ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలకోసం కొత్తగా తీసుకొచ్చిన 317 జీఒ పెద్ద గందరగోళానికి దారి తీసింది. ఈ జీఒ కారణంగా తమ కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయంటూ పలువురు ఆందోళన బాట బట్టారు. రాష్ట్రంలో కొత్తజోన్లు, కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ఉద్యోగుల సర్దుబాటు కోసం ప్రభుత్వం ఈ జీఒ జారీ చేసింది.. అందులో పొందుపర్చిన మార్గదర్శకాలను ఉద్యోగులు,ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో రాష్ట్రంలో ఇప్పుడిది ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగుల ఆందోళనకు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతోపాటు మావోయిస్టు పార్టీకూడా మద్దతు పలకడంతో ఇదిప్పుడు తీవ్ర సమస్యగా మారింది. వెంటనే ఈ జీఒ ను రద్దుచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పాలనా సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్పటివరకున్న పది జిల్లాలను 33 జిల్లాలుగా విభజించింది. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఉద్యోగులను వర్క్ టు ఆర్డర్ కింద ఆయా జిల్లాలకు తాత్కాలిక ప్రాతిపదికన కేటాయించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోన్ల వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. అంతకుముందున్న రెండు జోన్లను ఏడు జోన్లుగా, మరో రెండు మల్టీజోన్లుగా విస్తరించింది. ఈ జోన్లలో ఉద్యోగస్తులను భర్తీ చేసేందుకే ప్రభుత్వ 317 జీఒ ను జారీ చేసింది. మల్టీ జోనల్, జోనల్ కేడర్ పోస్టుల్లో కన్నా జిల్లా కేడర్ ఉద్యోగులు సర్దుబాటు విషయంలో ముఖ్యంగా ఉపాధ్యాయుల నుంచి వ్యతిరేకత మొదలైంది. గతంలో సొంత జిల్లా నుంచి వేరే జిల్లాకు బదిలీపై వెళితే కనీసం నాలుగైదు ఏళ్ళకైనా సొంత జిల్లాకు వొస్తామన్న ఆశ ఉండింది. కానీ ఈ కొత్త జోనల్ వ్యవస్థలో కొత్త జల్లాలో శాశ్వత ఉద్యోగులుగా కేటాయించడంవల్ల ఇక తమ సొంత• జిల్లాకు వొచ్చే అవకాశాన్ని శాశ్వతంగా కోల్పోతున్నారు.
ఇక తామెప్పుడు తమ సొంత• జిల్లాకు పరాయి జిల్లావారిగానే ఉండిపోతుంటే, ఇతర జిల్లానుండి వొచ్చినవారేమో తమ జిల్లాలో శాశ్వత ఉద్యోగులుగా ఉండిపోతున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో కనీసం ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం వల్ల తాము అనేక విధాలుగా నష్టపోతున్నామంటున్నారు. అయితే తమ పలుకుబడి, సీనియార్టీలతో కొందరు తమకు అనుకూలమైన చోట పోస్టింగ్లు సాధించుకుంటున్నారని వారు వాపోతున్నారు. తెలంగాణలో దాదాపు లక్షా తొమ్మిదివేల మంది టీచర్లలో దాదాపు 22వేల మంది తామున్న జిల్లానుండి ఇతర జిల్లాలకు బదిలీ అయినవారు ఉన్నారు. చాలా కాలంగా ఒకే దగ్గర ఉన్నవారిని ఇప్పుడు సుదీర్ఘ ప్రాంతాలకు బదిలీ చేయడమే ఈ ఆందోళనకు కారణమయింది. ముఖ్యంగా మహిళా టీచర్లకు ఇబ్బందికరంగా మారింది. భర్త ఒక దగ్గర, భార్య మరోదగ్గర ఉద్యోగాలు చేయాల్సి రావడం ఒకటికాగా, కుటుంబానికి, పిల్లలకు దూరంకావడంతో అనేక సమస్యలు ఉత్పన్న మవుతున్నాయి.
కుటుంబంలో వృద్ధులను చూసుకునేవారు లేక తీవ్ర మానసిక వొత్తిడికి గురి కావాల్సి వొస్తున్నది. ఉన్నచోటు నుండి బదిలీ అయిన ప్రాంతానికి నిత్యం బస్సుల్లో ప్రయాణాలతో తీవ్ర అనారోగ్యానికి గురి అవుతున్నవారున్నారు. కొంతమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్న దాన్ని బట్టి మానసిక వొత్తిడి తట్టుకోలేక కొందరు ఆత్మహత్య చేసుకున్నట్లుకూడా తెలుస్తున్నది. ఇంత భారీ విధ్వంసానికి కారణంగా మారుతున్న ఈ జీఒ ను వెంటనే రద్దుచేయాలని ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమించాయి. గత కొద్ది రోజులుగా ఉపాధ్యాయులు ధర్నాలు, ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో ప్రభుత్వం వారిపై లాఠీలను ప్రయోగించింది. పలువురిని అరెస్టు చేసింది. దీంతో రాజకీయ పార్టీలు రంగంలోకి దిగి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి.
ప్రగతి భవన్ ముట్టడి యత్నం రణరంగంగా మారింది. చివరకు ప్రభుత్వానికి దిగిరాక తప్పలేదు. బదిలీల నేపథ్యంలో జారీ చేసిన 317 జీఒ లో సవరణ చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వొచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఉద్యోగుల పదోన్నతులు. బదిలీలపై సోమవారం తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ప్రక్రియను ఈ నెల 27న ప్రారంభించి 37 రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే భార్యాభర్తల (స్పౌజ్) కేసులకు సంబంధించి దాదాపు రెండు వేలకు పైగా ఉన్న కేసులకు సమస్యలను విడతల వారీగా పరిష్కరించేట్లు ఉపాధ్యాయ సంఘాలకు ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం జరిగే బదిలీల్లో వీరిలో ఇరవై నుండి ముప్పై శాతం మందికే అవకాశం కల్పించి, మిగిలిన వారిని బదిలీలు, పదోన్నతుల కౌన్సిలింగ్ పూర్తిఅయిన తర్వాత వారికి అవకాశం కల్పించే విధంగా హామీ ఇచ్చినట్లు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి.