పత్రికల పంపిణీలో పేపర్‌ ‌బాయ్స్ ‌నిరుపమాన సేవలు

ఆధునిక సమాజంలో ప్రింట్‌ ‌మీడియా కన్నా సోషల్‌ ‌మీడియా వేగవంతంగా ముందుకు సాగుతోంది. స్మార్ట్ ‌ఫోన్‌ ‌లు అందుబాటు లోకి వచ్చాక డిజిటల్‌ ‌యుగంలో సామాజిక, డిజిటల్‌ ‌మాధ్యమాల ప్రభావం నానాటికీ పెరిగిపోతోంది. అప్డేట్స్ ‌తో వాట్సాప్‌, ‌ఫేస్‌ ‌బుక్‌, ‌ట్విట్టర్‌ ‌మాధ్యమాల ద్వారా విషయం వెనువెంటనే బహిరంగం అవుతుండగా, ప్రింట్‌ ‌మీడియా వాటి వేగానికి, టెక్నిక్స్ ‌కు పోటీ పడలేక పోతోంది. లైవ్‌ ‌వీడియోలతో వస్తున్న అంశాలు, బ్రేకింగ్‌ ‌న్యూస్‌ ‌కోసం అధిక సంఖ్యాకులు ప్రభావితులు అవుతున్నారన్నది వాస్తవం. నేటి వార్త తెల్లవారి మార్కెట్‌ ‌లోకి ప్రచురితం అయి వచ్చే సాంప్రదాయ పత్రికల కోసం చాలామంది ఎదిరి చూసే పరిస్థితులు కనిపించడం బాధాకరం.

ఒకనాడు నిత్యం ప్రపంచంలో ఏ మూల ఏమి జరిగినా ప్రజలకు వార్తా పత్రికలు మాత్రమే చెరవేసేవి. ప్రభుత్వాలకు ప్రజలకు మధ్యవర్తిత్వం వహిస్తూ వారథులుగా పత్రికలు పని చేసేవి. ప్రజా బాహుళ్యానికి నిత్యం చైతన్య పరుస్తూ, ప్రగతికి బాటలు వేసేవి. ఇప్పటికీ కొన్ని ఆ పనులు చేస్తూనే ఉన్నాయి.

గతంలో దిన, వార, పక్ష, మాస, ద్వైమాసిక, పత్రికలు…సాహిత్య, విద్య, ఉపాధి, పరిశోధన, సినిమా, హాస్య, విజ్ఞాన, ఆధ్యాత్మిక పత్రికలు… చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు లాంటి పిల్లల పత్రికలు వివిధ రకాలుగా అలరించేవి.

దిన పత్రికలు ప్రాచుర్యాన్ని పొందాక, సమాచార వ్యవస్థ అంతంత మాత్రమే ఉన్న నాటి రోజుల్లో నేటి పేపర్‌ ‌రేపు, ఉదయం రావాల్సిన పత్రికలు మధ్యాహ్నం పాఠకుల చేతికి చేరేవి. అయితే వేగవంతంగా పాఠకుని గుమ్మానికి పత్రికలను చేర్చేందుకు విప్లవాత్మక మార్పులు తెచ్చి, ప్రచురణ కేంద్రాలను పెంచుకుని, సర్క్యులేషన్లను త్వరితం చేసుకున్నాయి. అలాంటి స్థితిలో పత్రికలు పాఠకునికి చేర్చడంలో కీలక పాత్ర పోషించింది నిస్సందేహంగా పేపర్‌ ‌బాయ్‌.

‌నియమిత స్థలాల్లో పాత్రికేయులు ఆహరహం శ్రమించి, సేకరించి పంపిన వార్తలను ఉప సంపాదకులు సరిచేసి, సంపాదకుని ఆమోద ముద్ర పడిన తర్వాత ముద్రణకు రంగం సిద్దం చేశాక, ముద్రిత దిన పత్రికలను పాఠకులకు చేరవేయడం లో పేపర్‌బాయ్‌ల కష్టాలు, ఇబ్బందులు అందరికీ తెలిసిందే.నిర్ణీత ప్రదేశాలలో పంపిణీ వాహనాల కోసం అర్ధ రాత్రి దాటి నప్పటి నుంచి ఎదిరి చూస్తూ, అందుకున్న కట్టలు విప్పి, సెట్లుగా అమర్చుకుని, ఇళ్ళల్లో చందాదారులు, కొనుగోలు దారులు నిద్రలేచి, లేవక ముందే నడిచి లేదా సైకిల్‌పై వెళ్లి గడప గడపకు ఆగి, ముంగిళ్ళలో వేసి, తలుపుల బిడియాలకు చెక్కి పై అంతస్థులో ఉంటే ఎగురవేత ద్వారా వేసిన, వేస్తున్న విషయాలు నిత్య జ్ఞాపకాలే.

