డిసెంబర్ 17…41వ జాతీయ పెన్షనర్ల దినోత్సవం
– ప్రజాతంత్ర డెస్క్
డిసెంబర్ 17ను జాతీయ పెన్షనర్ల దినోత్సవంగా జరుపుకోవడం అనవాయితీ. దేశవ్యాప్తంగా జిల్లా, మండల పెన్షనర్ల సంఘాల ఆధ్వర్యంలో అందుబాటులో గల సభ్యులంతా ఒక్కచోట చేరి, సీనియర్లకు సన్మానాలు, సత్తమ సేవకులకు అభినందనలు, పాత కొత్త విశ్రాంతుల కలయికలతో వేడుకగా సామూహిక భోజనాది కార్యక్రమాలను ఏటా నిర్వహించు కోవడం సంప్రదాయంగా మారింది. పెన్షన్ పొందడం ఉద్యోగికి ఒకరి ద్వారా దయాదాక్షిణ్యమో, భిక్షా కాదని, సుదీర్ఘ జీవన పోరాటంలో చేసిన త్యాగాలు, అందించిన అమూల్య సేవలకు గుర్తింపుగా, పెన్షన్ పొందే హక్కు ఉద్యోగికి ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమార్తి జస్టిస్ చంద్ర చూడ్ నేతృత్వంలోని న్యామూర్తులు డి.ఎన్. నకారా కేసులో 1982 డిసెంబర్ 17నే యాదృచ్ఛికంగా పెన్షనర్లకు అనుకూల తీర్పు వెలువరించారు. సదరు తీర్పు తో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం ద్వారా చట్ట భద్రత కలిగింది.
జీవిత మలి సంధ్యలో కోట్లాది రూపాయలు సంపాదించిన వారు కూడా తమ కుటుంబ సభ్యుల చేత నిర్లక్ష్యానికి గురవుతూ ఉంటారు. అయితే ఉద్యోగ విరమణ చేసిన పింఛను దారుల జీవిత చరమాంకం ఇందుకు భిన్నంగా కనిపిస్తుంది. విశ్రాంత ఉద్యోగి మరొకరికి భారం కాకుండా జీవించి ఉన్నన్ని రోజులు నెల నెలా పెన్షన్ రూపం లో డబ్బు చేతికి అందుతోంది. 80కి వయసు వచ్చినా పెన్షనర్లు ఉల్లాసంగా ఉండడానికి కారణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే పెన్షన్ సౌకర్యం అనేది ఎవరూ కాదన లేని వాస్తవం.
30 సంవత్సరాలకు పైగా ప్రభుత్వంకు సేవలందించి పదవీ విరమణ చెందిన ఉద్యోగులకు ప్రతి నెల ప్రభుత్వం ఇచ్చే గౌరవ భృతి పెన్షన్. అలాంటి పెన్షన్ పై ఆదాయపు పన్ను రద్దు చేయాలని గత 4 ఏళ్లుగా తెలంగాణ పెన్షనర్స్ ఆధ్వర్యంలో వివిధ రీతుల్లో ఉద్యమిస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు గాజుల నర్సయ్య ఆధ్వర్యంలో గత 3 ఏళ్లుగా ఢిల్లీ వెళ్లి జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేస్తున్నారు. ప్రధాన మంత్రికి, దేశ ఆర్థిక మంత్రికి పోస్ట్ కార్డులు పంపుతూ పెన్షనర్స్ కు ఆదాయపు పన్ను రద్దు చేయాలని మనవి చేస్తున్నారు. అయినప్పటికి కేంద్రం నుంచి స్పందన లేక పోవడంతో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ డిసెంబర్ మొదటి వారంలో ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్ ,మున్సిపల్ చైర్మన్ ల తో ప్రధాన మంత్రికి పోస్ట్ కార్డుల వినతులు పంపించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం 2023-24 లో బడ్జెట్ లో నైనా పెన్షనర్స్ కు ఆదాయపు పన్ను మినహాయింపు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పెన్షనర్ల సమస్యల పరిష్కారం, సంక్షేమం లక్ష్యంగా 2013 లో తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అస్సోసియేషన్ ను హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా కేంద్ర నివాసి గాజుల నర్సయ్య రాష్ట్ర అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నారు. 1969లో తెలంగాణ తొలి, తర్వాత మలి దశ ఉద్యమాల్లో పనిచేస్తూ, పలుసార్లు అరెస్టులకు గురయిన జగిత్యాల పట్టణ వాసి హరి అశోక్ కుమార్ లాంటి చిత్తశుద్ది పట్టుదల గల సమర్థ నాయకుల సలహాలతో ఎన్నో ఉద్యమాలు నడుస్తున్నాయి.
కేసిఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం పీఆర్సీ ఇచ్చింది. పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెంచింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా 70 ఏళ్లకే క్వాంటం పెన్షన్, గ్రాట్యుటీ రూ.16 లక్షలకు మంజూరు చేయడం జరిగింది. పెన్షనర్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పణలకు టీ యాప్ సౌకర్యం కల్పించి పలు ఇబ్బందులను ప్రభుత్వం తొలగించింది. పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఆరోగ్య కార్డుల నగదు రహిత వైద్య సేవలు అందించాలని, పీఆర్సీ బకాయిలు వాయిదాలు లేకుండా ఒకేసారి చెల్లించాలని, ఆర్టీసీ బస్సుల్లో 50 శాతం రాయితీ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వంను , పెన్షనర్ల కు ఆదాయపు పన్ను నుంచి మినహాయించాలని కేంద్ర ప్రభుత్వంను పెక్షనర్లు కోరడం సమంజసం.
దేశానికి స్వాతంత్రం వచ్చాక మౌలిక సదుపాయాలు లేని మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రజలకు సేవలందిస్తునే ఉన్నారు. సమాజం విప్లవాత్మక మార్పులు రావాలన్నా… అభివృద్ధి పనులు అందరికీ ఉపయోగపడాలనే ఆలోచనలకు అనుభవం అతి ముఖ్యమైన అంశం. తమ జీవితం అంతా ప్రజా శ్రేయస్సు కోసం ఉద్యోగ ప్రయాణం చేసి విశ్రాంతి తీసుకుంటూ తమ అనుభవాలను, ఆలోచనలను అందిస్తూ.. విశ్రాంత ఉద్యోగులు సమాజాభివృద్ధికి పాటు పడుతున్నారు.
అలాంటి విశ్రాంత ఉద్యోగులు ప్రభుత్వం సీనియర్ సీటీజన్స్, పెన్షనర్స్ ను దృష్టిలో ఉంచుకొని పలు రాయితీలు కల్పించాలని పెన్షనర్లు కోరుతున్నారు. ఆర్టీసి బస్సుల్లో, రైళ్లలో 50 శాతం రాయితీ కల్పించాలని, ఆరోగ్య కార్డులు ద్వారా అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదురహిత వైద్య సేవలు అందించాలని, ఆదాయపు పన్ను నుంచి పెన్షనర్స్ ను మినాహాయించాలని చేస్తున్న విజ్ఞప్తులు న్యాయబద్దం అని భావించాలి.