దిల్లీలో ప్రభుత్వ ప్రతినిధికి రాజీనామా
హైదరాబాద్,ప్రజాతంత్ర, ఫిబ్రవరి23: టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లురవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను సీఎం రేవంత్ రెడ్డికి మల్లురవి పంపించారు. తన రాజీనామాను ఆమోదిస్తారా లేక ఆమోదించకుండానే నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటిస్తారా అనేది సీఎం రేవంత్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉండనున్నది.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన బూస్టప్తో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. దీనిలో భాగంగానే జిల్లాలో బాగా పట్టున్న అభ్యర్థిని నాగర్ కర్నూల్ జిల్లా నుంచి బరిలో నిలపాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగానే మల్లు రవి రాజీనామా చేసినట్లు ఊహగానాలు వినిపిస్తున్నాయి. అయితే వారం క్రితమే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహబూబ్నగర్కు వంశీచంద్ పేరును ప్రకటించగా, నాగర్ కర్నూలుకు మల్లు రవి పేరు దాదాపు ఖరారు అయినట్లేనని భావిస్తున్నారు.