స్వాతంత్రోద్యమ సమయంలో లోకమాన్యుడు బాలగంగాధర్‌ ‌తిలక్‌ ‌పీపుల్స్‌వార్‌ ‌పత్రికకు కొన్నాళ్లపాటు పేపర్‌ ‌బాయ్‌గా పనిచేశారు. అలాగే ప్రఖ్యాత శాస్త్రవేత్త, దివంగత భారత రాష్ట్రపతిగా పనిచేసిన డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ ‌కలాం విద్యార్థి దశలో పేపర్‌ ‌బాయ్‌గా పని చేయడం, జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత రాపూరి భరద్వాజ, తెలంగాణ తొలి బి సి కమిషన్‌ ‌ఛైర్మెన్‌, ‌ప్రముఖ తత్వవేత్త, శతాధిక గ్రంథ రచయిత బి ఎస్‌ ‌రాములుగా చిర పరిచుతులైన బేతి శ్రీరాములు పేపర్‌ ఏజెంటుగా, బాయ్‌ ‌గా ఇలా గొప్పవారు పేపర్‌బాయ్‌లుగా పనిచేసిన వారే అన్న విషయం తెలుసు కోవాలి. అమెరికా లాంటి దేశాలలో వృత్తిపరంగా పెద్ద ఉద్యోగాలు చేస్తున్నా, నామోషీ గా భావించక వివిధ కారణాలతో కొందరు దిన పత్రికలు పంచడం చేస్తుండడం విశేషం.

పేపర్‌ ‌బాయ్‌ ‌పేరుతో జయశంకర్‌ ‌దర్శకత్వం వహించిన, భీమ్స్ ‌సిసిరొలియో సంగీతం అందించిన… సంతోష్‌ ‌శోభన్‌, ‌రియా సుమన్‌ ‌తాన్యా హోప్‌, ‌పోసాని కృష్ణ మురళి, అన్నపూర్ణ, బిత్తిరి సత్తి, విద్యుల్లేఖ రామన్‌, ‌కల్పలత, సన్నీ, అభిషేక్‌ ‌మహర్షి, మహేష్‌ ‌విట్ట తదితర తారాగణం నటించిన ఒక తెలుగు చలన చిత్రం 2018, ఆగష్టు 31న విడుదల కావడం గమనార్హం.

 

వాస్తవానికి ప్రింట్‌ ‌మీడియా ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలను కల్పిస్తునే ఉంది. అమెరికా, కెనడా వంటి అనేక దేశాలు తమ ప్రకటనల వాహకాలుగా ప్రింట్‌ ‌మీడియాపై ఎక్కువగా ఆధారపడు తున్నాయనే విషయం మరిచి పోలేనిది. ప్రభుత్వాలు కూడా చిన్న పెద్ద పత్రికలకు చేయూతను అందిస్తున్నాయి. పాత్రికేయులకు ఇళ్ళ స్థలాలు, ఆరోగ్య వైద్య సదుపాయాలు, ప్రయాణ టిక్కెట్‌ ‌టికెట్ల రాయితీ గల బస్‌ ‌పాస్‌ ‌లు, వివిధ రకాల యాడ్స్ ‌తదితరాలతో ప్రోత్సాహాలను అందించడం జరుగుతున్నది. అలాగే చదువుకోసం, ఆర్థిక స్వావలంబన కోసం,  జీవనోపాధి కోసం చాలామంది చాలా పత్రికలకు పేపర్‌ ‌బాయ్స్ ‌గా పనిచేస్తున్న వారిని ప్రభుత్వాలు, యాజమాన్యాలు గుర్తించాల్సిన అవసరం ఉంది. చేస్తున్న పని చిన్నదా పెద్దదా అన్నది కాకుండా, వారి సేవలను గుర్తించాల్సిన అవసరం అనివార్యంగా ఉంది.

రామ కిష్టయ్య సంగన భట్ల…

9440595494

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *