార్ అగ్రనేతలతో కూడా రాజిరెడ్డి పనిచేశారు. కొండపల్లి సీతారామయ్య, గణపతి, సత్యమూర్తికి రాజిరెడ్డి సహచరుడు. ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ శ్రీపాదరావు హత్య కేసులో రాజిరెడ్డి నిందితుడిగా ఉన్నారు. 2008 జనవరిలో కేరళలో రాజిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయగా.. ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని మెట్పల్లి కోర్టులో హాజరుపరిచారు. చాలా కేసుల్లో నిందితుడిగా ఉన్న రాజిరెడ్డి రెండున్నరేళ్లు కరీంనగర్ జైలులో ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తపాల్పూర్లో నలుగురి హత్య కేసులోనూ రాజిరెడ్డి నిందితుడు. ఉమ్మడి ఆంధప్రదేశ్లో పీపుల్స్ వార్ చేసిన తొలి హత్యగా తపాల్పూర్ ఘటనను పేర్కొంటారు. ఆ కేసులో ఎ1 గా కొండపల్లి సీతారామయ్య, ఎ2గా రాజిరెడ్డిపై పోలీసులు కేసులు నమోదు చేయటం గమనార్హం.


