దేశంలోనే మొట్టమొదటి జాతీయ ఎపిగ్రఫీ మ్యూజియంకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5 : చారిత్రక సంపద అయిన శాసనాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని సాంస్కృతిక శాఖ కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. మన చరిత్రకు, అస్థిత్వానికి, మన ప్రాచీన సంప్రదాయాలకు శిలాశాసనాలు ప్రతీక అని, ఆనాటి వ్యాపార కళా, ఆర్థిక, పాలనా వ్యవస్ధల గురించి చెప్పే అంశాలు శాసనాలలో ప్రతిఫలిస్తాయని మంత్రి అన్నారు. చరిత్ర పునర్నిర్మాణానికి ఆధారాలు భారతీయ జీవన స్థితిగతులకు శాసనాలే మూలమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలోనే మొట్టమొదటి జాతీయ ఎపిగ్రఫీ మ్యూజియంకు కిషన్ రెడ్డి సోమవారం హైదరాబాద్లో శంకుస్థాపన చేశారు. సాలార్జంగ్ మ్యూజియంలో భారత పురాతత్వ సర్వేక్షణ సంస్థ(ఏఎస్ఐ) హైదరాబాద్ విభాగం దీనికి ఏర్పాటు చేస్తుంది. ఈ సందర్భంగా, కేంద్ర మంత్రి మాట్లాడుతూ…శాసనాలు, తామ్ర పత్రాలు, శిలా శాసనాలు లేదా ఏదైనా పురాతన చారిత్రక వస్తువులు ఎక్కడైనా లభిస్తే, వెంటనే పురావస్తు శాఖ వారికి లేదా ప్రభుత్వ దృష్టి వెంటనే తీసుకురావాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో శాసనాల మ్యూజియం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవటంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
శాసనాల డిజిటలైజ్ ప్రక్రియ వేగంగా జరుగుతుందని, ప్రపంచ ఎపిగ్రఫీ కేంద్రంగా మారేలా సకల సదుపాయాలతో మ్యూజియంను తీర్చిదిద్దుతున్నట్లు ఆయన చెప్పారు. ప్రముఖ ఎపిగ్రఫిస్టు టిఎస్ రవిశంకర్ మాట్లాడుతూ..శాసనాల పరిరక్షణ, అధ్యయనానికి సంబంధించి ఎపిగ్రఫీ మ్యూజియం ఒక విలక్షణ సదుపాయమని పేర్కొన్నారు. తెలంగాణాలో లభ్యమైన శాసనాలను ఈ మ్యూజియంలో ఉంచుతున్నట్లు, ఇంటరాక్టివ్, డిజిటల్ బుక్ రూపంలో కూడా శాసనాలను అందుబాటులో ఉంచుతున్నట్లు, హిందీ, ఇంగ్లీషు బ్రాహ్మీ భాషలలో కూడా ఈ శాసనాలు అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎపిగ్రఫిస్టు ఎన్ఎస్ రామచంద్రమూర్తి మాట్లాడుతూ..తెలుగు రాష్ట్రాలలో వివిధ కాలాలకు చెందిన శాసనాలు, దేశంలో వివిధ కాలాల్లో ఆయా ప్రాంతాలు పోషించిన కీలక పాత్రను ప్రతిఫలిస్తాయని అన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, భాషా అంశాలకు సంబంధించిన పలు అంశాలను తెలియజేస్తాయని తెలిపారు. ఎఎస్ఐ అడిషనల్ డైరెక్టర్ జనరల్ గురుమీత్ సింగ్ చావ్లా మాట్లాడుతూ…పలు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాలు ఈ శాసనాలను అర్థం చేసుకోవటానికి వినియోగించినట్లు తెలిపారు. సాలార్ జంగ్ మ్యూజియం క్యూరేటర్ డాక్టర్ ఘనశ్యామ్ కుసమ్, ఎఎస్ఐ డైరెక్టర్ ఎపిగ్రఫీ మునిరత్నం, పురాతత్వ విభాగం ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.




