- నివాసయోగ్యమైన ఉత్తమ నగరంగా హైదరాబాద్
- ఎకో ఫ్రెండ్లీ నగరంగా తీర్చి దిద్దుతున్నాం
- రీ ప్లానెట్ ఇనిషియేటివ్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర: దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన ఉత్తమ నగరంగా హైదరాబాద్ ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. విశ్వనగరం హైదరాబాద్కు ఎన్నో అంతర్జాతీయ అవార్డులు, గుర్తింపు దక్కాయని తెలిపారు. ప్రపంచంలోనే నెంబర్ వన్ ఎకో ఫ్రెండ్లీ నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన రీ ప్లానెట్ ఇనిషియేటివ్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గత 5 వేల సంవత్సరాల్లో జరిగిన నగరీకరణ రాబోయే 50 ఏండ్లలో జరుగుతుందన్నారు. నగరీకరణతో పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఏర్పడిందన్నారు. దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ముందు వరుసలో ఉందన్నారు. హైదరాబాద్లో రోజు 6 వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు సేకరిస్తున్నామని తెలిపారు. వ్యర్థాలతో కరెంట్ ఉత్పత్తి చేసేందుకు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీల్లో ఎఫ్ఎస్డీపీ ప్లాంట్లు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. తెలంగాణకు జీడీపీ 45 శాతంపైగా అర్బన్ సిటీ నుండి వొస్తుందన్నారు. హైదరాబాద్ బెస్ట్ సిటీ ఇన్ ఇండియా అని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. గ్రీనర్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. వాతావరణంలో మార్పుల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని తెలిపారు. ఈ మధ్య కాలంలో క్లౌడ్ బరెస్ట్ అయ్యి ఒకే చోట భారీ వర్షపాతం నమోదవుతుందని గుర్తు చేశారు. డ్రై వేస్ట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని చెప్పారు. అన్ని మున్సిపాలిటీల్లో సివరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. దోమకొండ పోర్ట్, కులీకుతుబ్ షా పోర్టు యునెస్కో గుర్తింపు పొందిందని తెలిపారు. తెలంగాణలో 118 పురాతన కట్టడాలు పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. దేశంలో పట్టణీకరణ జరుగుతున్న నగరాల్లో తెలంగాణ రాష్ట్రం ముందుందని కేటీఆర్ స్పష్టం చేశారు.


