ప్రజలు తరలి రావడంతో ట్రాఫిక్ జామ్
అర్జీలు స్వీకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19 : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక చేపట్టిన కార్యక్రమాల్లో ఒకటి ప్రజావాణి కార్యక్రమానికి జన సందోహం పెరిగింది. ప్రజాభవన్లో ప్రతీ మంగళవారం, శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా మంగళవారం ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రజావాణిలో ప్రజలు ఇస్తున్న వినతులను అధికారులు స్వీకరించారు. ఉదయం 10 గంటలలోపు ప్రజాభవన్ చేరుకున్న వారికి వినతులు ఇచ్చే అవకాశం ఉండటంతో భారీగా జనాలు తరలివచ్చారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి పలు జిల్లాల నుంచి ప్రజలు ప్రజాభవన్కు వొచ్చారు. ధరణి సమస్యలు, పెన్షన్, డబుల్ బెడ్ రూమ్ సమస్యలపైనే జనం ఎక్కువగా వొస్తున్న పరిస్థితి. ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొననున్నారు. ప్రజావాణికి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలిరావడంతో ప్రజా భవన్ పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడిరది. వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో పంజాగుట్ట, బంజారాహిల్స్, బేగంపేట, హెచ్పీఎస్, తాజ్ వివంతా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, షాపర్స్ స్టాప్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను క్లియర్ చేసారు.



