- కాళేశ్వరంలో అవినీతి జరగకుంటే ఎందుకు అడ్డుకుంటారు
- పోలీసులు, డబ్బుతో మునుగోడులో గెలవాలన్న పన్నాగం
- కెసిఆర్ తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే ఈటల రాజేందర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : సీఎం కేసీఆర్ వైఖరిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. కాళ్లల్లో కట్టె పెట్టే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ సభకు అడ్డంకులు సృష్టించేందుకే ఆగమేఘాల వి•ద మునుగోడులో సీఎం సభ ఏర్పాటు చేశారని విమర్శించారు. టీఆర్ఎస్ సర్కారు ఎన్ని ప్రయత్నాలు చేసినా, కేసీఆర్ పార్టీని ఓడించాలని మునుగోడు ప్రజలు నిర్ణయించుకున్నారని ఈటల స్పష్టం చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేల నుంచి జిల్లా పరిషత్ ఛైర్మన్ల వరకు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఈటల రాజేందర్ చెప్పారు. అవినీతి జరగకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు వెళ్లే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. పోలీసులు, డబ్బును నమ్ముకుని మునుగోడు ఉప ఎన్నికలో గెలవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని ఈటల విమర్శించారు. ఇందులో భాగంగానే వేల కోట్ల రూపాయలను మునుగోడులో డంప్ చేశారని చెప్పారు.
టీఆర్ఎస్ ఎంత భయపెట్టినా స్థానిక నేతలు కట్టలు తెంచుకుని కాషాయ కండువా కప్పుకుంటారని చెప్పారు. టీఆర్ఎస్ నేతల అక్రమాలకు పోలీసు అధికారులు సహకరిస్తున్నారని ఈటల ఆరోపించారు. వారి అన్యాయాల లెక్క అప్పజెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతపై ఇంజనీర్లతో కమిటీ వేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం దగ్గర సరైన ప్లాన్ లేనందునే రాష్ట్రంలో కరెంట్ సమస్యలు తలెత్తుతున్నాయని అభిప్రాయపడ్డారు. పాలన విషయంలో సీఎం కేసీఆర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. సర్పంచులు, ఎంపీటీసీలను గ్రామాభివృద్ధికి దూరంగా ఉంచుతున్నారని మండిపడ్డారు.
ఘట్కేసర్లో ఆయన సమక్షంలో రాష్ట్ర స్థానిక సంస్థల అధ్యక్షుడు, మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి 200 మంది అనుచరులతో కలిసి బీజేపీలో చేరారు. రాష్ట్రంలో అవినీతి, కుటుంబపాలనను అంతం చేసేందుకు చాలా మంది బీజేపీలో చేరుతున్నారని ఈటల రాజేందర్ తెలిపారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని మండిపడ్డారు. రుణమాఫీ చేయకుండా రైతులను, పీఆర్సీ, డీఏలు ఇవ్వకుండా ఉద్యోగులను కేసీఆర్ మోసం చేశారని ఈటల విమర్శించారు.





