సోషల్ మీడియా వార్తలను ఖండించిన పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్
25న నడ్డా తెలంగాణలో పర్యటించనున్నట్లు వెల్లడి
న్యూ దిల్లీ, జూన్ 15 : ఈ నెల 25న బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారని తెలంగాణ బీజేపీ ఇన్చార్జ్ తరుణ్ చుగ్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని మార్చేది లేదని బీజేపీ జాతీయ నాయకత్వం స్పష్టత ఇచ్చిందన్నారు. గురువారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్లో జరిగే భారీ బహిరంగ సభలో నడ్డా పాల్గొననున్నారని తెలిపింది. అతి త్వరలో అమిత్ షా పర్యటన కూడా ఖరారు కానుందని వెల్లడించారు. వాయిదా పడిన పర్యటనను ఖమ్మంలోనే కొనసాగించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. నేతలంతా సమిష్టిగా కలిసి ఎన్నికల సమరంలో ఉంటారని తరుణ్ చుగ్ పేర్కొన్నారు. పార్టీలో ముఖ్య నేతలు అందరికీ కీలకమైన బాధ్యతలు ఉంటాయన్నారు.
రాష్ట్ర నాయకత్వం సమిష్టిగానే పనిచేస్తుందని తరుణ్ చుగ్ వెల్లడించారు. బీజేపీ ఎదుగుదలను చూసి ఓర్వలేక సామాజిక మాధ్యమాల్లో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ల మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయన్నడం అభూత కల్పనగా కొట్టిపడేశారు. నితీష్ నేతృత్వంలో విపక్షాల భేటీకి కాంగ్రెస్తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరవుతున్నారన్నారు. దీనికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెబుతారన్నారు. పై స్థాయిలో అంతా కలిసి పని చేస్తారని..రాష్ట్రానికి వొచ్చేసరికి విమర్శలు చేసుకుంటారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల సంస్కృతి ఇదేనన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు బీ టీంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందన్నారు. కొన్ని సందర్భాల్లో బీ టీంగా, కొన్నిసార్లు సి టీంలో కూడా కాంగ్రెస్ పార్టీనే పోటీ పడుతుందని తరుణ్ చుగ్ అన్నారు.


